Pension Kanuka : అర్హత ఉంటేనే పెన్షన్.... రాజాం కార్యకర్తలతో సీఎం జగన్....
అర్హత ఉంటేనే పెన్షన్లు ఇస్తామని, అర్హత లేని వారికి పెన్షన్లు ఇవ్వలేమని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. రాజాం నియోజక వర్గ కార్యకర్తలతో భేటీ సందర్భంగా పెన్షన్ల తొలగింపుపై పలువురు కార్యకర్తలు చేసిన ఫిర్యాదులపై సీఎం స్పందించారు. ఒక్కో అసెంబ్లీ నియోజక వర్గం నుంచి 50మంది కార్యకర్తలతో భేటీ అవుతున్న సీఎం రెండో రోజు రాజాం కార్యకర్తలతో భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని, వైసీపీ తీసుకొచ్చిన మార్పులు మంచి ఫలితాలు ఇస్తున్నాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజాం కార్యకర్తలతో చెప్పారు. రాజాం నియోజకవర్గంలో ప్రత్యక్ష నగదు బదిలీ కింద అర్హులకు రూ.775 కోట్లు ఇచ్చామని మిగిలిన నియోజక వర్గాల్లోనూ ఇలానే మంచి చేశామన్నారు. ప్రభుత్వం చేసిన మంచి పనిని ప్రజలకు వివరించాలని చెప్పారు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టో ద్వారా ఇచ్చిన వాగ్దానాల్లో 95 శాతం నిలబెట్టుకున్నామన్నారు.
ట్రెండింగ్ వార్తలు
విద్యా, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చామని, వైసీపీ చేసిన మంచిని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని సూచించారు. 175కి 175 సీట్లు సాధించడమే ఈసారి టార్గెట్ కావాలన్నారు. పార్టీ పరంగా జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు కావాలని ప్రతి కమిటీలో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీలు ఉండాలన్నారు. మొత్తం కమిటీలో 50 శాతం మహిళలు ఉండేలా చూసుకోవాలని, జీవితకాలం మిగిలి పోయే విధంగా కొత్త చరిత్రను లిఖించాలన్నారు.
చేసిన మంచి చూశాక 30 ఏళ్లపాటు తమ ప్రభుత్వమే ఉండాలని ప్రజలే ఆశీర్వదిస్తారన్నారు. వైసీపీ లక్ష్యం 151 కాదని 175 స్థానాల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలన్నారు. ప్రతి నియోజక వర్గంలో 87శాతం మందికి మేలు జరిగిందని, ప్రతి గ్రామంలో ప్రభుత్వ పథకాలు అందుకున్న లబ్దిదారులు ఉన్నారని చెప్పారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో కూడా వైసీపీ స్వీప్ చేసిందని, రాష్ట్రంలో 175 స్థానాల్లో గెలవడానికి అందరి సహాయ సహకారాలు కావాలన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు.
మరోవైపు నియోజక వర్గంలో నెలకొన్న సమస్యలను కార్యకర్తలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తాగునీటి సమస్యలకు పరిష్కారం చూపాలని, తోటపల్లి కాల్వలు అసంపూర్తిగా నిలిచిపోవడంతో పంటలకు నీరందటం లేదని ఫిర్యాదు చేశారు. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్లతో కలిపి 50మంది కార్యకర్తలు సీఎంతో భేటీ అయ్యారు. సంతకవి, పొందూరు రహదారిని రెండు వరుసలుగా విస్తరించాలని కోరారు. ధాన్యం కొనుగోళ్లలో ముక్క పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని, ప్రభుత్వం నుంచి కొనుగోలు డబ్బులు సకాలంలో రావట్లేదని మరికొందరు ఫిర్యాదు చేశారు.
పెన్షన్లను రకరకాల కారణాలతో నిలిపివేస్తుండటంపై పలువురు కార్యకర్తలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వారి ఫిర్యాదులకు స్పందించిన సీఎం అర్హత ఉన్న ఏ ఒక్కరికి పథకాలు నిలిచిపోవని, అర్హత లేకుండా ఇమ్మంటే కుదరదని, ఓ పద్ధతి పెట్టుకున్న తర్వాత అందుకు అనుగుణంగానే ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు.
టాపిక్