అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చెరువులో మునిగి నలుగురు మృత్యువాత పడ్డారు. ములకలచెరువు మండలంలోని పెద్దచెరువులో ఈ ప్రమాదం జరిగింది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....ఈశ్వరమ్మ అనే మహిళ బట్టలు ఉతికేందుకు పిల్లలతో కలిసి పెద్ద చెరువు వద్దకు వెళ్లింది. ఈశ్వరమ్మ కుమార్తె లావణ్య, కుమారుడు నందకిశోర్, మరో చిన్నారి నందిత ఆడుకుంటూ చెరువులోకి వెళ్లి గల్లంతయ్యారు.
పిల్లల్ని కాపాడేందుకు వెళ్లిన ఈశ్వరమ్మ భర్త మల్లేశ్ కూడా చెరువులో గల్లంతే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనాస్థలికి చేరుకున్న స్థానికులు నలుగురి మృతదేహాలను చెరువు నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదం పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే రెండు వారాల క్రితం అన్నమయ్య జిల్లాలో నీటి గుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఆడుకోవడానికి బయటకు వెళ్లిన చిన్నారులు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆట సరదాతో నీటి కుంటలో దిగిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు.
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలోని చిట్వేలి మండలం ఎం రాచపల్లిలో ఇటీవల ఈ ప్రమాదం జరిగింది. స్థానికంగా మట్టి కోసం తవ్విన గుంతలో ఇరుక్కుపోయి విజయ్ (6), దేవాన్ష్ (6), యశ్వంత్ (7) మరణించారు. ఇంటి పరిసర ప్రాంతంలో మట్టి కోసం తవ్విన గుంట వద్దకు ముగ్గురు చిన్నారులు ఆడుకోవడానికి వెళ్లారు.
నీటి గుంటలో దిగిన చిన్నారులు మట్టిలో ఇరుక్కున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మరణించారు. ఆడుకోవడానికి వెళ్లిన పిల్లలు రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల గాలించారు. చివరకు నీటి గుంతలో వెతకగా చిన్నారులు ఇరుక్కుపోయి విగత జీవులుగా కనిపించారు.
చిన్నారులను వారిని బయటకు తీసి స్థానిక ఆసుపత్రికి తరలించగా, వారు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో గ్రామంలో తీవ్రవిషాదం నెలకొంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సంబంధిత కథనం