AP CM Jagan : నర్సాపురం రూపురేఖలు మారేలా అభివృద్ధి… సిఎం జగన్
AP CM Jagan నర్సాపురం రూపురేఖలు మారిపోయేలా అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్లు సిఎం జగన్ చెప్పారు. రూ.3300కోట్ల రుపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు సిఎం శ్రీకారం చుట్టారు. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న పలు నిర్మాణాలను ప్రారంభించారు.
AP CM Jagan కార్తీకమాసం చివరి సోమవారం రోజున రూ. 3300 కోట్లు ఖర్చయ్యే 15 కార్యక్రమాలకు శంకుస్థానలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఒకేరోజున ఇన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నర్సాపురం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని సిఎం చెప్పారు. నర్సాపురంలో ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ విశ్వవిద్యాలయానికి సిఎం శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో ప్రాంతం రూపురేఖలు మార్చబోతోందన్నారు.
ట్రెండింగ్ వార్తలు
ఆక్వా కల్చర్ ప్రధానమైన నర్సాపురంలో వాటి ఉత్పత్తులు, ఎగుమతుల్లో దేశంలోనే నంబర్ ఒన్ స్థానంలో ఉందన్నారు. ఆక్వాకల్చర్లో నైపుణ్యాలను, పరిజ్ఞానాన్ని పెంచేందుకు ఆక్వా యూనివర్శిటీ తోడ్పడుతుందని చెప్పారు. ఫలితంగా నర్సాపురం ప్రాంతంలో మెరుగైన ఉద్యోగాలు వస్తాయన్నారు. దేశంలో ఎక్కడ అవసరాలున్నా.. తీర్చే పరిస్థితి ఉంటుందని చెప్పారు.
డిప్లమో నుంచి పీహెచ్డీ వరకూ ఆక్వా కల్చర్లో మానవ వనరుల కొరత తీర్చడానికి ఈ యూనివర్శిటీ ఉపయోగపడుతుందని చెప్పారు. దేశంలో రెండే రెండు ఫిషరీస్ యూనివర్శిటీలు ఉన్నాయని, ఒకటి తమిళనాడులో, ఒకటి కేరళలో ఉందని మూడో యూనివర్శిటీ మన రాష్ట్రంలో రాబోతోందన్నారు. రూ.332 కోట్ల రూపాయల వ్యయంతో యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. శంకుస్థాపన నాటి నుంచి పనులు మొదలుపెడుతున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో మత్స్యకార సోదరుల బాగుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని సిఎం చెప్పారు. 6వేల మత్స్యకారుల కుటుంబాలకు నర్సాపురంలో.. మేలు చేసేలా ఇక్కడే బియ్యపు తిప్ప ఫిషింగ్ హార్బర్ కూడా శంకుస్థాపన చేసినట్లు చెప్పారు.
బియ్యపు తిప్ప ఫిషింగ్ హార్బర్ కోసం అక్షరాల రూ.430 కోట్ల రూపాయలు వ్యయం చేయబోతున్నామన్నారు. ఆంధ్రా నుంచి మత్స్యకారులు గుజరాత్కో, ఇంకోచోటుకో వెళ్లి బతకాల్సిన అవసరం ఇకపై ఉండదన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 9 ఫిషింగ్ హార్బర్లు రాబోతున్నాయని చెప్పారు. దాదాపు రూ.3500 కోట్లు దీనికోసంఖర్చు చేస్తున్నామని, అన్నిరకాల సదుపాయాలూ ఫిషింగ్ హార్బర్ ద్వారా అందుబాటులోకి రానున్నాయన్నారు.
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం రోజున దీనికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. ముమ్మడివరంలో ఓఎన్డీజీ కార్యకలాపాల ద్వారా ప్రభావితమైన 23వేల మందికిపైగా మత్స్యకారులకు పరిహారాన్ని అందిస్తున్నామని చెప్పారు. గతంలో ఇలా పరిహారం అందించిన సందర్భం లేదున్నారు. నర్సాపురం అగ్రికల్చర్ కంపెనీ భూములపై రైతులకు పూర్తిహక్కులు కల్పించడం ద్వారా 1623 మంది రైతులకు మేలు చేస్తున్నామని చెప్పారు. సాగు చేస్తున్న రైతులకు రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వబోతున్నామన్నారు. శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వబోతోందన్నారు.
ఉప్పుటేరుపై రెగ్యులేటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నామని, రెగ్యులేటర్ నిర్మాణం ద్వారా సముద్రపునీరు కొల్లేరులోకి రాకుండా, ఐదో కాంటూరు వరకూ మంచినీరు నిల్వ ఉండేలా రూ.188 కోట్లతో రెగ్యులేటర్, బ్రిడ్జి, లాకు నిర్మాణం చేస్తున్నామని చెప్పారు.
నర్సాపురంలో రూ.130 కోట్లతో ఏరియా ఆస్పత్రిని కట్టామని, రూ.66 లక్షల విలువైన వైద్య పరికరాలు అందించామని, ఆక్సిజన్ ప్లాంటు, జనరేటర్కూడా అందించినట్లు చెప్పారు.
రక్షిత మంచినీటి సరఫరాకోసం శంకుస్థాపన చేశాం. రూ.62 కోట్లు దీనికోసం ఖర్చుచేస్తున్నాంమని సిఎం ప్రకటించారు. రూ.4 కోట్లతో నర్సాపురం బస్స్టేషన్ను ఆధునీకరించి ప్రారంభించారు. బ్రిటిషర్లు నిర్మించిన ట్రెజరీ బిల్డింగుకు ఇవాళే శంకుస్థాపన చేశామని చెప్పారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నర్సాపురంకు నాణ్యమైన విద్యుత్ అందించడానికి సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు చెప్పారు.
ప.గో.జిల్లాలో పాదయాత్ర జరిగినప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి గమనించానని, తీర ప్రాంతం అంతా తాగునీరు లేక ఇబ్బంది పడే పరిస్థితిని గుర్తించినట్లు సిఎం చెప్పారు. గోదావరి పక్కన ఉన్నా, తాగడానికి నీరులేదని, బోర్లు వేస్తే ఉప్పునీరు వస్తోందని చెప్పారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.1400 కోట్ల వ్యయంతో వాటర్ గ్రిడ్ ద్వారా రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నామన్నారు. విజ్జేశ్వరం నుంచి శుద్ధిచేసిన నీటిని… పైపులైన్ల ద్వారాసరఫరా చేస్తున్నామన్నారు.
కొత్త జిల్లాలు అయినా ప.గో, ఏలూరు, తూ.గో జిల్లాల్లోని నిడదవోలు, తణుకు, ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, ఉంగుంటూరు, ఏలూరు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల ప్రజలకు, అలాగే కృష్ణా కృతివెన్ను, బంటుమిల్లి, గుడ్లవల్లేరు మండలాల్లోని ప్రజలకు రక్షిత తాగునీరు అందుతాయని చెప్పారు.