AP Heat Wave : ఏపీలో మరో రెండ్రోజుల పాటు వడగాల్పులు, ఈ ప్రాంతాల్లో ప్రజలకు అలెర్ట్
AP Heat Wave : ఏపీలో మరో రెండ్రోజుల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు 135 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
AP Heat Wave : ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేడ్కర్ తెలిపారు. రేపు(ఆదివారం) అల్లూరి జిల్లాలోని చింతూరు, కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు తీవ్రవడగాల్పులు, 135 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి(సోమవారం) 8 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 268 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు వెల్లడించారు. శనివారం పల్నాడు జిల్లా రావిపాడు 45.6°C, గుంటూరు జిల్లా మంగళగిరి, తూర్పుగోదావరి జిల్లా పేరవలి, బాపట్ల జిల్లా వేమూరు, మన్యం జిల్లా పేదమేరంగిలో 45.5°C ల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పారు. 14 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 143 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు
ఈ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగత్రలు
• విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44°C - 45°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
• కోనసీమ, పశ్చిమగోదావరి, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 43°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
• శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 39°C - 41°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
ఈ జాగ్రత్తలు తీసుకోండి
ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని, డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS, మజ్జిగ, నిమ్మకాయ నీరు, కొబ్బరినీరు తాగాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా.బి.ఆర్ అంబేడ్కర్ సూచించారు. మరోవైపు వేసవిలో అక్కడక్కడ ఈదురగాలులతో కురిసే అకాల వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే కూలీలు, పుశు, గొర్రె కాపరులు చెట్ల కింద ఉండరాదన్నారు.
తెలంగాణలో మండిపోతున్న ఎండలు
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. శనివారం కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం జంబుగలో 46.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలలో ఇది రెండో స్థానంలో ఉంది. దహెగాంలో 45.7 డిగ్రీలు, చింతలమానేపల్లిలో 45.5 డిగ్రీలు, పెంచికలపేట, పెద్దపల్లి జిల్లా రంగంపల్లిలో 45.1 డిగ్రీలు, ముత్తారంలో 45 డిగ్రీలుసుల్తానాబాద్లో 44.8 డిగ్రీలు, ఓదెలలో 44.6, కమాన్పూర్లో 44.1 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయిలో 45.1 డిగ్రీలు, దండేపల్లి మండలం వెల్గనూరులో 44.7 డిగ్రీలు, చెన్నూర్లో 44.2 డిగ్రీలు, కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగులలో 45.1 డిగ్రీలు, తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో 44.7 డిగ్రీల ఉషోగ్రతలు నమోదు అయ్యాయి.