Somu Veerraju : ముఖ్యమంత్రికి సోము వీర్రాజు లేఖ….
Somu Veerraju ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల ఏర్పాటుపై ముఖ్యమంత్రికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటైన పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
Somu Veerraju ఏపీలో వైసీపీ-టీడీపీల మధ్య మాటల యుద్ధానికి కారణమైన పరిశ్రమల వ్యవహారంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. పరిశ్రమల ఏర్పాటుపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని సోము డిమాండ్ చేశారు.
ట్రెండింగ్ వార్తలు
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పరిశ్రమల స్థాపన అంశంపై సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి ఎన్ని భూములు ఇచ్చారు? ఎన్ని పరిశ్రమలు స్థాపించారు? దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు.
విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో గత ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలో జరిపిన భూ కేటాయింపుల వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. భూములు కేటాయించిన తర్వాత పరిశ్రమలను ఎందుకు ప్రారంభించలేదని సోము వీర్రాజు ప్రశ్నించారు. భూకేటాయింపులు జరిపిన సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు ఎందుకు ముందుకు రాలేదనే విషయాలపై ప్రభుత్వం ఏనాడైనా సమీక్ష జరిపిందా? పరిశ్రమలు ఏర్పాటు విషయాలు ప్రజలకు ఎందుకు వివరించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరి అనేక ప్రశ్నలకు తావిస్తోందని పేర్కొన్నారు.
ప్రభుత్వం పరిశ్రమలకు కేటాయించిన భూములు కబ్జాలకు గురవుతున్న ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయని విమర్శించారు. అధికార పార్టీ నేతలే కబ్జా దారులనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయని తెలిపారు. ఆయా పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతూ తమ లేఖల్లో ఈ అంశాన్నే ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాయని వివరించారు. వీటన్నింటిపై ప్రభుత్వం శ్వేతపత్రం ద్వారా వివరణ ఇవ్వాలని సోము వీర్రాజు స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో, రాష్ట్రంలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు ఆయా కాంట్రాక్టర్ల కార్యక్రమాలకు అడ్డు పడుతున్నారని, వారి నుంచి పెద్దమొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తున్న ప్రయత్నాలు జరుగుతున్నాయని సోము వీర్రాజు ఆరోపించారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు వైసీపీ ప్రభుత్వం అడ్డుపడుతోందని , ఇటీవలి కాలంలో ఈ తరహా అనేక ఉదాహరణలు బయటికి వస్తున్నాయన్నారు.
అనంతపురంలో జాకీ పరిశ్రమ వెళ్లిపోవడానికి కారణం ఎవరో చెప్పాలని, బెదిరింపులకు పాల్పడుతున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో వివరించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.