Smuggling In India : ఎక్కువ డ్రగ్స్ దొరికింది ఏపీలోనే.. 2021-2022 రిపోర్ట్ ఇదే
Smuggling In India Report :ఏపీలోనే అత్యధికంగా మాదకద్రవ్యాలు దొరికినట్టుగా స్మగ్లింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్ చెబుతోంది. దేశంలోనే పట్టుబడినదాంట్లో ఏపీలో అధికశాతంగా ఉంది.
ఇండియాలో పట్టుబడిన మాదకద్రవ్యాలలో ఎక్కువ శాతం ఏపీ(AP)లోనే దొరికినట్టుగా స్మగ్లింగ్ ఇన్ ఇండియా 2021-2022(Smuggling In India Report) నివేదిక చెబుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నివేదికను విడుదల చేసింది. దేశంలో పట్టుబడిన మాదక ద్రవ్యాలు, అక్రమ ఆయుధాలపై నివేదిక విడుదలైంది. ఏపీలో 18వేల కిలోల డ్రగ్స్ ను కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. 1012 కిలోల గంజాయి, 97 కోట్ల రూపాయల విలువైన 165 టన్నుల ఎర్రచందనం కూడా స్వాధీనం చేసుకున్నారు.
ట్రెండింగ్ వార్తలు
ఇక తెలంగాణ(Telangana)లో చూసుకుంటే.. 1012 కేజీల డ్రగ్స్, మత్తు పదార్థాలను కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దేశంలో మెుత్తం 34 వేల కిలోల డ్రగ్స్, మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 'స్మగ్లింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2021-22'ను విడుదల చేశారు.
2021-2022లో ఆంధ్రప్రదేశ్లో పట్టుబడిన డ్రగ్స్ మొత్తం ఇతర రాష్ట్రాల కంటే చాలా ఎక్కువ. 18,267 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకుని.. 90 మందిని అరెస్టు చేశారు. ఏపీ తర్వాత 10104.99 కిలోల డ్రగ్స్(Drugs), మత్తుపదార్థలతో త్రిపుర తర్వాతి స్థానంలో ఉంది. ఏపీలో భారీ మెుత్తంలో డ్రగ్స్ పట్టుబడినట్టుగా కేంద్రమే నివేదిక ఇవ్వడంతో ప్రతిపక్షాలు విమర్శలు మరోసారి పెంచనున్నాయి. ఇప్పటికే డ్రగ్ క్యాపిటల్ గా ఏపీ ఉందంటూ.. వ్యాఖ్యలు చేస్తున్నాయి.
డెరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ 65వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ నివేదికను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్(nirmala sitharaman) విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. 'స్మగ్లర్లు మీ కంటే తెలివిగా లేరని డీఆర్ఐ(DRI) నిర్ధారించుకోవాలి. ఈ కేసుల్లో ప్రతి ఒక్కటి ప్రారంభ సమయంలోనే ముగింపు కావాలి. స్మగ్లర్లను అరెస్టు చేసి.. విచారించాలి. స్మగ్లింగ్ కార్యాకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి.' అని కేంద్రమంత్రి అన్నారు.
డ్రగ్స్(Drugs)ను పంపుతున్న వారిని పట్టుకోవాల్సిన అవసరం ఉందని నిర్మలా సీతారామన్ అన్నారు. గతంలో కష్టమయ్యేదని.. ఇప్పుడు టెక్నాలజీ(Technology) పెరిగిందని సీతారామన్ చెప్పారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సహకారంతో వర్క్ షాప్ ప్రారంభించాలన్నారు. అధికారులు డ్రగ్స్ రాకెట్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు.