గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పనులు పూర్తి చేయండి - సీఎం చంద్రబాబు ఆదేశాలు-ap cm directed officials to expedite the polavaram works and ensure their completion before the 2027 godavari pushkaralu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పనులు పూర్తి చేయండి - సీఎం చంద్రబాబు ఆదేశాలు

గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పనులు పూర్తి చేయండి - సీఎం చంద్రబాబు ఆదేశాలు

పోలవరం ప్రాజెక్ట్ పనులపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి ప్రాజెక్ట్ పూర్తి కావాలనే లక్ష్యంతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సూచించారు.

పోలవరం ప్రాజెక్ట్ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష

గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలనే లక్ష్యంతో పనులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను, కాంట్రాక్టు సంస్థలను ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా లక్ష్యానికి అనుగుణంగా వేగంగా పనులు పూర్తి చేయాలన్నారు.

నాణ్యత విషయంలో రాజీ వద్దు - సీఎం చంద్రబాబు

సచివాలయంలో శుక్రవారం పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కేంద్ర జలసంఘం, నిపుణుల కమిటీ నుంచి ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనులపై అనుమతులు తీసుకుని పనుల్ని పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ వద్దని అధికారులకు సూచనలు జారీ చేశారు.

డయాఫ్రం వాల్ మొత్తం 63,656 క్యూబిక్ మీటర్లకు గానూ 37,302 క్యూబిక్ మీటర్ల మేర పనులు పూర్తి అయ్యాయని అధికారులు వివరించారు. బట్రస్ డ్యామ్ పనులు వందశాతం పూర్తి అయినట్టు తెలిపారు. వైబ్రో కాంపాక్షన్ పనులు కూడా 74 శాతం మేర పూర్తైనట్టు సీఎంకు వివరించారు.

ఈ ఏడాది డిసెంబరు నాటికి డయాఫ్రం వాల్ పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రాజెక్టులో ప్రధాన డ్యామ్ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనుల్ని నవంబరు 1 నుంచే ప్రారంభించాలని.. 2027 డిసెంబరుకు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పోలవరం కుడి కాలువను అనుసంధానించే సొరంగాల నిర్మాణం, ఎడమ కాలువకు అనుసంధానం చేసేలా అప్రోచ్ ఛానల్, హెడ్ రెగ్యులేటర్, ఇరిగేషన్ టన్నెల్, కేఎల్ బండ్ లను త్వరితగతిన పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు.

ప్రధాన ఎడమ కాలువను 2026 జనవరి నాటికల్లా అనకాపల్లి వరకూ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ, నిర్వాసితులకు పరిహార, పునరావాసాన్ని నిర్దేశిత గడువు లోగా పూర్తి చేయాలని సూచనలు జారీ చేశారు.

దేశంలోనే అత్యుత్తమ ప్రాజెక్టుగా నిర్మిస్తున్న పోలవరం వద్ద పర్యాటకులను ఆకర్షించేలా నిర్మాణాలు ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రాజెక్టు నుంచి భద్రాచలం, పాపికొండలు, దిగువన ధవళేశ్వరం వరకూ వివిధ ప్రాంతాలను అద్భుతంగా తీర్చిదిద్దాలన్నారు. పోలవరం ప్రాజెక్టు కనెక్టివిటీ కింద ఐకానిక్ రోడ్డు నిర్మించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీనిని జాతీయ రహదారికి అనుసంధానించేలా చూడాలన్నారు.

రాజమహేంద్రవరం కేంద్రంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా అఖండ గోదావరి ప్రాజెక్టును చేపట్టాలన్నారు. పోలవరం ప్రాజెక్టులో పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆర్టీజీఎస్‌కు అనుసంధానించాలని సూచించారు. వచ్చే వర్షాకాల సీజన్‌లోగా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం