AP NEW CS : ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ సెక్రటరీగా జవహర్‌ రెడ్డి….-andhra pradesh new chief secretary jawahar reddy will take charge on december 1st ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh New Chief Secretary Jawahar Reddy Will Take Charge On December 1st

AP NEW CS : ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ సెక్రటరీగా జవహర్‌ రెడ్డి….

HT Telugu Desk HT Telugu
Nov 26, 2022 07:07 AM IST

AP NEW CS ఆంధ‌్రప్రదేశ్‌ చీఫ్‌ సెక్రటరీగా జవహర్‌ రెడ్డి నియమితులు కానున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి సన్నిహితులుగా పేరొందిన జవహర్‌ రెడ్డి నియామకం లాంఛనం కానుంది. ప్రస్తుత చీఫ్‌ సెక్రటరీ సమీర్ శర్మ ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. సమీర్ శర్మ పదవీ కాలం ఇప్పటికే ముగిసినా ఆర్నెల్లపాటు పొడిగించారు.

ఏపీ నూతన చీఫ్ సెక్రటరీగా  జవహర్‌ రెడ్డి
ఏపీ నూతన చీఫ్ సెక్రటరీగా జవహర్‌ రెడ్డి

AP NEW CS ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జవహర్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ పదవీ కాలం ఈ నెలాఖరుకు పూర్తవుతుండటంతో నూతన సీఎస్‌గా జవహర్ రెడ్డిని నియామకానికి ముఖ్యమంత్రి అమోదం తెలిపినట్లు సమాచారం. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మను కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా నియమించే అవకాశాలున్నాయి. డిసెంబర్ 1న జవహర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

2024 జూన్ వరకు జవహర్‌ రెడ్డి ఈ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. 2024 ఎన్నికలు ఆయన సారథ్యంలోనే జరుగనున్నాయి. ఏడాదిన్నర పాటు జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీగా పనిచేయనున్నారు. మరోవైపు ప్రస్తుత సిఎస్ సమీర్ శర్మను కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా నియమించనున్నారు. సమీర్‌ శర్మను ఇనిస్టిట్యూట్ ఆఫ్ లీడర్‌షిప్, ఎక్సలెన్స్‌ అండ్ గవర్నెన్స్‌ ఐఎల్‌ఈ అండ్ జీ వైస్‌ ఛైర్మన్ పోస్టుల్లో ఇన్‌ఛార్జిగా నియమిస్తారని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న జవహర్ రెడ్డి 1990 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ఏపీ క్యాడర్‌లో ఆ‍యనకంటే సీనియర్లైన 1987 బ్యాచ్‌ నీరబ్ కుమార్ ప్రసాద్, 1988 బ్యాచ్‌ పూనం మాలకొండయ్య, 1989 బ్యాచ్ కరికాల్ వలవన్‌లు చీఫ్‌ సెక్రటరీ పోస్టును ఆశించినా సిఎం జవహర్‌ రెడ్డికే ప్రాధాన్యతనిచ్చారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జవహర్‌ రెడ్డికి ప్రభుత్వం ప్రాధాన్యత లభిస్తోంది. ఆయన స్వయంగా కోరడంతో మొదట్లో టీటీడీ ఈవో బాధ్యతలు అప్పగించారు. ఆ పోస్టులో ఉండగానే సిఎంఓలో కార్యదర్శిగా నియమించారు. కొన్ని నెలల పాటు రెండు పోస్టుల్లోను కొనసాగారు. కోవిడ్ సమయంలో వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతల్ని పర్యవేక్షించారు.

ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న జవహర్‌ రెడ్డి సారథ్యంలోనే సిఎంఓ కార్యకలాపాలన్నీ సాగుతున్నాయి. ప్రస్తుతం మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీలక్ష్మీని కూడా సిఎస్‌ చేస్తారని ప్రచారం జరిగినా చివరకు జవహర్‌ రెడ్డికే ఆ పదవి వరించింది. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ 2021 అక్టోబర్‌ 10న చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. 2021 అక్టోబర్ 30న పదవీ విరమణ చేయాల్సి ఉండగా ముఖ్యమంత్రి విజ్ఞప్తితో కేంద్ర ప్రభుత్వం మొదట ఆర్నెల్ల పాటు ఆ‍యన పదవీ కాలాన్ని పొడిగించింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో మరో ఆర్నెల్లపాటు ఆయన పదవీ కాలం పెరిగింది.

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నలుగురు చీఫ్ సెక్రటరీలు మారారు. వీరిలో ఎల్వీ సుబ్రహ్మణ్యం అవమానకరమైన పరిస్థితుల్లో పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. సిఎం ఆదేశాలను ఉల్లంఘించడంతో ఆ‍యన పదవి నుంచి తప్పించాల్సి వచ్చింది. ఆ తర్వాత బాధ్యతలు చేపట్టిన ఆదిత్యనాథ్ దాస్‌ పదవీ విరమణ తర్వాత ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పని చేసిన నీలం సాహ్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పని చేశారు. ప్రస్తుతం పని చేస్తున్న సమీర్ శర్మ మరికొద్ది రోజుల్లో పదవీ విరమణ చేయనున్నారు.

IPL_Entry_Point