AP Ration Card Ekyc : రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. రేషన్ కార్డుదారులందరికీ ఈకేవైసీ నమోదు, అప్డేట్కు సంబంధించి గడువు పొడిగించింది. ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగిస్తూ రాష్ట్ర పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో రేషన్ కార్డుదారులకు కాస్త ఉపశమనం లభించింది.
అయితే రాష్ట్ర ప్రభుత్వం తొలుత మార్చి 31వ తేదీలోగా ఈకేవైసీ చేసుకోకపోతే, ఏప్రిల్ నుంచి రేషన్ బంద్ కానుందని ప్రకటించింది. అందుకనుగుణంగా మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. అయితే ఈకేవైసీ నమోదు నత్తనడకగా జరగడం, నమోదులో సాంకేతిక సమస్యలు రావడం, అలాగే ఈకేవైసీ చేసేందుకు సిబ్బంది కొరత, పర్యవేక్షించే ఎంఎస్వోలకు పదో తరగతి పరీక్షల విధులు అప్పగించడం వంటి కారణాలతో ఈకేవైసీ నమోదు నత్తనడకగా జరుగుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం విధించిన గడువు మార్చి 31 మరో రెండు రోజులే ఉండటంతో, ఇప్పటి వరకు కనీసం 50 శాతం కూడా ఈకేవైసీ నమోదు కాకపోవడంతో గడువును పెంచాలని సీపీఎం తదితర రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. అలాగే ప్రజలు మండుటెండలో భారీ స్థాయిల్లో క్యూ లైన్లలో ఉంటున్నారు. దీంతో ప్రజలు కూడా గడువును పొడిగించాలని కోరుతున్నారు. ఈ డిమాండ్లు, విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం గడువు పొడిగించేందుకు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే మరో నెల రోజుల పాటు గడువును పొగించింది. ఏప్రిల్ 30వ తేదీ లోపు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించింది.
ఈ మేరకు రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ ఈనెలాఖరులోగా ఈకేవైసీని పూర్తి చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని జిల్లా పౌర సరఫరాల అధికారులు (డీసీఎస్వో)లకు ఆదేశించారు. ఈ-పోస్ పరికరాలు, గ్రామ సచివాలయ, వార్డు సచివాలయ మొబైల్ యాప్ ద్వారా రేషన్ లబ్ధిదారుల ఈకేవైసీని ఏప్రిల్ 30వ తేదీ లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే ఈకేవైసీ చేసుకున్నవారికి అవసరం లేదు. ఇంకా ఈకేవైసీ చేసుకోలేని వారికి చేయాల్సి ఉంది.
1. ఎఫ్పీ షాప్ డీలర్ లాగిన్, తహసీల్దార్ లాగిన్, డీసీఎస్వో లాగిన్, కలెక్టర్ లాగిన్లలో ఈకేవైసీపీ యూనిట్లు అందుబాటులో ఉంచారు.
2. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం (జీఎస్డబ్ల్యూఎస్) మొబైల్ యాప్, ఎఫ్పీ షాపుల్లో ఈ-పోస్ పరికరాల ద్వారా ఈకేవైసీ అప్డేట్ చేసుకునే సదుపాయం కల్పించారు.
3. అందువల్ల, అన్ని జిల్లా కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారులు (డీసీఎస్వో)లు ఫీల్డ్ అధికారులకు తగిన సూచనలు జారీ చేయాలని సూచించారు.
లబ్ధిదారులు (5 సంవత్సరాల లోపు పిల్లలు మినహా) గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం మొబైల్ యాప్ లేదా ఈ-పీవోఎస్ పరికరాల ద్వారా ఈకేవైసీపీ ప్రక్రియను ఏప్రిల్ 30లోపు పూర్తి చేయాలని పేర్కొన్నారు. అలా చేయకపోతే, కార్డుదారులకు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం