AP CM to Narsapuram : నర్సాపురంకు సిఎం జగన్మోహన్ రెడ్డి-ap cm jagan mohan reddy going to narsapuram for inaugurations and foundation programmes ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Cm To Narsapuram : నర్సాపురంకు సిఎం జగన్మోహన్ రెడ్డి

AP CM to Narsapuram : నర్సాపురంకు సిఎం జగన్మోహన్ రెడ్డి

HT Telugu Desk HT Telugu
Nov 20, 2022 01:53 PM IST

AP CM to Narsapuram ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి నర్సాపురం వెళుతున్నారు. సోమవారం నర్సాపురంలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. నర్సాపురం నియోజకవర్గాన్ని రాజకీయంగా కీలకంగా భావిస్తుండటంతో ఆ ప్రాంతంలో పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

రేపు నర్సాపురంకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి
రేపు నర్సాపురంకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి (twitter)

AP CM to Narsapuram : ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ది కార్యక్రమాల కు ప్రారంభోత్సవంతో పాటు వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు చేయ నున్నారు. దాదాపు 15 కార్యక్రమాలకు నర్సాపురం వేదిక కానుంది. నర్సాపురం పార్లమెంటు నియోజక వర్గంలో మళ్లీ వైసీపీ గెలిచి తీరాలనే లక్ష్యంతో ఉన్న సిఎం ఆ ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. వైసీపీ తరపున గెలిచిన రఘురామ కృష్ణం రాజు వైసీపీకి కంట్లో నలుసులా తయారయ్యారు. పార్టీలో ఉంటూనే నిత్యం అసమ్మతి వాదనలు వినిపిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నర్సాపురం పర్యటనకు వెళుతున్నారు.

yearly horoscope entry point

ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా విశ్వవిద్యాలయం

నరసాపురంలో ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా విశ్వవిద్యాలయం పేరుతో ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. తమిళనాడు మరియు కేరళ తర్వాత ఇది దేశంలో మూడవ ఆక్వా విశ్వవిద్యాలయం కాబోతుంది. ఇందుకోసం నరసాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న సరిపల్లి మరియు లిఖితపూడి గ్రామాల మధ్య 40 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించారు.

భవన నిర్మాణ పనులకు మొత్తం రూ. 332 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌ ఆమోదం తెలిపారు. యూనివర్శిటీ రెండవ దశ పనులలో భాగంగా నరసాపురం మండలంలోని బియ్యపుతిప్ప గ్రామంలో 350 ఎకరాలలో రూ. 222 కోట్ల అంచనా వ్యయంతో విశ్వవిద్యాలయ సముద్రతీర ప్రాంగణం మరియు పరిశోధనా కేంద్ర నిర్మాణాలు చేపడతారు. మత్స్య విశ్వవిద్యాలయం ఏర్పాటు ద్వారా మత్స్యకారులు మరియు ఆక్వాకల్చర్‌ రైతులు ఎక్కువగా ప్రయోజనం పొందబోతున్నారు.

వృత్తిపరంగా అర్హత కలిగిన మానవ వనరుల లభ్యత కారణంగా ఆక్వాకల్చర్‌ రంగంలో పంట నష్టాలను చాలా వరకు తగ్గించుకోవచ్చు. తద్వారా దాదాపు సంవత్సరానికి రూ. 4,000 నుంచి 5,000 కోట్ల ఆర్ధిక ప్రయోజనం ఆక్వా రైతులకు చేకూరుతుంది. అవసరమైన సంఖ్యలో ఫిషరీస్‌ డిప్లొమా, బీఎఫ్‌ఎస్‌సీ, ఎంఎఫ్‌ఎస్‌సీ, మరియు పీహెచ్‌డీ అర్హత గల అభ్యర్ధులను తయారుచేయడానికి ఆక్వా యూనివర్శిటీ ఆధ్వర్యంలో మరిన్ని కొత్త మత్స్య కళాశాలలు మరియు మత్స్య పాలిటెక్నిక్‌ కళాశాలలు ప్రారంభించే ప్రతిపాదనలు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఈ యూనివర్శిటీ స్ధాపనతో ప్రొఫెషనల్‌ మ్యాన్‌ పవర్‌ కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.

బియ్యపుతిప్ప ఫిషింగ్‌ హార్బర్‌ శంకుస్ధాపన….

బియ్యపుతిప్ప వద్ద 150 ఎకరాల విస్తీర్ణంలో రూ. 429.43 కోట్ల అంచనాతో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించుటకు ఇప్పటికే జీవో జారీ చేశారు. హార్బర్‌ నిర్మాణం ద్వారా మత్స్యకారులకు అత్యంత సామర్ధ్యం గల మోటారు బోట్లలో సముద్రంలో లోతుగా వేటకు వెళ్ళుటకు వీలు కల్పించటంతో పాటు మార్కెటింగ్‌ సౌకర్యాలను పెంపొందించుట ద్వారా మత్స్య పరిశ్రమను అభివృద్ది చేయడానికి వీలవుతుంది. ఇందుకు సంబంధించిన అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం. ఈ హార్బర్‌ నిర్మించే ప్రదేశం నరసాపురం పట్టణానికి 14 కి.మీ. దూరంలో ఉంది. దీనివల్ల నరసాపురం మరియు మొగల్తూరు మండలాలకు చెందిన సుమారు 6,000 మంది మత్స్యకారులు లబ్ధిపొందనున్నారు.

నరసాపురం అగ్రికల్చర్‌ కంపెనీ భూములు….

నరసాపురం మండలంలో వేములదీవి ఉప గ్రామమైన దర్బరేవు గ్రామంలో నాటి బ్రిటీష్‌ ప్రభుత్వం 1921 సంవత్సరంలో 1,754 ఎకరాల భూమిని నరసాపురం అగ్రికల్చర్‌ కంపెనీ లిమిటెడ్‌ వారికి 99 సంవత్సరాల లీజుకు ఇచ్చింది. ఆ రోజు నుంచి 1623 మంది రైతులు భూమి స్వాధీన అనుభవంలో ఉండి వ్యవసాయం చేసుకుంటున్నారు కానీ రైతులకు ఎటువంటి భూ యాజమాన్య హక్కులు కానీ రెవెన్యూ రికార్డు పరమైన హక్కులు కానీ లేవు. అందువల్ల ఆ భూమిని అమ్మడానికి గానీ లేదా బ్యాంకులలో తనఖా పెట్టి ఋణము పొందడానికి కానీ అర్హత లేదు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం జీవో జారీ చేసి ఎకరాకు రూ. 100 ధర నిర్ణయించి, ఆ 1623 మంది రైతులకు భూ యాజమాన్య మరియు రెవెన్యూ రికార్డు పరమైన సర్వహక్కులు కల్పించారు. దీంతో రైతులు వారి వారసులు నిరభ్యంతరంగా స్వాధీనములో ఉండి అనుభవించుకోవచ్చు, అవసరాల నిమిత్తం అమ్ముకోవచ్చు, తనఖా పెట్టి ఋణాలు కూడా పొందవచ్చు.

ఉప్పుటేరు నదిపై మూలపర్రు రెగ్యులేటర్‌ శంకుస్ధాపన

సముద్రపు నీరు కొల్లేరు సరస్సులోకి చొరబడకుండా నిరోధించడానికి మరియు కొల్లేరులో 5 వ కాంటూర్‌ వరకూ మంచినీరు నిలువ ఉండే విధంగా ఉప్పుటేరు నదిపై కి.మీ. 57.950 మొల్లపర్రు విలేజ్‌ లిమిట్స్‌లో రూ. 188.40 కోట్లు అంచనా వ్యయంతో రెగ్యులేటర్‌ కమ్‌ బ్రిడ్జ్‌ కమ్‌ లాక్‌ నిర్మాణం కొరకు రూపొందించిన ప్రణాళికను ఆమోదించారు.

నరసాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవన ప్రారంభోత్సవం

నరసాపురం పట్టణం మధ్యలో నెలకొన్ని ఉన్న ప్రాంతీయ వైద్యశాల ఇటీవలే 100 పడకల స్ధాయికి విస్తృత పరిచి చుట్టుపక్కల గ్రామాలలో నివసించే 2 లక్షల మందికి వైద్య సదుపాయాలు, సేవలు అందించడం జరుగుతుంది. ఇప్పుడు అదే ఆసుపత్రిలో నూతనంగా మాతా శిశు సంరక్షణ విభాగం ఏర్పాటు చేయడం జరిగింది. రూ. 13 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించారు.

నరసాపురం పురపాలక సంఘం మంచినీటి అభివృద్ది పథకం ప్రారంభోత్సవం

నరసాపురం పట్టణంలో మంచినీటి ఎద్దడి నివారణకు రూ. 61.81 కోట్లతో మంచినీటి సరఫరా అభివృద్ది పథకం మంజూరు చేశారు.. ఈ పథకం వల్ల రాబోయే 30 సంవత్సరాల వరకూ నరసాపురం పట్టణానికి మంచినీటి సరఫరాకు ఎటువంటి సమస్యా రాకుండా ఏర్పాట్లు చేశారు.

దీంతో పాటు రూ. 4 కోట్ల వ్యయంతో నరసాపురం బస్‌స్టేషన్‌ పునరుద్ధరణ పనులకు శంకుస్ధాపన, . ఖజానా మరియు లెక్కల కార్యాలయం, నరసాపురం శంకుస్ధాపన, 220/ 132/ 33 కె.వి రుస్తుంబాద విద్యుత్‌ ఉపకేంద్రం శంకుస్ధాపన చేస్తారు. జిల్లా రక్షితనీటి సరఫరా ప్రాజెక్టుల శంకుస్ధాపన చేస్తారు.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలలో ఆక్వాకల్చర్‌ వల్ల ఏర్పడిన మరియు తీరప్రాంతంలో ఉప్పునీటి సాంద్రత, తీవ్ర తాగునీటి ఎద్దడి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం రూ. 1,400 కోట్ల అంచనా వ్యయంతో రక్షితనీటి సరఫరా ప్రాజెక్ట్‌ను మంజూరు చేసింది. విజ్జేశ్వరం జలాశయం నుండి గోదావరి నీటిని రాపిడ్‌ శాండ్‌ ఫిల్టర్ల ద్వారా శుద్ది చేసి పైప్‌లైన్ల ద్వారా సరఫరా చేయడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా నూతన జిల్లాలు అయిన పశ్చిమగోదావరి, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలలోని నిడుదవోలు, తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, ఉంగుటూరు, ఏలూరు (పార్ట్‌), తాడేపల్లిగూడెం (పార్ట్‌) శాసనసభ నియోజకవర్గాల ప్రజలకు మరియు కృష్ణా జిల్లాలోని కృతివెన్ను, బంటుమిల్లి, పెడన, గుడ్లవల్లేరు మండలాల ప్రజలకు సురక్షిత తాగునీరు సరఫరా చేస్తారు.

నరసాపురం పురపాలక సంఘం నందు అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజి స్కీమ్‌ మొత్తం ప్రాజెక్ట్‌ విలువ రూ. 237 కోట్లు. మొదటి ఫేజ్‌ రూ. 87 కోట్ల అంచనాలతో డీపీఆర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వశిష్ఠ వారధి – బుడ్డిగవాని రేవు ఏటి గట్టు పటిష్టం చేసే పనుల్ని సిఎం ప్రారంభిస్తారు. శేషావతారం పంట కాలువ అభివృద్ది పనులకు శ్రీకారం చుడతారు. మొగల్తూరు వియర్‌ పంట కాలువ నిర్మాణ పనులు చేపడతారు. కాజ, ఈస్ట్‌ కొక్కిలేరు మరియు ముస్కేపాలెం అవుట్‌ఫాల్‌ నిర్మాణ పనుల శంకుస్ధాపన చేస్తారు.

Whats_app_banner