రాష్ట్ర వ్యాప్తంగా 29 వేల రేషన్ షాపుల్లో సరకుల సరఫరా చేసే వ్యవస్థపై గత ప్రభుత్వంలో కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ, వినియోగదారులను ఇబ్బందులకు గురిచేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. 9260 రేషన్ పంపిణీ వాహనాలు ఏర్పాటు కోసం రూ.1860 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారన్నారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న రెండు కీలక నిర్ణయాలను మంత్రి మీడియాకు వివరించారు.
"ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తామని మాయమాటలు చెప్పారు. రేషన్ సరకులు ఇంటింటికీ రేషన్ సరకులు డోర్ డెలివరీ చేయలేదు. వీధిలో ఎక్కడో ఒక చోట పెట్టి, సరకులు ఇచ్చేవారు.
దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాం. రేషన్ రైస్ స్మగ్లింగ్...మీ వ్యాన్ల వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత ప్రారంభమైంది. ఈ వ్యాన్ల వల్ల పారదర్శకత లోపించింది. ఈ వ్యాన్ ఆపరేటర్లపై వందల కేసులు ఉన్నాయి" - మంత్రి నాదెండ్ల మనోహర్
'ఈ రేషన్ వాహనాల ద్వారా రైస్ పక్కదారిపట్టింది. కార్పొరేషన్ ద్వారా వీరికి జీతాలు చెల్లించాల్సిన పరిస్థితి. 500లకు పైగా రేషన్ వాహనాలు ఎక్కడున్నాయో మాకు సమాచారంలేదు. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఈ నిర్ణయం తీసుకున్నారు.
రేషన్ దుకాణాలు 15వ తేదీ వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకూ వినియోగదారులు ఎప్పుడైనా వెళ్లి సరకులు తెచ్చుకునేలా అందుబాటులో ఉంటారు' అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారానే సరకులు అందించాలని కేబినెట్ లో నిర్ణయించామని మంత్రి నాదెండ్ల అన్నారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులతో రేషన్ డోర్ డెలివరీ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కొత్త యాప్ ద్వారా రేషన్ పంపిణీ, షాపుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో పర్యవేక్షణ చేయనున్నామని చెప్పారు.
'రేషన్ దుకాణాల ద్వారా కేంద్ర ప్రభుత్వ ప్రొడెక్టులు, గిరిజన ఉత్పత్తులు విక్రయించేలా ఏర్పాటు చేస్తాం. రేషన్ డీలర్లు చిన్న చిన్న కిరాణా షాపులు పెట్టుకునేలా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాథమిక అనుమతులు తీసుకున్నాం.
అలాగే రేషన్ ఎండీయూ వాహనాలు ఎవరి పేరుతో ఉన్నాయో వారికి ఉచితంగా అందించాలని నిర్ణయించాం' అని మంత్రి అన్నారు.
"ఎండీయూ వాహనాల నిలిపివేతతో రైస్ డైవర్షన్ తగ్గుతుందన్నారు. దీపం-2 పథకంపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీపం-2 మొదటి దశలో 97 లక్షల మంది లబ్దిపొందారు. ఫేజ్ -2 లో ఇప్పటికే 70 మంది గ్యాస్ బుకింగ్ చేసుకున్నారు.
ఫేజ్ -3లో ముందుగానే డబ్బులు వేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మూడో ఫేజ్ మొదలవ్వగానే ముందుగానే లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు పడేటట్లు చేయాలని నిర్ణయం తీసుకున్నాం"- మంత్రి నాదెండ్ల మనోహర్
సంబంధిత కథనం