PM Narendra Modi : విశాఖలో ప్రధాని రోడ్ షో… రైల్వే జోన్ శంకుస్థాపన లేనట్టే….!
PM Narendra Modi ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటనలో పలు జాతీయ ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో పాటు జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా విశాఖపట్నంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ రోడ్ షో నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రానికి కేంద్రం ఏమి చేయడం లేదనే విమర్శల నేపథ్యంలో విశాఖలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన 9 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయని ఎంపీ జివిఎల్ చెప్పారు.
PM Narendra Modi ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టేకాఫ్కు ప్రధాని పర్యటనతో మొదలవుతుందని ఎంపీ జివిఎల్ నరసింహరావు చెప్పారు. ప్రధాని పర్యటనలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల ఆధర్యంలో చేపట్టిన 9 జాతీయ ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన, జాతిక అంకితం చేయనున్నట్లు చెప్పారు.
ట్రెండింగ్ వార్తలు
ఈ నెల 11వ తేదీ సాయంత్రం మధురై నుంచి ప్రత్యేక విమానంలో నేవీబేస్ చేరుకుంటారు. ప్రధాని విశాఖ చేరుకున్న తర్వాత విశాఖలో రోడ్ షో నిర్వహించేందుకు ఏపీ బీజేపీ నేతలు ఏర్పాటు చేశారు.
ప్రధాని విశాఖ చేరుకున్న తర్వాత నగరంలో రోడ్ షో నిర్వహిస్తారు. కంచర్ల పాలెం నుంచి ఓల్డ్ ఐటిఐ వరకు మోదీ రోడ్ షో నిర్వహిస్తారు. రాత్రి ఎనిమిదింటికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎంపీ జివిఎల్ నరసింహరావు చెప్పారు. దాదాపు కిలోమీటరు పొడవున ప్రధాని రోడ్ షో నిర్వహిస్తారు.
విశాఖ ప్రజలతో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. విశాఖ ప్రజలు మోదీకి స్వాగతం పలికేందుకు తరలి రావాలని బీజేపీ నేతలు కోరారు. ఐఎన్ఎస్ చోళాలో ప్రధాని మోదీ రాత్రి బస చేస్తారు. రోడ్ షో తర్వాత పార్టీ ప్రముఖులతో ప్రధాని భేటీ అవుతారు.
9 ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం….
12వ తేదీ తొమ్మిది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. మరికొన్నింటిని జాతికి అంకితం చేయనున్నారు. విశాఖలో ప్రధాని పాల్గొనే కార్యక్రమాలన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న ప్రాజెక్టులేనని జివిఎల్ స్పష్టం చేశారు. జాతీయ రహదారుల నిర్మాణంలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ భూసేకరణ బాధ్యత ఉంటుందన్నారు.
రూ. 152 కోట్లతో చేపడుతున్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. వచ్చే ఏడాది కాలంలో నిర్మాణం పూర్తి చేయనున్నారు. లక్షలాది మంది మత్స్యకారులకు లబ్ది చేకూర్చే లక్ష్యంతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు ఎంపీ చెప్పారు.
రాయ్పూర్-విశాఖపట్నం మధ్య రూ. 3778కోట్లతో నిర్మించే ఎకనామిక్ కారిడార్ నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేస్తారని జివిఎల్ నరసింహరావు చెప్పారు.
రూ.466కోట్లతో విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఆధునీకీకరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ పనులకు కాంట్రాక్టు కేటాయింపు పూర్తైందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఎంపీ చెప్పారు.
రూ.566కోట్లతో సాగర్ మాల ప్రాజెక్టులో భాగంగా కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలా నగర్ వరకు రోడ్ కనెక్టివిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
గెయిల్ ద్వారా శ్రీకాకుళం నుంచి ఒడిశా వరకు 321 కి.మీ పొడవున రూ. 2658కోట్లతో పైప్లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఓఎన్జీసీ ద్వారా రూ.2917కోట్ల రుపాయల నిర్మాణం చేపట్టనున్నారు.
పాతపట్నం-నర్సన్నపట్నం వరకు రూ.211కోట్లతో నిర్మించిన జాతీయ రహదారిని జాతికి అంకితం చేస్తారు. గుంతకల్లులో ఐఓసిఎల్ రూ.385 కోట్లతో నిర్మించిన పిఓఎల్ డిపోను ప్రధాని ప్రారంభిస్తారు. రాష్ట్ర పర్యటనలో ప్రధాని 9 ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. రూ.15,200కోట్ల రుపాయల కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభిస్తారని బీజేపీ నేతలు చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం వల్లే రైల్వే ప్రాజెక్టుల్లో జాప్యం….
విజయవాడ-నర్సాపూర్-గుడివాడ, నర్సాపురం-భీమడోలు-మచిలీపట్నం డబ్లింగ్, విద్యుదీకరణ రూ.4106కోట్ల రుపాయలతో పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం 50శాతం నిధులు ఇవ్వాల్సి ఉన్నా, 289కోట్లు మాత్రమే ఇచ్చిందని జివిఎల్ చెప్పారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్రం రూ.2వేల కోట్లు ఇవ్వాల్సి ఉన్నా మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించిందని చెప్పారు.
నడికూడి-శ్రీకాళహస్తి, కడప- బెంగళూరు, కోటిపల్లి-నర్సాపూర్ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం వల్లే రైల్వే ప్రాజెక్టులు జాప్యం అవుతున్నాయని జివిఎల్ ఆరోపించారు. సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని పర్యాటన సందర్భంగా భరోసా ఇవ్వాలని కోరారు. దేశ వ్యాప్తంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్న రైల్వేలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సాయం అందించాల్సి అవసరం ఉందని జివిఎల్ చెప్పారు.
ప్రధాని పర్యటనను కొంతమంది రాష్ట్ర అంశాలతో ముడిపెట్టుకుని ప్రచారం చేశారని,వేరే అజెండా ఏమి లేదని జివిఎల్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా చేపట్టే కార్యక్రమాల కోసమే వస్తున్నారని, ఇతర అంశాలేమి ప్రధాని పర్యటనలో లేవని తేల్చిచెప్పారు. ప్రధాని పర్యటన పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక కార్యక్రమాలని పార్టీ కార్యక్రమాలు కాదని,కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభిస్తున్నారని ఎమ్మెల్సీ మాధవ్ చెప్పారు.
విశాఖ రైల్వే జోన్కు శంకుస్థాపన చేయాలని బీజేపీ కూడా కోరామని, ప్రధాని పర్యటనలో రైల్వే జోన్ అంశం ఖరారు కాలేదని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ప్రాజెక్టుల్ని మాత్రమే ప్రధాని జాతికి అంకితం చేస్తారని,రాష్ట్రానికి బీజేపీ ఏమి చేయట్లేదనే వారికి చేపడుతున్న అభివృద్ధి పనులే నిదర్శనమన్నారు.
టాపిక్