AP EAMCET Counselling 2024 Schedule: ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి కీలక అప్జేట్ అందింది. ఏపీ ఈఏపీసెట్ 2024 అడ్మిషన్ల ప్రక్రియ జులై 1 నుండి ప్రారంభమవుతుందని సాంకేతిక విద్యాశాఖ సంచాలకులు, ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ బి నవ్య తెలిపారు.
ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లిపు ప్రక్రియ జులై ఒకటి నుంచే ప్రారంభం అవుతుందని ప్రకటించారు. జులై 7వ తేదీ లోపు పూర్తి చేయవలసి ఉంటుందన్నారు. జులై 4 నుండి 10 వ తేదీ వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు.
జులై 8 నుండి 12 వరకు 5 రోజుల పాటు వెబ్ ఆప్షన్ల ఎంపిక పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని కన్వీనర్ స్పష్టం చేశారు. ఐచ్చికాల మార్పునకు జులై 13వ తేదీని తుది గడువు ప్రకటించారు.
జులై 16వ తేదీన సీట్ల కేటాయింపును పూర్తి చేస్తామని తెలిపారు. సెల్స్ జాయినింగ్, కళాశాలలో రిపోర్టింగ్ కోసం జులై 17 నుంచి 22 వరకు ఆరురోజుల పాటు అవకాశం ఉంటుందని వివరించారు. జులై 19వ తేదీ నుండే తరగతులు ప్రారంభం అవుతాయని ప్రకటించారు. బీ - ఫార్మసీ అడ్మిషన్ల కు సంబంధించి ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు.
ఏపీ ఈఏపీసెట్-2024 పరీక్షలను కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 142 పరీక్ష కేంద్రాల్లో మే 16 నుంచి 23 వరకు పరీక్షలు జరిగాయి.
ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 3,62,851 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 3,39,139 మంది పరీక్షలకు హాజరయ్యారు. అంటే 93.47 శాతం మంది పరీక్షలు రాశారు. ఈఏపీసెట్లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ కల్పించి వీటి ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు.
ఈ ఏడాది ఇంజినీరింగ్ విభాగంలో 2,74,213 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,58,374 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,95092 మంది ఉత్తీరణ సాధించారు. అగ్రికల్చర్ విభాగంలో 88,638 మంది దరఖాస్తు చేసుకోగా 80,766 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 70,352 మంది ఉత్తీర్ణత సాధించారు.
సంబంధిత కథనం