ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంపుపై గత కొన్ని రోజులు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ ఛార్జీలు పెంపుపై కీలక ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వానికి విద్యుత్ ఛార్జీలు పెంచే ఆలోచన లేదన్నారు.
విద్యుత్ ఛార్జీలను పెంచే ప్రసక్తి లేదని, ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. యాక్సిస్ గ్రూప్ ఫీల్డ్ ఎనర్జీ విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేసేందుకే సమయం సరిపోతుందని అన్నారు.
గత ప్రభుత్వం విద్యుత్ శాఖను ఒక ఆదాయ వనరుగా వాడుకుందని మంత్రి గొట్టిపాటి ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో యాక్సిస్ ఎనర్జీ యూనిట్కు రూ.5.12లకు ఒప్పందం చేసుకుందని, కూటమి ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని సవరించి రూ.4.60లకు యూనిట్ విద్యుత్ సరఫరా చేసేలా ఒప్పందం చేసుకుందన్నారు. ప్రజలపై భారం పడకుండా, తక్కువ ధరకే విద్యుత్ను అందించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
రాయలసీమ, ప్రకాశం జిల్లాలో రెన్యువబుల్ ఎనర్జీకి ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమారు తెలిపారు. రెన్యువబుల్ ఎనర్జీకి రాయలసీమ అనుకూలమని చెప్పారు.
తప్పు చేసిన వారికే రెడ్బుక్ వర్తిస్తుందని, అంతే తప్ప ఎవరినీ ఇబ్బంది పెట్టదన్నారు. రాయలసీమలో 2014-19లో రెనోవబుల్ ఎనర్జీ ద్వారా 7 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేసి చూపించామని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీ పెంచలేదన్నారు. ఇకపై కూడా పెంచకుండా ఉండేందుకు చర్యలు చేపడతామన్నారు.
"2022 నవంబర్ లో కేవలం సోలార్ విద్యుత్ ను రూ.5.12 కి యూనిట్ కొనుగోలు చేసేలా గత వైసీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సోలార్, విండ్, బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ను యూనిట్ కు రూ. 4.60 కు పీక్ అవర్స్ లో సరఫరా చేసేలా ఒప్పందం చేసుకుంది.
పీక్ అవర్స్ లో కూటమి ప్రభుత్వం రూ.4.60కు కొనుగోలు చేస్తున్న యూనిట్ ను గత వైసీపీ ప్రభుత్వం రూ.9.30కు కొనుగోలు చేసింది" -మంత్రి గొట్టిపాటి రవికుమార్
వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ప్రజల నెత్తిన సుమారు రూ.1.29 లక్షల కోట్ల భారం వేసింది మంత్రి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో సెకీతో చేసుకున్న ఒప్పందంతో డిస్కంలు, ట్రాన్స్ కో, జెన్ కోలు పూర్తిగా నాశనం అయ్యాయని చెప్పారు.
సంబంధిత కథనం