వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూములుగా మార్పిడి చేసుకునేందుకు ఉద్దేశించిన ఏపీ అగ్రికల్చర్ ల్యాండ్(కన్వర్షన్ ఆప్ నాన్ అగ్రికల్చరల్ పర్ససెస్) యాక్ట్ 2006ను రద్దు చేసేందుకు విధివిధానాలు రూపొందించనున్నారు. ఈ మేరకు మంత్రివర్గం ఉపసంఘం ఆదేశాలను జారీచేసింది.
వ్యవసాయేతర అవసరాలకు భూములను మార్పిడి చేసుకునేందుకు నాలా చట్టం వల్ల ఇప్పటి వరకు అనేక రకాల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దీన్ని రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు… మూడో కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ప్రకటించారు. ఇదే విషయంతో పాటు రెవెన్యూ శాఖలో తీసుకురావాల్సిన అంశాలపై కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటైంది.
ఆరుగురు మంత్రులతో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో మూడోసారి భేటీ అయ్యింది. రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన ఈ భేటి జరిగింది. ఇందులో అనగాని సత్యప్రసాద్ తోపాటు మంత్రులు పయ్యావుల కేశవ్, పి.నారాయణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు నాలాను రద్దు చేసి ప్రజలు ట్యాక్స్ కట్టేస్తే ఆటోమేటిక్ గా భూ మార్పిడి జరిగేలా ముసాయిదా విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రులు చెప్పారు. భూ మార్పిడి అత్యంత సులభంగా జరగాలని అభిప్రాయపడ్డారు. కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా ఎలా చేయాలనే దానిపై ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు.
తదుపరి సమావేశంలో అధికారులు ఇచ్చిన ప్రతిపాదనలపై చర్చించనున్నారు. నిర్ణయించిన విధివిధానాలను మంత్రివర్గం ముందు పెడతామని మంత్రులు చెప్పారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ…. ప్రజలకు ఇబ్బందిగా మారిన నాలాను రద్దు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అంతేకాక నాలా ట్యాక్స్ కూడా ఎక్కువగా ఉందని పలు సంఘాల నుండి అభ్యంతరాలు వచ్చాయన్నారు. ఆ ట్యాక్స్ ను కూడా ఎంతమేరకు తగ్గించవచ్చో ప్రతిపాదనలు ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. వీలైతే ఈ ప్రతిపాదనలను జూన్ 19న జరిగే మంత్రివర్గ సమావేశంలో పెట్టి చర్చిస్తామని తెలిపారు.
సంబంధిత కథనం