AP Cabinet Decisions : నిషేధిత జాబితా భూములపై సబ్ కమిటీ - వచ్చే ఏడాది నుంచి తల్లికి వందనం..! ఏపీ కేబినెట్ నిర్ణయాలివే
ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై నిర్ణయం తీసుకునేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయించింది. పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు వెంటనే ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.
ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైసీపీ హయాంలో దాదాపు 7 లక్షల ఎకరాలు నిషేధిత జాబితా నుంచి తొలగించగా.. వీటిపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఆ భూములను ఏం చేయాలన్నదానిపై సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.
వచ్చే ఏడాది కీలక పథకాలు…
పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు వెంటనే ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది((2025-26) ప్రారంభంలోనే తల్లికి వందనం స్కీమ్ కూడా ప్రారంభించాలని మంత్రివర్గ నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా సీకేదిన్నెలో 2,595 ఎకరాల బదిలీకి స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇచ్చేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తల్లికి వందనమే కాకుండా…. అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా పథకాల అమలుపై కూడా కేబినెట్ చర్చించింది. ఈ పథకాల అమలుకు సిద్ధం కావాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
కేబినెట్ నిర్ణయాలు…
- వచ్చే విద్యా సంవత్సరం నాటికి 'తల్లికి వందనం' ఇవ్వాలని నిర్ణయం.
- కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులు వేసిన వెంటనే అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ వేయాలని నిర్ణయం.
- పోలవరం డయాఫ్రంవాల్ వెంటనే ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయం
- గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం పేదలకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు.
- ధాన్యం కొనుగోలుకు రూ.700 కోట్లు రుణం తీసుకోవడంపై మంత్రివర్గం ఆమోదముద్ర.
- గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణకు కేబినెట్ ఆమోదం.
- 62 నియోజకవర్గాల్లో 63 అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయం.