రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన నాయకులు నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీటీడీతో పాటు కీలకమైన కార్పొరేషన్ నామినేటెడ్ పోస్టుల భర్తీ అయింది. అయితే ఇంకా మార్కెట్ యార్డ్ కమిటీ పోస్టులు, సహకార సొసైటీల భర్తీ జరగలేదు. ఈ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎం చంద్రబాబు కూడా ఇప్పటికే దీనిపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
మార్కెట్ యార్డ్ కమిటీ పోస్టులు, సహకార సొసైటీల నియామకానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యేల సిఫార్సులను పరిగణనలోకి తీసుకోనున్నారు. ఆ దిశగా సీఎం చంద్రబాబు ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎవరిని సూచిస్తే వారికే ఆయా పదవులు కట్టబెట్టనున్నట్లు సమాచారం. దీనివల్ల నియామకాల్లో ఎమ్మెల్యేల ప్రతిపాదనలకు ప్రాధన్యత లభించనుంది. తద్వారా క్షేత్రస్థాయిల్లో పార్టీ పటిష్టం చేసుకోవచ్చని టీడీపీ భావిస్తోంది. ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి ఖరారు చేసే బాధ్యతను ఇన్చార్జి మంత్రులకు అప్పగించారు. ఇప్పటికే మంత్రులు సమావేశాలు కూడా నిర్వహించారు.
ఇప్పటికే రాష్ట్రంలోని పదవులన్నీ కూటమి పార్టీల మధ్య పంపకం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య టీటీడీ డైరెక్టర్లు, కార్పొరేషన్ పదవులు, రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు పంపకం సజావుగానే సాగింది. అలాగే ఇటీవలి నీటి సంఘాల ఎన్నికల్లో కూడా ఆయా పార్టీలు మధ్య స్థానాల పంపకం జరిగింది. పదవుల కేటాయింపులో ఎక్కడా ఎటువంటి వివాదాలు చోటు చేసుకోలేదు. ఇప్పుడు కూడా మార్కెట్ యార్డ్ కమిటీ పోస్టులు, సహకార సొసైటీల నియామకానికి అదే ఫార్ములా కొనసాగించాలని సీఎం చంద్రబాబు యోచిస్తోన్నారు.
రాష్ట్రంలో 2,300 వ్యవసాయ సహకార సొసైటీలు ఉన్నాయి. వీటిలో ఒక్కదానికి చైర్మణ్తో పాటు ఇద్దరు సభ్యులను నామినేట్ చేయడంతో 6,900 మందికి అవకాశం దక్కనుంది. వీటిలో ప్రత్యేకించి రిజర్వేషన్లు లేకపోయినా స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సామాజిక న్యాయం పాటించాలని సర్కారు సూచించింది. రాష్ట్రంలో 222 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఒక్కో కమిటీలో చైైర్మన్తో కలిపి 15 మంది సభ్యులను నియమిస్తారు. మొత్తం 3,330 మందికి అవకాశం లభించనుంది. రెండేళ్ల కాల పరిమితితో నామినేటెడ్ పాలక వర్గాలను నియమిస్తారు.
రెండో దశలో జిల్లా సహకార బ్యాంకులు, జిల్లా మార్కెటింగ్ సంస్థలకు కూడా ముగ్గురు సభ్యుల పాలక వర్గాలను నియమిస్తారు. ఈ కమిటీల చైర్మన్ పదవుల్లో సగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రిజర్వు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రొటేషన్లో భాగంగా రెండేళ్ల తర్వాత ఇప్పుడు రిజర్వేషన్లో ఉన్న చైర్మన్ పదవులు జనరల్ అవుతాయి. గొర్రెల పెంపకందారుల సొసైటీల పాలక వర్గాల నియామకంపైనా ప్రతిపాదనలు స్వీకరిస్తున్నారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.