AP Cabinet List : ఏపీ కేబినెట్ ఖరారు - డిప్యూటీ సీఎంగా పవన్, మంత్రుల జాబితా ఇదే…!
AP Cabinet List : ఏపీ మంత్రివర్గం ఖరారైంది. సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనుండగా… డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ కు అవకాశం దక్కింది.
AP Cabinet List 2024 : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఖరారైంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత…. లిస్ట్ విడుదలైంది. ఇవాళే సీఎంతో పాటు మంత్రులుగా ఖరారైన వారు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
చంద్రబాబు మంత్రివర్గంలో జనసేన నుంచి ముగ్గురికి అవకాశం లభించింది. ఇక బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ కు బెర్త్ ఖరారైంది. మిగతా వారంతా కూడా టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు.
చంద్రబాబు కేబినెట్ ఇదే….
- ముఖ్యమంత్రి - చంద్రబాబు నాయుడు
- ఉప ముఖ్యమంత్రి - పవన్ కల్యాణ్(జనసేన)
- నారా లోకేశ్
- కొల్లు రవీంద్ర
- పయ్యావుల కేశవ్
- నారాయణ
- అచ్చెన్నాయుడు
- సత్యకుమార్ యాదవ్(బీజేపీ)
- నిమ్మల రామనాయుడు
- గొట్టిపాటి రవి కుమార్
- బీసీ జనార్థన్ రెడ్డి
- టీజీ భరత్
- సవిత
- సుభాష్
- కొండపల్లి శ్రీనివాస్
- మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి
- నాదెండ్ల మనోహర్(జనసేన)
- వంగలపూడి అనిత
- ఎన్ఎండీ ఫరూక్
- ఆనం రామనారాయణరెడ్డి
- అనగాని సత్యప్రసాద్
- కొలుసు పార్థసారథి
- బాల వీరాంజనేయస్వామి
- కందుల దుర్గేష్
చంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటు అవుతున్న కొత్త ప్రభుత్వంలో…. 17 మంది కొత్తవారికి మంత్రులుగా అవకాశం లభించింది. ఇందులో ఎనిమిది మంది బీసీలకు అవకాశం దక్కగా… ముగ్గురు మహిళలు ఉన్నారు. ఎస్టీ సామాజికవర్గానికి ఒకటి, ముస్లిం మైనార్టీ నుంచి ఒకరు, ఎస్సీల నుంచి ఇద్దరికి చోటు కల్పించారు. బీజేపీ నుంచి గెలిచిన సత్య కుమార్ యాదవ్ కు కేబినెట్ బెర్త్ ఖరారైంది.
నారా లోకేశ్ కు కేబినెట్ లో బెర్త్ ఉంటుందా లేదా..? అన్న చర్చ కూడా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆయన పేరు లిస్ట్ లో ఉంది. ఇక పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ , నిమ్మల రామనాయుడు, గొట్టిపాటి రవి కుమార్ కు మంత్రి పదవి దక్కింది.
గతంలోనూ చంద్రబాబు కేబినెట్ లో పని చేసిన నారాయణకు తాజా కొలువు దీరనున్న కేబినెట్ లోనూ బెర్త్ ఖరారైంది. కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్ కు కేబినెట్ లో చోటు దక్కింది. వైసీపీ నుంచి టీడీపీలో చివరి నిమిషంలో చేరి గెలిచిన పార్థసారథికి కూడా మంత్రివర్గంలో చోటు దక్కింది.
ఇక జనసేన పార్టీ నుంచి మంత్రివర్గంలో ముగ్గురికి బెర్త్ లు ఖరారయ్యాయి. పిఠాపురం నుంచి బంపర్ మెజార్టీతో గెలిచిన పవన్ కల్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఇక పార్టీలో సీనియర్ నేతగా ఉన్న నాదెండ్ల మనోహర్ కు కూడా ఛాన్స్ దక్కింది. ఇదే పార్టీ నుంచి గెలిచిన కందుల దుర్గేష్ కు కూడా బెర్త్ ఖరారైంది. ఇక బీజేపీ నుంచి గెలిచిన సత్య కుమార్ మంత్రిగా ప్రమాణం చేయనున్నారు.
ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో ఎన్డీఏ కూటమి 164 సీట్లలో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ మొత్తం 144 స్థానాల్లో పోటీ చేయగా 135 స్థానాల్లో నెగ్గింది. అతిపెద్ద భాగస్వామ్యపక్షంగా టీడీపీ ఉంది. ఇక జనసేన 21కి 21 స్థానాల్లో జెండా ఎగరవేసింది. భారతీయ జనతా పార్టీ మొత్తం 10 చోట్ల పోటీ చేయగా.. 8 సీట్లలో గెలుపొందిన సంగతి తెలిసిందే.
ఇక పార్లమెంట్ స్థానాల విషయానికొస్తే మొత్తం 25 స్థానాలకుగాను టీడీపీ 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది.కూటమిలో ఉన్న జనసేన 2, బీజేపీ 3 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది. రాష్ట్రం నుంచి మెజార్టీ గెలుచుకున్న టీడీపీ…. అటు కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో రెండో అతిపెద్ద పార్టీ అవతరించింది. టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరికి, బీజేపీ నుంచి ఒకరికి కేంద్ర కేబినెట్ లో కూడా చోటు దక్కింది.