అన్నదాత సుఖీభవ పథకంపై బిగ్ అప్డేట్, అర్హుల ఎంపికపై మార్గదర్శకాలు జారీ-annadata sukhibhava scheme update eligibility guidelines released for beneficiaries ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  అన్నదాత సుఖీభవ పథకంపై బిగ్ అప్డేట్, అర్హుల ఎంపికపై మార్గదర్శకాలు జారీ

అన్నదాత సుఖీభవ పథకంపై బిగ్ అప్డేట్, అర్హుల ఎంపికపై మార్గదర్శకాలు జారీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలుపై కీలక ప్రకటన చేసింది. మే 20వ తేదీలోగా అర్హుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. కౌలు రైతులు, అటవీ భూములకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

అన్నదాత సుఖీభవ పథకంపై బిగ్ అప్డేట్, అర్హుల ఎంపికపై మార్గదర్శకాలు జారీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద మూడు విడతల్లో ఏటా రూ.20 వేలు రైతులకు అందించనున్నారు. అయితే కౌలు రైతులు, అటవీ భూహక్కుదాలకూ అన్నదాత సుఖీభవ అమలు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.

రైతుల ఖాతాల్లో డబ్బులు

కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో రైతు కుటుంబానికి మూడు విడతల్లో రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ.6 వేలతో కలిపి ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

ఈ నెల 20లోగా అర్హుల జాబితాలు సిద్ధం

ఈ నెల 20లోగా అర్హుల జాబితాలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అటవీ భూములపై హక్కు కలిగిన(ఆర్ఎస్ఆర్) వారిని అర్హులుగా గుర్తించనున్నారు.

వ్యవసాయ, ఉద్యాన, పట్టు సహాయకులతో పాటు తహసీల్దార్, మండల వ్యవ సాయాధికారులు తమ పరిధిలోని రైతుల వివరాలను అర్హుల జాబితాలను ఈనెల 20లోగా అన్నదాత సుఖీభవ వెబ్ సైట్ లో నమోదు చేయాలని ప్రభుత్వం సూచించింది.

అన్నదాత సుఖీభవ పథకం అమలుకు వ్యవసాయశాఖ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది.

అన్నదాత సుఖీభవ పథకం మార్గదర్శకాలు

  1. అన్నదాత సుఖీభవ స్కీమ్ ను భర్త, భార్య, పిల్లలతో కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుని అమలుచేస్తారు. పిల్లలకు వివాహమైతే వారిని ప్రత్యేక యూనిట్ గా పరిగణించి, పెట్టుబడి సాయం అందిస్తారు. వ్యవసాయ, ఉద్యాన, పట్టుకు సంబంధించిన పంటల సాగుదారులకు ఈ పథకం వర్తిస్తుంది.
  2. ఆర్థికంగా ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి ఈ పథకం వర్తించదు. ప్రస్తుత, మాజీ ఎంపీలకు ఈ పథకం వర్తించదు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జడ్పీ ఛైర్ పర్సన్లు, ఇతర రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారు అర్హులు కాదు.
  3. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, కార్యాలయాలు, ఇతర శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు.
  4. నెలకు రూ.10 వేలు, ఆపైన పెన్షన్ తీసుకునే వారు సుఖీభవ పథకానికి అర్హులు కాదు. మల్టీటాస్కింగ్ స్టాఫ్, క్లాస్-4, గ్రూప్ డి ఉద్యోగులకు ఈ పథకం నుంచి మినహాయింపు ఇచ్చారు.
  5. డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, ఛార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్టులు, ఇతర వృత్తి నిపుణులు ఈ పథకానికి అర్హులు కాదు. గత ఏడాది ఆదాయపు పన్ను చెల్లించిన వారు అనర్హులు.
  6. వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర భూములుగా మార్చినా అన్నదాత సుఖీభవ పథకం వర్తించదు.

మే నెలాఖరులోగా పీఎం కిసాన్ జాబితాలు

పీఎం కిసాన్ జాబితాపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మే నెలాఖరులోగా పీఎం కిసాన్ జాబితాలను సిద్ధం చేయనున్నారు. ఈ జాబితాల నుంచి చనిపోయిన వారి పేర్ల తొలగింపు, భూరికార్డులకు అనుగుణంగా లబ్దిదారుల పేర్ల నమోదు, రైతుల ఐడీ నంబర్లు, పెండింగ్ లో ఉన్న ఆధార్, ఈ-కేవైసీ వివరాలు సరిదిద్దనున్నారు.

అటవీ హక్కుల చట్టం, ఆదివాసీలు, గిరిజనులకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాలను సిద్ధంచేయనున్నారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం