గోదావరి నది ఉప్పొంగుతుండడంతో వరద హెచ్చరిక జారీ చేసిన అధికారులు!-andhra pradesh govt issues flood alert as godavari swells and rain alert to ap and telangana for coming days ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  గోదావరి నది ఉప్పొంగుతుండడంతో వరద హెచ్చరిక జారీ చేసిన అధికారులు!

గోదావరి నది ఉప్పొంగుతుండడంతో వరద హెచ్చరిక జారీ చేసిన అధికారులు!

Anand Sai HT Telugu

ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి నది వరద ఉధృతి పెరుగుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గోదావరి వెంబడి ఉన్న నివాసితులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

గోదావరి వరద(ఫైల్ ఫొటో)

గోదావరి నది ఒడ్డున నివసించే ప్రజలు వరద నీటి ప్రవాహం పెరుగుతున్నందున జాగ్రత్తగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) సోమవారం కోరింది. ఎగువ ప్రాంతాలలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద పెరుగుతోంది.

ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కూనవరం వద్ద 14.9 మీటర్లు మరియు భద్రాచలం వద్ద 35.6 అడుగులకు నీటి మట్టం పెరగడంతో గోదావరి నది వెంబడి ఉన్న నివాసితులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ హెచ్చరించింది. ధవళేశ్వరం వద్ద ఇన్‌ఫ్లోలు 5.5 లక్షల క్యూసెక్కులకు చేరుకున్నాయి.

సోమవారం ఉదయం, తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం 35.6 అడుగులకు పెరిగి, ఆంధ్రప్రదేశ్‌లోని కూనవరం వద్ద 14.9 మీటర్లకు చేరుకుంది. 'గోదావరిలో వరద నీరు పెరుగుతోంది. భద్రాచలం వద్ద 35.6 అడుగులు, కూనవరంలో 14.9 మీటర్లకు చేరుకుంది.' అని విపత్తు నిర్వహణ అథారిటీ అధికారిక ప్రకటనలో తెలిపింది.

పోలవరం వద్ద గోదావరి నది నీటి మట్టం 10.2 మీటర్లకు పెరిగిందని, ధవళేశ్వరం వద్ద ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 5.5 లక్షల క్యూసెక్కులు నమోదైందని APSDMA తెలిపింది. నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు కృష్ణ, తుంగభద్ర నదుల పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని APSMDA సూచించింది.

ఆంధ్రప్రదేశ్ వర్షాలు

మరోవైపు ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఈరోజు, రేపు పలు చోట్లు వానలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లోను అక్కడక్కడ వర్షాలు పడనున్నాయి.

తెలంగాణ వర్షాలు

తెలంగాణలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉండనుంది. రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలతోపాటుగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయనున్నాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.