Kakani Govardhan : చంద్రబాబు పాలన వల్లే రైతుల ఆత్మహత్యలు…కాకాణి
Kakani Govardhan చంద్రబాబు పాలనా ప్రభావం వల్లే రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. బాబు హయాంలో రాష్ట్రంలో సగానికి సగం కరువు మండలాలే ఉండేవని, వైసీపీ హయాంలో కరువు లేదని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారా అని ప్రశ్నించారు.
Kakani Govardhan రైతులకు చంద్రబాబు చేసిన మేలు ఏంటో చెప్పగలరా అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును మంత్రి కాకాణి గోవర్ధన్ ప్రశ్నించారు. రాష్ట్రంలోని రైతుల్ని, మిగతా వర్గాల ప్రజల్ని ఎలా భయపెట్టాలి.. ప్రభుత్వంపై ఏ విధంగా బురదజల్లాలనే కుట్రలో భాగంగా టీడీపీ ఒక పద్ధతిని అనుసరిస్తుందని మంత్రి ఆరోపించారు. చంద్రబాబుకు అనుకూలమైన మీడియాలో ఒక వార్త రాయడం.. దానిపై చంద్రబాబు ట్వీట్ పెట్టడం..దాని మీద జిల్లాస్థాయిల్లో చోటామోటా నాయకుల చేత మాట్లాడించడం..అనేది అందరూ గమనించాలని కాకాణి సూచించారు.
ట్రెండింగ్ వార్తలు
కుట్రలో భాగంగా చంద్రబాబు ఈరోజు రైతుల ఆత్మహత్యలపై కొన్ని ట్వీట్లు మీద ట్వీట్లు పెట్టాడని, ఆంధ్రప్రదేశ్లో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని.. రైతులు నిరాశానిస్పృహల్లో ఉన్నారని.. బాబు ట్వీట్ చేయడంపై కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు ట్వీట్లను పరిశీలిస్తే, ఆయనకు ఖచ్చితంగా మతిభ్రమిం చిందనిపిస్తుందని విమర్శించారు. బాబు ట్వీట్లలో కారణమేమో రైతుల ఆత్మహత్యలని ఆయన అభిప్రాయం మాత్రం ఆ ట్వీట్లు వ్యవసాయానికి సంబంధించినవి కాదన్నారు. ‘ఆత్మహత్యలు చేసుకుంది రైతులే కాదు.. ఆత్మహత్యల్లో అనేక కోణాలున్నాయి. నిరాశానిస్పృహల్లో ఉన్నవారు.. ఇతరత్రా వేధింపులు ఎదుర్కొంటున్నవారు అని చంద్రబాబు పేర్కొనడంతో రైతుల ఆత్మహత్యల జాబితా అంతా అబద్ధమని చంద్రబాబే స్పష్టం చేసినట్లైందన్నారు.
బాబు పాలనా ప్రభావంతోనే..
2014–2019 మధ్య చంద్రబాబు పరిపాలన ప్రభావం వల్లే రైతులకు ఈ దుస్థితి వచ్చిందని మంత్రి ఆరోపించారు. ఆ ప్రభావం ఆ తర్వాత రోజుల మీద పడింది కాబట్టే.. రైతుల ఆత్మహత్యలు కొనసాగాయని అనేక సందర్భాల్లో చెప్పామన్నారు. రైతుల ఆత్మహత్యల్ని నిరోధించడానికి ఈ ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని, చంద్రబాబు హయాంలో రైతు రుణమాఫీ చేసినట్లు అయితే, నిజాయితీగా పరిపాలన సాగినట్లయితే, రైతుల ఆత్మహత్యలు జరిగేవి కాదన్నారు. చంద్రబాబు హయాంలో రైతులకు చేసిన మేలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. .
బాబు పాలనలో సగం మండలాల్లో కరవే….
2014 నుంచి 2019 మధ్య టీడీపీ హయాంలో ఈ రాష్ట్రంలో 1623 కరువు మండలాలు ప్రకటించారని, ఏడాదికి 325 మండలాలు చొప్పున ప్రకటించారని మా ప్రభుత్వంలో మూడున్నరేళ్ల కాలంలో ఎక్కడా ఒక్క కరువు మండలం ప్రకటించిన దాఖలా లేదన్నారు. చంద్రబాబు హయాంలో కరువు మండలాలున్నాయి కాబట్టి రైతుల ఆత్మహత్యలు తక్కువగా జరిగాయని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కరువు మండలాలు లేనందున రైతు ఆత్మహత్యలు పెరిగాయని సూటిగా సమాధానం చెప్పగలవా అని కాకాణి సవాల్ చేశారు.
రైతులకు సంబంధించి బేషరుతుగా రుణమాఫీ చేస్తానని చంద్రబాబు వాగ్దానం చేస్తే, అందులో రూ. 87, 612 కోట్లు అసలు కాగా వడ్డీతో కలిపితే రూ.1.11 లక్షల కోట్లు అయ్యాయి. ఇందులో కనీసం పదిహేను కోట్ల రుణమాఫీ అయినా నువ్వు చేశావా అని ప్రశ్నించారు. ‘ రైతు రుణమాఫీ లక్షకోట్లయినా తీరుస్తామని ప్రకటించాడని, ఆ మాట నిలబెట్టుకున్నారా అని ప్రశ్నించారు. మీ జీవితానికి రైతుకు సంబంధించి ఒక్క రూపాౖయెనా రుణమాఫీ చేశారా..? అని ప్రశ్నించారు. బ్యాంకుల్లో కుదవ పెట్టిన బంగారం మీద అప్పులన్నీ తీరుస్తానన్న మాటలేమయ్యాయని ప్రశ్నించారు. బాబు మాటల్ని నమ్మి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి అవమానాలకు గురై ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అప్పట్నుంచి మొదలైన ఆర్ధికభారం రైతులపై ఇప్పటికీ ప్రభావం చూపుతుందనేది వాస్తవమన్నారు.
చంద్రబాబు దరిద్రపు పాలనలో కరువు విలయతాండవం చేసింది కనుకనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఇప్పుడేమో ప్రకృతి అనుకూలిస్తుందని స్వయంగా చంద్రబాబే ఒప్పుకుంటున్నాడన్నారు . చంద్రబాబు హయాంలో రిజర్వాయర్ నిండిన దాఖలాలు ఏనాడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. సగటున ఏడాదికి 14 లక్షల టన్నుల ధాన్యం అదనంగా ఉత్పత్తి అవుతున్న మాట వాస్తవమా కాదా అని కాకాణి నిలదీశారు.
ధాన్యం సేకరణలో నిబంధనలు పెట్టామనేది అబద్ధపు ఆరోపణ అని ఇది చంద్రబాబుకు వత్తాసు పలికేమీడియా అసత్యపు ఆరోపణల రాతలుగా అర్ధం చేసుకోవాలన్నారు. బాబు పాలనలో రైతులను అడుగడుగునా దగా చేసి పౌరసరఫరాల వ్యవస్థను భ్రష్టు పట్టించాడని బాబు కాలంలో దళారీలను పెద్ద ఎత్తున పెంచి పోషించారన్నారు. రైతుభరోసా కేంద్రాలతో రైతులకు అండగా నిలబడి వారికి అవసరమైనవన్నీ అందించి.. పంటలను కూడా ఈ క్రాప్ ద్వారా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. పూర్తిగా పారదర్శకమైన విధానం అనుసరిస్తున్న నేపథ్యంలో, చంద్రబాబు హయాంలో ఉన్న దళారీ వ్యవస్థ మూలాలన్నీ ఇప్పుడు వెలుగులోకొస్తున్నాయన్నారు.
రైతులకు బాబు క్షమాపణ చెప్పాల్సిందే..
రైతుల దగ్గర పంటల బీమాకు సంబంధించి ప్రీమియం డబ్బులు కట్టించుకుని రూ. 716 కోట్లు చంద్రబాబు మాయం చేశాడని ఆరోపించారు. పంటలు వరదల్లో నష్టపోతే.. ఏ ఒక్క రైతుకూ నష్టపరిహారం కూడా అందించకుండా బీమా మొత్తాన్ని భోజనం చేశాడని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో సబ్సిడీ ఇవ్వలేదని, పంట నష్టపరిహారం, వడ్డీరాయితీ అందించలేదని, ఇలా అన్నీ ఎగొట్టారని ఆరోపించారు. వ్యవసాయం దండగ అంటూ, ప్రాజెక్టుల మీద ఒక్క పైసా కూడా పెట్టకూడదన్నారు . రైతులకు ఉచిత విద్యుత్ కట్టలేనని చెప్పారని, విద్యుత్ చౌర్యం జరిగిందని రైతుల చేతులకు బేడీలు వేయించి జైలు పాల్జేశారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో రైతులు కిడ్నీలు అమ్ముకున్న చరిత్ర అన్నారు.