October 03 Telugu News Updates : దసరా రోజున మీటింగ్ ఉంటుంది.. సీఎం కేసీఆర్
- శరన్నవరాత్రుల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత కనకదుర్గమ్మ 8వ రోజైన నిజ ఆశ్వయుజ శుద్ధ అష్టమి సందర్భంగా సోమవారం దుర్గాదేవిగా దర్శనమిచ్చింది.
Mon, 03 Oct 202205:12 PM IST
కొడుకు మరణ వార్త తెలిసి తండ్రి మృతి
గుజరాత్ ఆనంద్ జిల్లా తారాపుర్లో జరుగుతున్న దసరా వేడుకల్లో వీరేంద్ర సింగ్ రాజ్పుత్ అనే యువకుడు గర్బా డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే వీరేంద్ర చనిపోయాడు. అయితే కొడుకు మరణ వార్త తెలిసి తండ్రి మృతి చెందాడు.
Mon, 03 Oct 202205:10 PM IST
పొగాకు బోర్డులో ఏపీకి చెందిన ఇద్దరికి అవకాశం
పొగాకు బోర్డుకి నూతనంగా నలుగురు సభ్యులను నియమించింది కేంద్రప్రభుత్వం. ఈ మేరకు ఉత్వర్వులు జారీ చేసింది. పొగాకు బోర్డులో ఛైర్మన్ కాకుండా 10మంది సభ్యులు ఉంటారు. కొంతమంది పదవీ కాలం ఇటీవలే ముగిసింది. నలుగురిని కొత్తగా నియమించగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు జిల్లాకు చెందిన బొడ్డపాటి బ్రహ్మయ్య, ప్రకాశం జిల్లాకు చెందిన గుత్తా వాసుకి అవకాశం దక్కింది.
Mon, 03 Oct 202205:08 PM IST
వెంకయ్యకు ఘనస్వాగతం
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు నెల్లూరులో పర్యటిస్తున్నారు. ఆయనకు నగరంలో ఘన స్వాగతం లభించింది. కస్తూర్బా గార్డెన్స్లో నిర్వహించే ఆత్మీయ అభినందన సభకు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా వెంకయ్యను గజమాలతో సత్కరించారు. ఈ సభకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా హాజరయ్యారు.
Mon, 03 Oct 202205:06 PM IST
సీడీఎస్ అనిల్ చౌహాన్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ
భారత నూతన త్రిదళాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన జనరల్ అనిల్ చౌహాన్కు కేంద్రం జడ్ ప్లస్ భద్రత కల్పించింది. దిల్లీ పోలీసులు ఆయనకు భద్రత కల్పించనున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ తెలిపింది.
Mon, 03 Oct 202210:11 AM IST
దసరా నాడు మీటింగ్ ఉంటుంది.. సీఎం కేసీఆర్
తెలంగాణ భవన్ లో దసరా నాడు ఉదయం 11 గంటలకు తలపెట్టిన టీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ మీటింగ్ యథావిధిగా జరగుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో దాని ప్రభావం, దసరా నాటి టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం పైన ఉండదని., సభ్యులు అనుమానాలకు గురికావద్దన్నారు. ముందుగా ప్రకటించినట్టే అక్టోబర్ 05 వ తేదీన ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో పార్టీ సర్వసభ్య సమావేశం కొనసాగుతుందన్నారు. అందరూ సరైన సమయానికి హాజరుకావాలన్నారు.
Mon, 03 Oct 202208:03 AM IST
నేటి నుంచి హైదరాబాద్లో కొత్తట్రాఫిక్ నిబంధనలు
సోమవారం నుంచి హైదరాబాద్లో ఆపరేషన్ రోప్ అమలు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. దీంతో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు.మరో ముడు, నాలుగు రోజుల పాటు వాహనదారుల్లో అవగాహన కల్పిస్తామన్నారు. చలాన్లు వెంటనే విధించడం లేదని, మూడు రోజుల తర్వాత విధిస్తామని చెప్పారు. వాహనదారుల్లో పరివర్తన రావాలని, అన్ని సమస్యలు పరిష్కారిస్తామని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.
Mon, 03 Oct 202208:02 AM IST
రోగి మృతితో ఆస్పత్రి వద్ద ఆందోళన
మెహదీపట్నం ప్రీమియర్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. చికిత్స కోసం వచ్చిన ఓ రోగి వద్ద రూ.16 లక్షలు వసూలు చేసి ఆస్పత్రి వైద్యులు అతనికి మృతికి కారణమయ్యారని బంధువులు ఆరోపించారు. సబ్జి మండికి చెందిన జై కిషన్ గంగపుత్ర గుండెనొప్పితో 15 రోజులు క్రితం ఆసుపత్రికి రాగా.. ట్రీట్మెంట్ పేరుతో భారీగా డబ్బులు దండుకున్నారు. అయినా సరైన వైద్యం అందించక పోవడంతో అతను చనిపోయాడని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.
Mon, 03 Oct 202208:01 AM IST
రౌండ్ టేబుల్ మీటింగ్
పాలన వికేంద్రీకరణపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది.మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత,ఎమ్మెల్యేలు, మేధావులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
Mon, 03 Oct 202207:14 AM IST
సూర్య ప్రభ వాహనంపై మలయప్ప స్వామి
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో వాహనంపై విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. వాహన సేవలో మలయప్పస్వామిని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సూర్యప్రభ వాహనంపై తిరుమలేశుడి దర్శనంతో పూర్ణ ఫలం దక్కుతుందనేది భక్తుల నమ్మకం. ఈ వాహనసేవను తిలకిస్తే ఆరోగ్యం, ఐశ్వర్య భాగ్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం.
Mon, 03 Oct 202207:04 AM IST
మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్
మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మునుగోడు స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరుగనుంది. నామినేషన్ల దాఖలు చేయడానికి అక్టోబర్ 14 చివరి తేదీగా ప్రకటించారు. నామినేషన్ల పరిశీలనకు అక్టోబర్ 15వ తేదీని గడువుగా ప్రకటించారు.
Mon, 03 Oct 202206:20 AM IST
హైదరాబాద్లో గంజాయి ముఠా అరెస్ట్
హైదరాబాద్లో అంతరాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టైంది. రూ.2కోట్ల విలువైన 900 కేజీల గంజాయి సీజ్ చేశారు. మల్కన్ గిరి, ఒడిషా నుంచి మహారాష్ట్రకు గంజాయి రవాణా జరుగుతున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ మీదుగా గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ముఠాలో నలుగురిని అరెస్ట్ చేసి డీసీఎం సీజ్ చేశారు.
Mon, 03 Oct 202206:18 AM IST
బాలుడు క్షేమం
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కిడ్నాప్నకు గురైన రాజీవ్సాయి క్షేమంగా లభించాడు. బాలుడిని నెల్లూరు జిల్లా కావలి వద్ద వదిలి దుండగులు పారిపోయారు. బాలుడిని పోలీసులు చిలకలూరిపేటకు తీసుకొస్తున్నారు.
Mon, 03 Oct 202205:01 AM IST
చిలకలూరిపేటలో బాలుడి కిడ్నాప్ కలకలం
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో బాలుడి కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఎనిమిదేళ్ల రాజీవ్ సాయిని దుండగులు కిడ్నాప్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై బాలుడి తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు. రాజీవ్ సాయి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
Mon, 03 Oct 202204:59 AM IST
ఏనుగుల బీభత్సం
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఏనుగుల బీభత్సం సృష్టించాయి. వరి, అరటి, బీన్స్ పంటలను ఏనుగుల గుంపు ధ్వంసం చేశాయి. మణీద్రం, సింగసముద్రం పరిసరాల్లో తోటలను ఏనుగులు నాశనం చేశాయి. ఏనుగుల దాడితో రామకుప్పం మండల వాసులు భయాందోళనలో ఉన్నారు.
Mon, 03 Oct 202204:58 AM IST
పీలేరులో టీడీపీ నిరాహార దీక్షలు
అన్నమయ్య జిల్లా పీలేరులో టీడీపీ నిరాహార దీక్షలు చేపట్టింది. నల్లారి కిషోర్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఐదు వేల మందితో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.
Mon, 03 Oct 202204:57 AM IST
యూపీ దుర్గ పూజలో అపశ్రుతి
ఉత్తర్ ప్రదేశ్ భదోహిలో దుర్గమ్మ పూజలో అపశ్రుతి చోటు చేసుకుంది. అమ్మవారి మండపంలో అగ్నిప్రమాదం జరగడంతో ఐదుగురు మృతి చెందారు. మంటల్లో చిక్కుకుని ముగ్గురు పిల్లలు, ఇద్దరు మహిళలు మృతి చెందారు. అగ్నిప్రమాదంలో 40 మంది భక్తులకు గాయాలు అయ్యాయి.
Mon, 03 Oct 202204:12 AM IST
నేడు వాయుసేనలోకి ఎల్సీహెచ్ హెలికాప్టర్లు
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తేలికపాటి పోరాట హెలికాప్టర్లు నేడు వాయుసేనలోకి ప్రవేశిస్తున్నాయి. భారత వైమానిక దళంలోకి లాంఛనంగా ప్రవేశపెడుతున్నారు. రాజస్థాన్లోని బోద్పుర్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వీటిని ప్రవేశపెడతారు. ఎల్సీహెచ్ను అభివృద్ధి చేసిన హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్.. వీటితో ప్రధానంగా పర్వత ప్రాంతాల్లో మోహరింపుల హెలికాప్టర్లను వినియోగిస్తారు. శత్రు రాడార్లను బోల్తా కొట్టించే స్టెల్త్ సామర్థ్యం హెలికాప్టర్లలో ఉంది.
Mon, 03 Oct 202203:20 AM IST
నెల్లూరులో ఓం బిర్లా పర్యటన
నెల్లూరు జిల్లాలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పర్యటించనున్నారు. స్వర్ణభారతి ట్రస్ట్, అక్షర విద్యాలయంలో జరిగే కార్యక్రమంలో స్పీకర్ పాల్గొననున్నారు. వెంకయ్యనాయుడు ఆత్మీయ సమ్మేళన సభ, దసరా ప్రతిభా పురస్కారాల్లో ఓం బిర్లా పాల్గొంటారు.
Mon, 03 Oct 202203:20 AM IST
తిరుమలలో రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 32 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీలలో రూ.2.31 కోట్లు ఆదాయం లభించింది. శ్రీవారిని ఆదివారం 82,463 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,385 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.
Mon, 03 Oct 202203:20 AM IST
గంజాయి మత్తులో బాలికలు
గంజాయి సేవించడానికి అలవాటు పడిన ఇద్దరు బాలికల్ని విజయవాడ పోలీసులు బాలల సంరక్షణ గృహానికి తరలించగా అక్కడి నుంచి వారు పారిపోవడం కలకలం సృష్టించింది. ఎగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు లాక్డౌన్ సమయంలో గంజాయికి అలవాటు పడ్డారు. ఇటీవల పోలీసుల దాడుల్లో వారు దొరికిపోయారు. వీరితో మరో బాలికను కూడా పోలీసులు రెస్క్యూ సెంటర్కు తరలించారు. అక్కడి నుంచి బాలికలు పారిపోవడంతో వారి కోసం గాలింపు ప్రారంభించారు.
Mon, 03 Oct 202203:20 AM IST
వైభవంగా తిరుమల బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల ఏడవ రోజు ఉదయం శ్రీవారు సూర్యప్రభ వాహనాన్ని అధిష్టించి తేజో విరాజితుడిగా దర్శనమిస్తారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు.