YS Sharmila On Jagan : బలం లేకనా? ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా..? మీ ధర్నాకు ఎందుకు మద్దతు ప్రకటించాలి - షర్మిల ప్రశ్నలు
YS Sharmila On Jagan : వైసీపీ అధినేత జగన్ కు వైఎస్ షర్మిల సూటిగా పలు ప్రశ్నలను సంధించారు. జగన్ ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ప్రశ్నించారు.
YS Sharmila On Jagan : వైసీపీ అధినేత జగన్ కు మరోసారి వైఎస్ షర్మిల ప్రశ్నలు సంధించారు. ఇటీవలే ఢిల్లీ వేదికగా జగన్ చేపట్టిన దీక్షపై స్పందించారు. తాను చేపట్టిన దీక్షకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలోదో సమాధానం చెప్పాలని జగన్ అంటున్నారని… అసలు వైసీపీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ప్రశ్నించారు.

“పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా..? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా..? 5 ఏళ్లుగా బీజేపితో అక్రమ సంబందం పెట్టుకుని, విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి.. ఆఖరుకి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు...ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరం. క్రిష్టియన్ అయి ఉండి క్రైస్తవులను ఊచకోత గురి చేసినా.. నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చారు కదా?” అని జగన్ ను షర్మిల నిలదీశారు.
వైఎస్ఆర్ వ్యతిరేకించిన మతతత్వ బీజేపికే జై కొట్టారు కదా? అని దుయ్యబట్టారు. మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీనుంచి వచ్చిందా సంఘీభావం? అని సూటిగా ప్రశ్నించారు. “మీ నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్పా...రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. సిద్దం అన్న వాళ్లకు 11మంది బలం సరిపోలేదా.. ఇప్పుడు కలిసి పోరాడుదాం అంటున్నారు..?” అంటూ వైఎస్ షర్మిల సెటైర్లు విసిరారు.
అసలు జగన్ ఏమన్నారంటే…?
ఇటీవలే ఢిల్లీ వేదికగా వైసీపీ అధినేత జగన్ ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో హింసాయుత ఘటన జరుగుతున్నాయని… వైసీపీ కార్యకర్తలను, నేతలను హత్యలు చేస్తున్నారంటూ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే ప్రయత్నం చేశారు. ఇందుకు ఇండియా కూటమిలోని పలు పార్టీ నేతలు కూడా ధర్నాకు వచ్చి మద్దతు ఇచ్చారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరూ లేరు.
తాజాగా మీడియాతో మాట్లాడిన వైసీపీ అధినేత జగన్….ఢిల్లీలో చేసిన ధర్నాకు కొన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని… అందులో కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో వారినే అడగాలని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా… తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబుకు ఉన్న లింక్ ఏంటి అంటూ పలు వ్యాఖ్యలు చేశారు.
జగన్ కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా ఉన్న షర్మిల స్పందించారు. అసలు వైసీపీ ధర్నాకు ఎందుకు మద్దతు ఇవ్వాలని ప్రశ్నించారు. వైసీపీ వాళ్లు చేసిన ధర్నాలో అసలు నిజమే లేదని…. స్వలాభం కోసమే నిరసన చేపట్టారని ఆరోపించారు.