ఏపీలో రాబోయే మరికొన్ని గంటల్లో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ అనకాపల్లి, తూర్పుగోదావరి, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనితో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయి. అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు మరో నాలుగు రోజులపాటు కొనసాగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రేపు(మంగళవారం) శ్రీకాకుళం,విజయనగరం,మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఎల్లుండి శ్రీకాకుళంలో రెండు మూడు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
విజయనగరం జిల్లా బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, గుర్ల, కొత్తవలస మండలాలు, మన్యం జిల్లా బలిజిపేట, గరుగుబిల్లి, సీతానగరం మండలాల్లో(8) వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఉష్ణోగ్రతలు 40-42°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందన్నారు. సోమవారం వైఎస్సార్ జిల్లా సిద్ధవటంలో 41.1°C అధిక ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.
తెలంగాణలో రానున్న ఐదు రోజుల వాతావరణం రిపోర్టును హైదరాబాద్ వాతావరణ శాఖ విడుదల చేసింది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట మరియు యాదాద్రి భువనగిరి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
సంబంధిత కథనం