AP Investments: ఆరోగ్యం, విద్య, ఆవిష్కరణలకు సహకరించాలని బిల్గేట్స్కు ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
AP Investments: ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల కేంద్రంగా మార్చేందుకు సహకరించాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు, బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్ బిల్ గేట్స్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. దావోస్లో మూడోరోజు బిల్ గేట్స్తో సమావేశమైన ముఖ్యమంత్రి పలు అంశాలపై చర్చించారు.
AP Investments: ఆంధ్రప్రదేశ్లో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్, డయాగ్నోస్టిక్స్ ప్రారంభించాలని ఈ కేంద్రం ప్రజలకు అధునాతన ఆరోగ్య సదుపాయాలు అందిస్తుందని సీఎం చంద్రబాబు బిల్గేట్స్ను కోరారు. ఆంధ్ర ప్రదేశ్లో ఏర్పాటు చేయనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్శిటీ కోసం బిల్ గేట్స్ను సలహాదారుల మండలిలో భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు.

బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ విజయవంతంగా అమలు చేస్తున్న హెల్త్ డ్యాష్బోర్డ్లు, సామాజిక కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్లో కూడా నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. అంతర్జాతీయ ఆవిష్కరణలను స్థానికంగా వినియోగించుకునేలా సాయం అందించాలని కోరారు. బిల్ గేట్స్ ఫౌండేషన్కు దక్షిణాది రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ను ముఖద్వారంగా చేసుకునేలా సహకరిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
బీఎంజీఎఫ్ భాగస్వామ్యానికి ఎదురుచూస్తున్నా
చాలా రోజుల తర్వాత బిల్ గేట్స్ను కలుసుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. సాంకేతికతను వినియోగించుకోవడంలోనూ, ఆవిష్కరణలపై దృష్టిపెట్టడంలో గేట్స్ అందరికీ స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. ఆరోగ్యం, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఇన్నోవేషన్పై పరస్పరం సహకరించుకోవడానికి గల అవకాశాలను ఇరువురం చర్చించినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పురోగతిలో బీఎంజీఎఫ్ భాగస్వామి కావాలని... ఇందుకోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.
మైక్రో సాఫ్ట్ అధినేత, ప్రపంచ ఐటి దిగ్గజం బిల్ గేట్స్ తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ ప్రొమెనేడ్ మైక్రోసాఫ్ట్ కేఫ్ లో భేటీ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తమపై నమ్మకంతో మైక్రోసాఫ్ట్ ఐటి కేంద్రాన్ని నెలకొల్పడంతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయిన విషయాన్ని బిల్ గేట్స్ కు చంద్రబాబు గుర్తుచేశారు.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఎపిలో ఐటి అభివృద్ధికి సహాయ, సహకారాలను అందించాలని మంత్రి నారా లోకేష్ కోరారు. ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటుచేయబోతున్న వరల్డ్ క్లాస్ ఎఐ యూనివర్సిటీ సలహామండలిలో భాగస్వామ్యం వహించాలని కోరారు. బిల్గేట్స్ సలహాలు రాష్ట్రంలో ఐటి అభివృద్ధికి దోహదం చేస్తాయని ఎపిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్స్ను ఏర్పాటు చేయడానికి బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరపున ఎపి ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాలని కోరారు.
రాష్ట్రంలోని ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ ఎకోసిస్టమ్ను నడపడానికి ఆఫ్రికాలో హెల్త్ డ్యాష్బోర్డ్ల తరహాలో సామాజిక వ్యవస్థాపకతలో ఫౌండేషన్ తరపున నైపుణ్య సహకారాన్ని అందించాలని దక్షిణ భారతంలో బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలకు ఎపిని గేట్వేగా నిలపాలని కోరారు. ఎపి ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బిల్ గేట్స్ చెప్పారు.
హిందుస్థాన్ యూనిలీవర్కు ఆహ్వానం :
ప్రపంచవ్యాప్యంగా వినియోగ వస్తువులు విక్రయించే యూనిలీవర్ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విల్లెం ఉజ్జెన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఫుడ్, హోమ్ కేర్, బ్యూటీ, పర్సనల్ కేర్ సంబంధిత ఉత్పత్తులకు పేరున్న సంస్థ యూనిలీవర్. భారత్లో హిందుస్థాన్ యూనిలీవర్ పేరుతో విక్రయాలు జరుపుతోంది. భారత్లో డిమాండ్కు అనుగుణంగా మరింతగా విస్తరించాలని చూస్తోంది. ఇందులో భాగంగా ఏపీలో రూ. 330 కోట్లతో పామాయిల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. బ్యూటీ పోర్ట్ఫోలియోకు సంబంధించి టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు విశాఖపట్నం అనుకూలంగా వుంటుందని విల్లెం ఉజ్జెన్కు ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో పెద్దఎత్తున వచ్చే వ్యవసాయ దిగుబడులను హిందుస్థాన్ యూనిలీవర్ వినయోగించుకోవచ్చని... ఫుడ్ ప్రాసెసింగ్, బ్యూటీ, హోమ్ కేర్ ఉత్పత్తుల తయారీకి రాష్ట్రం అనుకూలంగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు.
గూగుల్ క్లౌడ్ విస్తరణకు ఏపీ అనుకూలం
సర్వర్ల కోసం సొంత చిప్లను రూపొందిస్తున్న గూగుల్ విశాఖపట్నంలో డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ను కోరారు. గూగుల్ క్లౌడ్ తన సర్వర్ సప్లై చైన్ అనుసంధానించేలా తయారీ యూనిట్ను ఏపీలో నెలకొల్పాలని థామస్ కురియన్కు ముఖ్యమంత్రి కోరారు.
సర్వర్ నిర్వహణ సేవల విషయంలో ఏపీని ప్రధాన కేంద్రంగా చేసుకోవాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం పూర్తిగా వుంటుందని థామస్ కురియన్కు ముఖ్యమంత్రి తెలిపారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో భాగంగా దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. మూడో రోజు పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకట్టుకునేందుకు ప్రముఖ సంస్థల అధిపతులతో చర్చలు జరిపారు.
గూగుల్తో ఇప్పటికే పలు ఒప్పందాలు :
క్లౌడ్ ప్రొవైడర్లో ప్రపంచంలో మూడో అతి పెద్ద సంస్థ అయిన గూగుల్ క్లౌడ్.. తన ప్లాట్ఫామ్ కింద ఇప్పటికే భారత్లోని ఢిల్లీ, ముంబైలో రెండు క్లౌడ్ రీజియన్లు ఏర్పాటు చేసింది. ఇటీవల విశాఖపట్నంలో తమ ‘డేటా సిటీ’ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ ఎంవోయూ కుదుర్చుకుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని అభివృద్ధి చేయడానికి, రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను పెంపొందించేందకు ఏపీతో ఒప్పందం చేసుకుంది.
పెట్రోనాస్ ప్రెసిడెంట్తో ముఖ్యమంత్రి చర్చలు
పెట్రోనాస్ ప్రెసిడెంట్, గ్రూప్ చీఫ్ ఎగ్జీక్యూటివ్ ఆఫీసర్ ముహమ్మద్ తౌఫిక్తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. ‘పెట్రోనాస్’ మలేషియాకు చెందిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ. ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, గ్రీన్ మాలిక్యులస్కు సంబంధించి భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. 2030 కల్లా ఏడాదికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించి కాకినాడ ప్లాంటులో రూ.13,000 కోట్ల నుంచి రూ.15,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. పెట్రోకెమికల్ హబ్గా అవతరిస్తున్న మూలపేటలోనూ, అలాగే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లోనూ పెట్టుబడులు పెట్టాల్సిందిగా ముహమ్మద్ తౌఫిక్ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు.
పెప్సీకో అధిపతులతో సమావేశం
పెప్సీకో ఇంటర్నేషన్ బెవరేజస్ సీఈవో యూజీన్ విల్లెంసెన్, పెప్సీకో ఫౌండేషన్ చైర్మన్ స్టీఫెన్ కెహోతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. పెప్సీకో ప్రపంచంలో రెండో అతిపెద్ద ఫుడ్ బెవరేజెస్. ఇప్పటికే ఏపీలోని శ్రీసిటీలో బాటిలింగ్ ప్లాంట్ నిర్వహిస్తున్న పెప్సికో బెవరేజెస్... విశాఖపట్నాన్ని గ్లోబల్ డెలివరీ సెంటర్గా చేసుకుని పెప్సీకో డిజిటల్ హబ్ను ఏర్పాటు చేయవచ్చని ముఖ్యమంత్రి సూచించారు.స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజనెస్ కోసం ఎపికి రావాలని వారిని ఆహ్వానించారు.
ఏపీలో స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటు చేయండి
ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటుకు ముందుకు రావాలని ప్రపంచంలో కంటైనర్ టెర్మినల్లో ప్రతిష్టాత్మక సంస్థ డీపీ వరల్డ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో మూడో రోజు డీపీ వరల్డ్ సెంట్రల్ ఏసియా, ఆఫ్రికా మేనేజింగ్ డైరెక్టర్ రిజ్వాన్ సూమర్తో ముఖ్యమంత్రి ఈ మేరకు చర్చలు జరిపారు. భారతదేశంలో డీపీ వరల్డ్కు 5 కంటైనర్ టెర్మినల్స్ ఉన్నప్పటికీ ఏపీలో ఇప్పటివరకు ఒక్కటీ లేదని, ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ, కృష్ణపట్నం, మూలపేటలో స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. దీనిపై ఆలోచన చేయాలని రిజ్వాన్ సుమూర్ను ముఖ్యమంత్రి కోరారు.
సెన్మట్ సీఈవోతో భేటీ :
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ మెటీరియల్స్ (సెన్మట్) హెడ్ రాబర్టో బోకాను సమావేశమైన ముఖ్యమంత్రి.. గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్, సోలార్ మాన్యుఫాక్చరింగ్ వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్కు గ్లోబల్ కంపెనీల పెట్టుబడులు తరలివచ్చేలా సెన్మట్ సహకారం అందించాలని కోరారు. క్లీన్ ఎనర్జీ నాలెడ్జ్ - స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు డబ్ల్యూఈఎఫ్ మద్దతివ్వాలని అభ్యర్ధించారు.
సంబంధిత కథనం