రాజధానిగా అమరావతి పేరును చేర్చేలా తీర్మానం - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు-ap cabinet has approved several key decisions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  రాజధానిగా అమరావతి పేరును చేర్చేలా తీర్మానం - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

రాజధానిగా అమరావతి పేరును చేర్చేలా తీర్మానం - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గం భేటీ అయింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని అమరావతి పేరును పునర్విభజన చట్టంలో చేర్చేలా చట్ట సవరణ చేయాలని క్యాబినెట్‌ తీర్మానం చేసింది. ఈ కాపీని కేంద్రానికి పంపాలని నిర్ణయించింది.

ఏపీ కేబినెట్ భేటీ

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపించాలని నిర్ణయించింది.

సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అయింది. పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేబినెట్ కృతజ్ఞతలు తెలిపింది.

  • 47వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
  • రాజధాని నిర్మాణంలో భాగంగా చేసిన భూ కేటాయింపులు ఆమోదించబడ్డాయి.
  • 281 పనులను మున్సిపల్‌ శాఖ హైబ్రిడ్‌ యాన్యూటీ విధానంలో చేపట్టేందుకు ఆమోదం తెలిపింది.
  • మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం(రూ. 10 వేల నుంచి రూ. 20 వేలు) పెంపు నిర్ణయానికి ఆమోదముద్ర
  • రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి మెగా ఈవెంట్స్‌ నిర్వహించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం
  • ఆపరేషన్‌ సిందూర్‌ నిర్వహించిన త్రివిధ దళాలకు మంత్రివర్గం అభినందనలు తెలిపింది.
  • తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాలపై చర్చించింది.
  • తీరప్రాంత భద్రత, రక్షణ రంగ పరిశ్రమల వద్ద జాగ్రత్తలు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించింది.

ఇటీవలనే అమరావతి పున: ప్రారంభ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. రూ.49,040 కోట్లతో అమరావతి పరిధిలో చేపట్టనున్న పలు శంకుస్థాపన చేశారు. వీటితో పాటు రూ.57వేల కోట్లతో చేపట్టిన పలు జాతీయ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను వర్చువల్‌గా చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ… అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సాకారం ఇస్తుందని ఉద్ఘాటించారు.

అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదని మోదీ చెప్పారు. అమరావతి ఒక శక్తి. అమరావతి స్వప్నం సాకారం అవుతున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తి అమరావతికి ఉందన్నారు.

అమరావతి పనులు పునః ప్రారంభమైన నేపథ్యంలో…. వేగంగా పనులను పూర్తి చేసేలా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే పునర్విభజన చట్టంలో అమరావతి పేరును ప్రస్తావించేలా చట్ట సవరణ కోరుతూ కేబినెట్ తీర్మానం చేసింది. త్వరలోనే ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపనుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి…!

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం