Pawan Kalyan : మహాకుంభ మేళాలో పవన్ కల్యాణ్, కుటుంబ సమేతంగా పుణ్యస్నానం
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబ సమేతంగా మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేశారు. ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసి గంగాదేవికి పూజలు చేశారు.

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబ సమేతంగా మహాకుంభమేళాలో పవిత్రస్నానం చేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కు వెళ్లిన పవన్ కల్యాణ్ మహా కుంభమేళాలో పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. గంగమ్మతల్లికి పూజలు చేసి, హారతులిచ్చారు. పవన్ కల్యాణ్ తో పాటు ఆయన సతీమణి అన్నా లెజ్నేవా, కుమారుడు అకీరా నందన్, దర్శకుడు త్రివిక్రమ్ ఉన్నారు.
కుంభమేళాలో వెంకయ్య నాయుడు పుణ్యస్నానం
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మహా కుంభమేళాలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రయాగ్ రాజ్ త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ఇందుకు సంబంధిత ఫొటోను ఆయన ఎక్స్ లో పంచుకున్నారు. మహా కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద మత, ఆధ్యాత్మిక వేడుక అన్నారు. సనాతన సంప్రదాయం, వారసత్వానికి ఇదో గొప్ప ప్రతీకగా వెంకయ్య పేర్కొన్నారు. దేశ ప్రజలందరూ ఆరోగ్యంగా, సౌభాగ్యంగా ఉండాలని గంగమ్మతల్లిని ప్రార్థించినట్లు తెలిపారు.
55 కోట్ల మంది పుణ్యస్నానాలు
ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళాకు భక్తులు తండోపతండాలు వస్తున్నారు. మంగళవారం సాయంత్రానికి 55 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్లు ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. మానవ చరిత్రలో ఏ మతపరమైన, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమంలో ఇంత భారీగా జనం పాల్గొనలేదని తెలిపింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
జనవరి 13వ తేదీన మొదలైన మహాకుంభ మేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. దేశంలోని 110 కోట్ల మంది సనాతనుల్లో దాదాపు సగం మంది పవిత్ర త్రివేణీ సంగమంలో స్నానం ఆచరించారని యూపీ ప్రభుత్వం తెలిపింది. ఫిబ్రవరి 26 నాటికి ఈ సంఖ్య 60 కోట్లు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 14 నాటికి కుంభమేళా భక్తులు 50 కోట్ల మార్కును అధిగమించింది. తాజాగా 55 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం తెలింపింది.
జనవరి 29న మౌని అమావాస్య సందర్భంగా దాదాపు 8 కోట్ల మంది ప్రయాగ్రాజ్కు వచ్చారు. మకర సంక్రాంతి నాడు 3.5 కోట్ల మంది, జనవరి 30న రెండు కోట్ల మందికి పైగా భక్తులు గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం పేర్కొంది.
సంబంధిత కథనం