ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డు ఈ-కేవైసీ గడువు ఏప్రిల్ 30, 2025తో ముగియనుంది. అంటే ఇంకా 4 రోజులు మాత్రమే టైం ఉంది. ఈ గడువులోపు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి. ఈ-కేవైసీ చేయకపోతే రేషన్ సబ్సిడీ నిలిచిపోయే ప్రమాదం ఉంది. వచ్చే నెల నుంచి రేషన్ కార్డుల్లో మార్పు చేర్పులు, ఏటీఎం సైజులో, క్యూఆర్ కోడ్ తో రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ఇటీవల పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా కొత్త రేషన్ కార్డుల జారీకి ముందు రేషన్ కార్డు eKYC ప్రక్రియ చేపట్టింది. ఈ e-KYC ద్వారా రేషన్ కార్డులోని సభ్యులు ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ చేయాలి. ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే కార్డులో సభ్యుల రేషన్ నిలిచిపోయే అవకాశం ఉంది.
ముందుగా మీ రేషన్ దుకాణం డీలర్ వద్ద ఉన్న లిస్ట్ లో మీ పేరు ఉందేమో చెక్ చేసుకోండి. రేషన్ డీలర్ల వద్ద ఈ-కేవైసీ పెండింగ్ లిస్ట్ లు ఉన్నాయి. ఇందులో పేరు ఉంటే...రేషన్ షాపు వద్ద లేదా మీ-సేవ కేంద్రాల్లో బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోండి. గతంలో ఐదేళ్ల లోపు పిల్లలను కార్డుల్లో చేర్చి ఉంటే, వారి వయస్సు ఇప్పుడు 5 ఏళ్లు పైబడితే ముందుగా వారికి ఆధార్ కేంద్రంలో బయోమెట్రిక్ నమోదు చేయించండి. అనంతరం రేషన్ షాపుల్లో eKYC పూర్తి చేయించండి.
తెల్ల రేషన్ కార్డుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెల్ల రేషన్ కార్డు ఆధారంగా సంక్షేమ పథకాలు అందిస్తాయి. రేషన్ దుకాణాల ద్వారా ఈ కార్డులు ఉన్న వారికి నెలవారీ బియ్యం, పంచదార, కందిపప్పు, గోధుమలు, ఇతర సరకులు అందిస్తారు. అలాగే రేషన్ కార్డు ఉన్న వారికి గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ అందిస్తారు. దీంతో పాటు చాలా పథకాలకు రేషన్ కార్డును అర్హతగా పరిగణిస్తారు.
ఏపీలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా వారికి సంబంధిత ఫొటోలు, రంగులలో కార్డులు జారీ చేస్తుంటారు. వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ ఫొటో, వైసీపీ రంగుల్లో కార్డులు ఇచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో కొత్త కార్డులు జారీ చేయనున్నారు. వచ్చే నెలలో కొత్త కార్డుల జారీ ప్రక్రియ మొదలుకానుంది. అయితే ఈసారి రేషన్ కార్డులను ఏటీఎం కార్డు సైజులో క్యూఆర్ కోడ్ తో జారీ చేయనున్నారు. సాంకేతికంగా, మరింత సౌలభ్యంగా ఈ కార్డులు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.
కొత్త రేషన్ కార్డుల కోసం మీ-సేవా, గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని సమాచారం. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ-కేవైసీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, వేల సంఖ్యలో పెండింగ్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గడువు మరోసారి పెంచుతారా? లేదా? అనేది వేచిచూడాలి.
సంబంధిత కథనం