ఏపీలో రేషన్ కార్డు ఈ-కేవైసీకి మరో 4 రోజులే గడువు, త్వరపడండి!-andhra pradesh ration card ekyc ends april 30th update biometric through meeseva for ration shops ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏపీలో రేషన్ కార్డు ఈ-కేవైసీకి మరో 4 రోజులే గడువు, త్వరపడండి!

ఏపీలో రేషన్ కార్డు ఈ-కేవైసీకి మరో 4 రోజులే గడువు, త్వరపడండి!

ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డు ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు ఏప్రిల్ 30, 2025 చివరి తేదీ. ఈ గడువులోగా రేషన్ కార్డుదారులు రేషన్ షాపులు లేదా మీ-సేవ కేంద్రాల్లో బయోమెట్రిక్ ధృవీకరణ చేసి ఈ-కేవైసీ పూర్తి చేయాలి.

ఏపీలో రేషన్ కార్డు ఈ-కేవైసీకి మరో 4 రోజులే గడువు, త్వరపడండి!

ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డు ఈ-కేవైసీ గడువు ఏప్రిల్ 30, 2025తో ముగియనుంది. అంటే ఇంకా 4 రోజులు మాత్రమే టైం ఉంది. ఈ గడువులోపు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి. ఈ-కేవైసీ చేయకపోతే రేషన్ సబ్సిడీ నిలిచిపోయే ప్రమాదం ఉంది. వచ్చే నెల నుంచి రేషన్ కార్డుల్లో మార్పు చేర్పులు, ఏటీఎం సైజులో, క్యూఆర్ కోడ్ తో రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ఇటీవల పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

రేషన్ బంద్!

ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా కొత్త రేషన్ కార్డుల జారీకి ముందు రేషన్ కార్డు eKYC ప్రక్రియ చేపట్టింది. ఈ e-KYC ద్వారా రేషన్ కార్డులోని సభ్యులు ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ చేయాలి. ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే కార్డులో సభ్యుల రేషన్ నిలిచిపోయే అవకాశం ఉంది.

ఈ-కేవైసీ ఎందుకు?

  • ఈ కేవైసీ ద్వారా అనర్హులను, నకిలీ రేషన్ కార్డులను గుర్తించి తొలగించనున్నారు.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై అందించే సరుకులు అర్హులైన పేదలకు చేరనున్నాయి.
  • క్యూఆర్ కోడ్ కార్డుతో సభ్యుల వివరాలు సులభంగా తనిఖీ చేయవచ్చు.

రేషన్ షాపుల్లో లిస్ట్ లు

ముందుగా మీ రేషన్ దుకాణం డీలర్ వద్ద ఉన్న లిస్ట్ లో మీ పేరు ఉందేమో చెక్ చేసుకోండి. రేషన్ డీలర్ల వద్ద ఈ-కేవైసీ పెండింగ్ లిస్ట్ లు ఉన్నాయి. ఇందులో పేరు ఉంటే...రేషన్ షాపు వద్ద లేదా మీ-సేవ కేంద్రాల్లో బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోండి. గతంలో ఐదేళ్ల లోపు పిల్లలను కార్డుల్లో చేర్చి ఉంటే, వారి వయస్సు ఇప్పుడు 5 ఏళ్లు పైబడితే ముందుగా వారికి ఆధార్ కేంద్రంలో బయోమెట్రిక్ నమోదు చేయించండి. అనంతరం రేషన్ షాపుల్లో eKYC పూర్తి చేయించండి.

ఈ-కేవైసీ ఎలా పూర్తి చేయాలి?

  1. రేషన్ కార్డు ఈ-కేవైసీకి ఏప్రిల్ 30, 2025 చివరి తేదీ. ఈలోగా మీకు సమీపంలోని మీ-సేవ కేంద్రం లేదా రేషన్ దుకాణానికి వెళ్లండి.
  2. మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు వివరాలు సమర్పించండి.
  3. వేలిముద్ర లేదా ఐరిస్ స్కాన్ ద్వారా కేవైసీ వివరాలు ధృవీకరణ చేయండి.
  4. ఈ-కేవైసీ పూర్తయిన తర్వాత రశీదు తీసుకోండి.
  5. ఈ ప్రక్రియ పూర్తి చేస్తే మే 2025 నుంచి విడుదల చేసే కొత్త రేషన్ కార్డులు పొందేందుకు అర్హులవుతారు.

రేషన్ కార్డుతో ప్రయోజనాలు

తెల్ల రేషన్ కార్డుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెల్ల రేషన్ కార్డు ఆధారంగా సంక్షేమ పథకాలు అందిస్తాయి. రేషన్ దుకాణాల ద్వారా ఈ కార్డులు ఉన్న వారికి నెలవారీ బియ్యం, పంచదార, కందిపప్పు, గోధుమలు, ఇతర సరకులు అందిస్తారు. అలాగే రేషన్ కార్డు ఉన్న వారికి గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ అందిస్తారు. దీంతో పాటు చాలా పథకాలకు రేషన్ కార్డును అర్హతగా పరిగణిస్తారు.

ఏటీఎం కార్డు సైజులో కొత్త కార్డులు

ఏపీలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా వారికి సంబంధిత ఫొటోలు, రంగులలో కార్డులు జారీ చేస్తుంటారు. వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ ఫొటో, వైసీపీ రంగుల్లో కార్డులు ఇచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో కొత్త కార్డులు జారీ చేయనున్నారు. వచ్చే నెలలో కొత్త కార్డుల జారీ ప్రక్రియ మొదలుకానుంది. అయితే ఈసారి రేషన్ కార్డులను ఏటీఎం కార్డు సైజులో క్యూఆర్ కోడ్ తో జారీ చేయనున్నారు. సాంకేతికంగా, మరింత సౌలభ్యంగా ఈ కార్డులు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.

కొత్త రేషన్ కార్డు పొందేందుకు అర్హతలు

  1. దరఖాస్తుదారుడు ఆంధ్రప్రదేశ్ లో శాశ్వత నివాసి అయి ఉండాలి.
  2. గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయం రూ.10,000 కంటే తక్కువ, పట్టణాల్లో రూ.12,000 కంటే తక్కువ ఉండాలి.
  3. కుటుంబంలో ఎవరూ ఆదాయపు పన్ను చెల్లించవారు ఉండకూడదు.
  4. నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. అయితే టాక్సీ, ఆటో, ట్రాక్టర్ కు మినహాయింపు ఇస్తారు.
  5. ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డు కలిగి ఉండకూడదు.

కొత్త రేషన్ కార్డుల కోసం మీ-సేవా, గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని సమాచారం. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ-కేవైసీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, వేల సంఖ్యలో పెండింగ్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గడువు మరోసారి పెంచుతారా? లేదా? అనేది వేచిచూడాలి.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం