ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపించాలని నిర్ణయించింది.
సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అయింది. పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేబినెట్ కృతజ్ఞతలు తెలిపింది.
ఇటీవలనే అమరావతి పున: ప్రారంభ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. రూ.49,040 కోట్లతో అమరావతి పరిధిలో చేపట్టనున్న పలు శంకుస్థాపన చేశారు. వీటితో పాటు రూ.57వేల కోట్లతో చేపట్టిన పలు జాతీయ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను వర్చువల్గా చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ… అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సాకారం ఇస్తుందని ఉద్ఘాటించారు.
అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదని మోదీ చెప్పారు. అమరావతి ఒక శక్తి. అమరావతి స్వప్నం సాకారం అవుతున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ను ఆధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి అమరావతికి ఉందన్నారు.
అమరావతి పనులు పునః ప్రారంభమైన నేపథ్యంలో…. వేగంగా పనులను పూర్తి చేసేలా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే పునర్విభజన చట్టంలో అమరావతి పేరును ప్రస్తావించేలా చట్ట సవరణ కోరుతూ కేబినెట్ తీర్మానం చేసింది. త్వరలోనే ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపనుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి…!
సంబంధిత కథనం