Tirumala Darshan Tickets : బ్లాక్‌లో తిరుమల వీఐపీ దర్శనం టికెట్లు.. వెలుగులోకి ఎమ్మెల్సీ బాగోతం!-andhra pradesh mlc sold tirumala vip darshan tickets in block ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Darshan Tickets : బ్లాక్‌లో తిరుమల వీఐపీ దర్శనం టికెట్లు.. వెలుగులోకి ఎమ్మెల్సీ బాగోతం!

Tirumala Darshan Tickets : బ్లాక్‌లో తిరుమల వీఐపీ దర్శనం టికెట్లు.. వెలుగులోకి ఎమ్మెల్సీ బాగోతం!

Tirumala Darshan Tickets : శ్రీవారి దర్శనం.. మహాభాగ్యంగా భావిస్తారు భక్తులు. లక్షలాది మంది శ్రీవారిని దర్శించుకొని అధ్యాత్మికానందం పొందుతారు. భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి ఎంతో సాయం చేస్తారు. కానీ.. ఏపీలో ఓ ఎమ్మెల్సీ మాత్రం.. శ్రీవారి దర్శనం పేరుతో వ్యాపారం చేశారు.

తిరుమల (@iriseye_here)

బ్లాక్‌లో తిరుమల శ్రీవారి వీఐపీ దర్శన టికెట్ల వ్యవహారం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. ఏకంగా ఓ ఎమ్మెల్సీ బ్లాక్‌లో వీఐపీ దర్శన టికెట్లు అమ్ముకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. సదరు ఎమ్మెల్సీ సిఫార్సు లేఖపై భక్తులు 6 టికెట్లు పొందారు. 6 టికెట్లను రూ.65 వేలకు భక్తులకు అమ్ముకున్నారు. దీంతో ఎమ్మెల్సీపై టీటీడీ అధికారులకు భక్తుడు ఫిర్యాదు చేశారు.

భక్తుడి ఫిర్యాదుతో టీటీడీ అధికారులు విచారణ చేపట్టారు. వీఐపీ దర్శన టికెట్లు అమ్ముకోవడం నిజమేనని నిర్ధారణ కావడంతో.. పోలీసులకు టీటీడీ విజిలెన్స్ వింగ్ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో.. ఏ1గా చంద్రశేఖర్ అనే వ్యక్తిని, ఏ2గా ఎమ్మెల్సీని, ఏ3గా ఎమ్మెల్సీ పీఆర్వో కృష్ణతేజ పేర్లు చేర్చారు పోలీసులు. ఈ ఇష్యూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

గతంలో కూడా టీటీడీ టికెట్లను అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరు మంత్రులు ఈ దందాలో ఉన్నట్టు టీడీపీ నాయకులు ఆరోపించారు. తక్కువ ధరకు ఇవ్వాల్సిన టికెట్లను వేల రూపాయలకు విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఓ ట్రావెల్స్, ఓ వైబ్‌సైట్ ద్వారా ఈ దందా నడిపించారని టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది. దీనిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది.

ఇటీవల తిరుమలలో లడ్డూ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో స్వచ్ఛమైన నెయ్యికి బదులుగా కల్తీ నెయ్యి కలిసిందని రిపోర్టులు బయటికి వచ్చాయి. ఆ కల్తీ నెయ్యిలో చేప నూనె, జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనెలు కలిశాయన్న విషయం సంచలనంగా మారింది.

మరోవైపు ఆన్‌లైన్‌లో జనవరి నెల ఆర్జిత సేవా టికెట్లు విడుదల కానున్నాయి. లక్కీడిప్ విధానంలో ఆర్జిత సేవా టికెట్లను కేటాయించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటల వరకు లక్కీడిప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు లక్కీడిప్ విధానంలో ఆర్జిత సేవా టికెట్లు కేటాయింపు ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.