రాష్ట్రంలో ఉంటున్న పాకిస్థాన్ పౌరులంతా ఈ నెల 27లోగా వెళ్లిపోవాలని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆదేశించారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో… కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా… ఏపీ పోలీసులు కూడా పాక్ పౌరుల విషయంలో ఆదేశాలను జారీ చేశారు.
పాకిస్థానీలకు జారీ చేసిన అన్ని వీసాలను కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో ఏపీ డీజీపీ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 27లోగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాక్ పౌరులు దేశం విడిచి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. పహల్గామ్ దాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
విదేశీయుల చట్టం 1946 కింద పాకిస్థానీయులకు జారీ చేసిన వీసాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని తన ప్రకటనలో పేర్కొన్నారు. మెడికల్ వీసాలపై వచ్చిన పొరుగు దేశ పౌరులు ఏప్రిల్ 29 లోగా వెళ్లిపోవాలని సూచించారు. అయితే దీర్ఘకాలిక, దౌత్య, అధికారిక వీసాలకు ఈ నిబంధనలు వర్తించవని స్పష్టం చేశారు.
కేంద్ర హోంశాఖ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా పాకిస్థానీలు ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హెచ్చరించారు. ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్ లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన జేసీ చంద్ర మౌళి (68), ఎస్ మధుసూదన్ (45) అనే ఇద్దరు పర్యాటకులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణకు వచ్చిన పాకిస్తాన్ దేశ పౌరులు… ఏప్రిల్ 27లోపు వెళ్లిపోవాలని ఆ రాష్ట్ర డీజీపీ జితేందర్ సూచించారు. మెడికల్ వీసాపై వచ్చిన వారికి ఏప్రిల్ 29 వరకు గడువు ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 30 వరకు అటారి వాఘ బార్డర్ తెరిచి ఉంటుందని… ఈలోపు వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ఇక్కడే ఉంటే… న్యాయపరమైన చర్యలు ఉంటాయన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు.. హైదరాబాద్ పోలీసులు నగరంలో ఉంటున్న పాకిస్తాన్ జాతీయుల వివరాలపై ఆరా తీస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. హైదరాబాద్లో 208 మంది పాకిస్తానీలు నివసిస్తున్నారు. వీరిలో.. 156 మంది దీర్ఘకాలిక వీసాలపై ఉన్నారు. 13 మంది స్వల్పకాలిక వీసాలపై ఉన్నారు. మిగిలిన 39 మంది వైద్య, వ్యాపార వీసాలపై నగరానికి వచ్చినట్టు తెలుస్తోంది.