CM YS Jagan Review: ‘విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై నిరంతర సమీక్ష, పర్యవేక్షణ అవసరమన్నారు సీఎం జగన్ . గురువారం క్యాంప్ కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖపై సమీక్షించిన ఆయన.. కీలక ఆదేశాలు ఇచ్చారు. నిరంతర సమీక్ష ద్వారా... విద్యా కానుక దగ్గరనుంచి పాఠ్యాంశాల వరకూ, అదే విధంగా మౌలిక సదుపాయాలు దగ్గర నుంచి గోరుముద్ద వరకూ కూడా నాణ్యత పెరుగుతుందన్నారు. పిల్లలకు అద్భుతమైన స్కూలు వాతావరణం అందుబాటులో ఉంటుందన్న ముఖ్యమంత్రి... ప్రతి ఏటా కూడా విద్యా కానుక కింద ఇస్తున్న వస్తువులపై పరిశీలన అవసరమన్నారు. పాఠ్యపుస్తకాల్లో పేపర్ క్వాలిటీ బాగుండాలని సీఎం స్పష్టం చేశారు.,సీఎం జగన్ ఏమన్నారంటే....:విద్యారంగంలో మనం అమలు చేస్తున్న కార్యక్రమాలపై నిరంతర సమీక్ష, పర్యవేక్షణ అవసరం,ప్రతి ఏటా కూడా విద్యాకానుక కింద ఇస్తున్న వస్తువులపై పరిశీలన అవసరం.,పాఠ్యపుస్తకాల్లో పేపర్ క్వాలిటీ బాగుండాలి.,6వ తరగతి ఆపైన ఉన్న ప్రతి తరగతిగదిలోనూ ఐఎఫ్పీ ప్యానెల్స్ను ఏర్పాటు చేస్తున్నాం. ఫలితంగా బోధన, నేర్చుకోవడం సులభతరమవుతుంది.,6వ తరగతి కన్నా దిగువ తరగతులకు టీవీ స్క్రీన్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నాం. తర్వాత 8 వ తరగతి నుంచి ట్యాబ్లను ఇస్తున్నాం. దీనివల్ల ఇంటి దగ్గర కూడా పిల్లలు ఆడియో, వీడియో, గ్రాఫిక్స్ ఎలిమెంట్స్ ఉన్న పాఠ్యాంశాలను నేర్చుకునే అవకాశం కల్పించాం.,ఇలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా డిజిటిల్ సౌలభ్యాన్ని కల్పించడంపై ఆలోచన చేయాలి. ఇది ఏ రూపంలో ఉండాలన్న దానిపై అధికారులు ఆలోచించి ప్రతిపాదనలు ఇవ్వాలి. దీనివల్ల శాశ్వతంగా పిల్లలకు ఉత్తమ బోధన అందించడానికి పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్టు అవుతుంది.,సీఎం ఆదేశాలతో సబ్జెక్ట్ టీచర్ విధానాన్ని అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ మార్పులు కారణంగా చక్కటి అర్హతలున్న ఉపాధ్యాయులు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చారని వివరించారు. గతంలో 3,4,5 తరగతుల పిల్లలకు సబ్జెక్టుల వారీగా బోధన లేదని, సబ్జెక్టు టీచర్స్ కాన్సెప్ట్లో భాగంగా సబ్జెక్టుల వారీ టీచర్లతో మంచి బోధన అందుతుందని ముఖ్యమంత్రికి చెప్పారు.,"విద్యార్థులు 6వ తరగతిలోకి రాగానే విద్యను సీరియస్ అంశంగా తీసుకుని మరింత దృష్టి పెట్టాలి. ఐఎఎఫ్పి ఏర్పాటు, సబ్జెక్టుల వారీ టీచర్లతో వారి బోధనపై సీరియస్గా ఉండాలి. సీరియస్గా బోధన లేకపోతే ఫలితం ఉండదు. మొక్కుబడిగా చేస్తే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బ తింటుంది. వచ్చే విద్యాసంవత్సరంలోగా ఐఎఫ్పీ ప్యానెళ్లు అందించాలి. నాడు – నేడు పూర్తవుతున్న కొద్దీ ఆ స్కూళ్లలో ఐఎఫ్పీలు ఏర్పాటు ఉండాలి. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులను వచ్చే విద్యాసంవత్సరంలో స్కూళ్లు ప్రారంభంలోగా అందించడానికి చర్యలు తీసుకోవాలి. పాఠ్యపుస్తకాల్లో అంశాలు, ట్యాబుల్లోని బైజూస్ కంటెంట్, ఐఎఫ్పీ కంటెంట్.... ఇవన్నీ కూడా పూర్తి సినర్జీతో ఉండాలి. ప్రపంచస్థాయి పోటీని తట్టుకునేందుకు వీలుగా విద్యార్థులు ఇంగ్లిషులో పట్టుపెంచుకునేందుకు వారికి చేదోడుగా నిలవాలి. ఈ క్రమంగా ఇంగ్లీషు మాట్లాడ్డం, రాయడంలో వారు మెరుగైన ప్రావీణ్యం సాధించాలి" అని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు.,ట్యాబుల వినియోగంలో వైయస్సార్ కడప, విజయనగరం, చిత్తూరు జిల్లాల విద్యార్థుల మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని అధికారులు.. సీఎంకు చెప్పారు. ట్యాబుల వినియోగం, పాఠ్యాంశాలను నేర్చుకుంటున్న తీరుపై పిల్లల తల్లిదండ్రులకు ఫీడ్బ్యాక్ కూడా అందించాలని సీఎం తెలిపారు. మరోవైపు జగనన్న విద్యాకానుకపైనా సీఎం సమీక్షించారు. మార్చిలో మొదలుపెట్టి ఏప్రిల్ చివరినాటికి విద్యాకానుక వస్తువులన్నింటినీ స్కూళ్లకు చేరుస్తామని అధికారులు చెప్పారు. మౌలికసదుపాయాల్లో ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే వాటిని సరిదిద్దాలని సీఎం జగన్ ఆదేశించారు. రెండోదశ నాడు–నేడుపైన సమీక్షించిన ముఖ్యమంత్రి... అధికారులకు పలు సూచనలు చేశారు.