AP Grama Ward Secretariats : సచివాలయాల వర్గీకరణకు కమిటీ ఏర్పాటు - వ్యతిరేకిస్తున్న ఉద్యోగ సంఘాలు
గ్రామ సచివాలయల వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదికను సమర్పించడానికి ఫిబ్రవరి 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. మరోవైపు సచివాలయాల వర్గీకరణను ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
గ్రామ సచివాలయ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకురావడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా…. సచివాలయాల వర్గీకరణకు కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శశి భూషణ్ కుమార్ జీవో నెంబర్ 34ను విడుదల చేశారు.

కమిటీలో నలుగురు సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. నలుగురు సభ్యులను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆదేశం ప్రకారం నియమించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 28వ తేదీ లేదా అంతకంటే ముందే కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీల్లో సంస్కరణలు….
2010 నవంబర్ 24న ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 393 ప్రకారం గ్రామ పంచాయతీల్లో క్లస్టర్ వ్యవస్థను తీసుకువచ్చారు. గ్రామ పంచాయతీల ఆదాయం ఆధారంగా వర్గీకరించారు. ఈ వ్యవస్థలో రెండు లేదా మూడు గ్రామ పంచాయతీలను కలిపి సమూహపరచడం ద్వారా క్లస్టర్ల సమాచారాన్ని సులభతరం చేసిందని ప్రభుత్వం చెబుతోంది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం… స్థానిక సంస్థల్లో సంస్కరణలు తీసుకొచ్చింది. రాష్ట్ర స్థాయిల్లో ఉండే విధంగా గ్రామ, వార్డు స్థాయిల్లో కూడా సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టింది.
2019 జూలై 19న ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 110 ప్రకారం…. గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టింది. పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్-V, గ్రేడ్-VI పోస్టులను మంజూరు చేసింది. క్షేత్రస్థాయి పరిపాలనలో ఈ గణనీయమైన మార్పుల దృష్ట్యా క్లస్టర్ వ్యవస్థను తిరిగి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం భావించింది. గ్రామ పంచాయతీలను తిరిగి వర్గీకరించడం, ప్రతి వర్గానికి సిబ్బంది నమూనాను సవరించడం అత్యవసరమని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ విషయాల్లో ఇప్పటికే జిల్లా కలెక్టర్లు తమ ప్రతిపాదనలను సమర్పించారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించాల్సిన అవసరం ఉంది.
సమీక్ష కోసం కమిటీ ఏర్పాటు…
ఈ అవసరాల దృష్ట్యా గ్రామ పంచాయతీల పునర్విభజన, తగిన సిబ్బంది నమూనా కోసం సిఫార్సులను సమగ్రంగా సమీక్షించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించబడింది. ఈ ప్రతిపాదనను పరిశీలించిన ప్రభుత్వం… కమిటీని ఏర్పాటు చేసింది.
1. డి. సత్యనారాయణ- అదనపు కమిషనర్ (కమిటీ చైర్మన్)
2. వి. నాగార్జున సాగర్- డిప్యూటీ కమిషనర్ (కమిటీ కన్వీనర్)
3. కె. ఆనంద్ - కమిషనర్ ఓఎస్డీ (కమిటీ సభ్యులు)
4. కె. శ్రీదేవి - అసిస్టెంట్ కమిషనర్ (కమిటీ సభ్యులు)
గడువు ఫిబ్రవరి 28…..
ఈ కమిటీ అన్ని భాగస్వామ్య పక్షాలతో సంప్రదించి వారి నుండి అభిప్రాయాన్ని తీసుకుంటుంది. జిల్లా కలెక్టర్లు సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించి, సిబ్బంది నమూనాతో సహా కమిటీ తన సిఫార్సులను ఫిబ్రవరి 28 లేదా అంతకు ముందు ప్రభుత్వానికి సమర్పించాలి.
సచివాలయాల్లో 540 రకాల సేవలు…
గత వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలు ప్రజలకు 540 రకాల సేవలను అందించాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సచివాలయాలపై దృష్టి పెట్టింది. సచివాలయాల కొనసాగింపు విషయంలో తర్జనభర్జన పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే సచివాలయాలకు అనుబంధంగా ఉన్న 2.60 లక్షల మంది గ్రామ, వార్డు వాలంటీర్లను తొలగించింది. అసెంబ్లీ సాక్షిగానే ప్రభుత్వం వాలంటీర్లపై స్పష్టమైన ప్రకటన కూడా చేసింది.
అయితే సచివాలయ ఉద్యోగులను అలా చేయడానికి ఆస్కారం లేదు. అందువల్లనే సచివాలయాలను వర్గీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఉన్న సచివాలయాల్లో సిబ్బంది ఒక్కో చోట ఒక్కోలా ఉన్నారు. సచివాలయాల్లో సిబ్బంది అసమతుల్యంగా ఉండటంతో రేషనలైజేషన్ ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.
3 రకాలుగా ఉద్యోగుల వర్గీకరణ…
సచివాలయ వ్యవస్థను విభజించడానికి ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయా (11,162 గ్రామ, 3,842 వార్డు సచివాలయాలు)ల్లో 1,30,694 మంది ఉద్యోగులు ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను మూడు విభాగాలుగా విభజించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 1. మల్టీపర్పస్ ఫంక్షనరీస్, 2. టెక్నికల్ ఫంక్షనరీస్, 3. యాస్పిరేషనల్ సెక్రటరీలుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇలా ఉద్యోగులను విభజించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని, ఉద్యోగులపై భారం పెరుగుతుందని భావిస్తున్నారు. మరోవైపు ఈ వ్యవస్థ రద్దయితే…. వార్డు సచివాలయాల్లో కార్యదర్శులు మున్సిపల్ శాఖకూ, గ్రామ సచివాలయాల్లో సిబ్బంది… పంచాయతీ రాజ్ శాఖకూ మారిపోవడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.
రేషనలైజేషన్ విధానాన్ని విరమించుకోవాలి - ఉద్యోగుల సంఘం
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ చేసే విధానాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య డిమాండ్ చేసింది. రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు ,రాష్ట్ర అధ్యక్షురాలు అనురాధ, ప్రధాన కార్యదర్శి గురుస్వామి మాట్లాడుతూ…..రేషనలైజేషన్ (హేతుబద్దీకరణ) పేరుతో ఉద్యోగుల విభజన చేసే ప్రక్రియను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి గ్రామవార్డు సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కోరారు.
గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమబద్దీకరణ ఆలస్యం చేయడం వల్ల నష్టపోయిన 9 నెలల బకాయిలను ఏరియర్స్ రూపంలో వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జాయినింగ్ తేదీ నుండి సర్వీస్ లెక్కించి ఇవ్వవలసిన నోషన్ ఇంక్రిమెంట్లు వెంటనే ఇవ్వాలని కోరారు. పెండింగ్లో ఉన్న డీఏలు కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి వారి మాతృశాఖ ప్రకటించాలన్నారు. నిర్దిష్ట ప్రమోషన్ ఛానల్ వెంటనే ప్రకటించి, పనిభారం ఎక్కువగా ఉన్న సచివాలయ ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గగించాలని డిమాండ్ చేశారు. మరి ముఖ్యంగా వార్డు సచివాలయాల్లో పనిచేసే శానిటేషన్ సెక్రెటరీలకు, మిగితా సచివాలయ ఉద్యోగుల ఉండే సమయ పాలన పాటించే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. ఏఎన్ఎం, హెల్త్ సెక్రెటరీలకు యాప్ల పనిభారం తగ్గించాలని కోరారు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ విధానాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. ఈ నెలాఖరులోగా జిల్లా కలెక్టర్లకు, మంత్రులకు, ప్రజా ప్రతినిధులకు వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం