యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉన్నత విద్యలో తీసుకురావాల్సిన కొత్త కోర్సులపై అధ్యయనం చేయాల్సిందిగా సూచించారు.
మంగళవారం సచివాలయంలో నైపుణ్యాభివృద్ధి శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని నైపుణ్యం పోర్టల్లో పొందుపరచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే యువతను కూడా నైపుణ్యం పోర్టల్ లో నమోదు చేయించటం ద్వారా ఎక్కడెక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయనే సమాచారం ఎప్పటికప్పుడు వారికి అందేలా చూడాలన్నారు.
యువత తమ వివరాలు నమోదు చేయగానే ఆటోమేటిక్గా వారి రెజ్యూమ్ రూపొందేలా పోర్టల్ను డిజైన్ చేయాలని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో రూ.9.5 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నామని వీటి ద్వారా 8.5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ఈ పెట్టుబడులకు అనుగుణంగా ఉద్యోగాలు సాధించేలా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
స్వర్ణాంధ్ర-2047 విజన్ ప్రణాళికలకు అనుగుణంగా రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాలు కల్పించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 6వ తరగతి నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకూ నైపుణ్యాభివృద్ధి కల్పించే అంశాలపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. వచ్చే పదేళ్లను దృష్టిలో ఉంచుకుని యుతకు నైపుణ్యాన్ని పెంచాలని అన్నారు. విద్యా సంస్థలతో పరిశ్రమలను అనుసంధానం చేసి నైపుణ్య శిక్షణ, ధృవీకరణ అంశాలపై కార్యాచరణ చేపట్టాలని అన్నారు.
నేషనల్ స్కిల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ ద్వారా నైపుణ్యాభివృద్ధి శిక్షణా ప్రమాణాలను నిర్ధారించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆధార్, అపార్ ఐడీలతో అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అనుసంధానం చేయాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 1,164 జాబ్ మేళాలు నిర్వహించగా ఇప్పటివరకూ 61,991 మందికి ఉద్యోగాలు లభించినట్టు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రికి వివరించారు.
రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ద్వారా శిక్షణ పొందిన 74,834 మందికి ప్లేస్మెంట్లు వచ్చాయని తెలిపారు. మరోవైపు నైపుణ్యం పోర్టల్తో రిజిస్ట్రేషన్లు, శిక్షణ, సర్టిఫికేషన్, ప్లేస్మెంట్లతో పాటు పరిశ్రమలతో అనుసంధానం, విదేశీ భాషల్లో శిక్షణ వరకూ వివరాలు పొందుపరుస్తున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ….. ఈ ఏడాదిలో ఒక్కో నియోజకవర్గంలో కనీసం 1,500 ఉద్యోగాలు కల్పించేలా జాబ్ మేళాలు నిర్వహించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో క్లస్టర్ల వారీగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ చేపడుతున్నట్టు మంత్రి నారా లోకేశ్ ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రంలో ఐదు క్లస్టర్లలో నైపుణ్యాలు కల్పించేందుకు కార్యాచరణ చేపడుతున్నట్టు వెల్లడించారు. కృష్ణా- గుంటూరు క్లస్టర్లో వ్యవసాయం, టెక్స్ టైల్ , ఫుడ్ ప్రాసెసింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, అనంతపురం- కర్నూలు, కడప క్లస్టర్ లో గ్రీన్ ఎనర్జీ, డ్రోన్, ఆటోమొబైల్స్ రంగాల్లో శిక్షణకు అవకాశాలు ఉన్నట్టు స్పష్టం చేశారు.
నైపుణ్యాభివృద్ధి కల్పనను ప్రాధాన్యతగా తీసుకుని ఏపీ యువతకు గ్లోబల్ ప్లేస్ మెంట్ దక్కేలా లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. జర్మనీ, యూరప్, ఇటలీ, సింగపూర్ సహా వేర్వేరు దేశాల్లో వైద్యారోగ్యం, నిర్మాణం, పర్యాటకం, ఐటీ , లాజిస్టిక్స్ , ఉత్పత్తి రంగాల్లో ఉన్న విస్తృతమైన అవకాశాలు దక్కించుకునేందుకు విదేశీ భాషా నైపుణ్యాలను పెంచాల్సిందిగా సీఎం సూచించారు. ఆయా భాషల్లో శిక్షణ ఇచ్చేందుకు ఆఫ్లైన్, ఆన్లైన్ ప్రత్యామ్నాయాలను పరిశీలించాలన్నారు. ఇంగ్లీష్ అండ్ ఫారెన్ ల్యాంగ్వేజెస్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.