YS Jagan : పరిపాలన వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించిన ఏపీ సీఎం జగన్
ప్రాంతాల మధ్య సమతుల్యత, అభివృద్ధి కోసం వికేంద్రీకరణ తప్పదని, సంపద ఒకే ప్రాంతంలో పోగుబడటానికి తాము వ్యతిరేకమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాజధానుల వికేంద్రీకరణ విషయంలో ముందుకు వెళతామని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో స్పష్టం చేశారు.
పరిపాలన వికేంద్రీకరణ తమ ప్రభుత్వ విధానమని, ప్రాంతీయ అభివృద్ధి , అన్ని ప్రాంతాల పటిష్ట బంధానికి వికేంద్రీకరణ అవసరమని గట్టిగా నమ్మి అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. సంపద ఒకే చోట పోగుబడి పోవడానికి తమ ప్రభుత్వ వ్యతిరేకమని పరిపాలనను ప్రజలకు చేరువ చేయడానికి వికేంద్రీకరణ ముఖ్యమని భావిస్తున్నట్లు చెప్పారు.
ట్రెండింగ్ వార్తలు
స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్లలో దేశంలో ఆహార ధాన్యాల కొరత ఉంటే ఇప్పుడు 70లక్షల టన్నుల గొధుమలు, 200లక్షల టన్నుల వరి ధాన్యాన్ని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడాన్ని సీఎం జగన్ ప్రస్తావించారు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో 18శాతం భూమికి నీటి సదుపాయం ఉంటే, ఇప్పుడు 48శాతానికి చేరిందన్నారు. నూటికి 12 శాతం ఉన్న అక్షరాస్యత 77శాతానికి పెరిగిందని, స్మార్ట్ ఫోన్ల వినియోగంలో ప్రపంచంలో రెండో స్థానానికి భారత్ చేరుకుందని జగన్ గుర్తు చేశారు. తొలినాళ్లలో ఒక్కశాతం ఇళ్లకే కరెంటు ఉంటే ఇప్పుడు కరెంటు లేని ఇళ్లు ఒక్క శాతం మాత్రమే ఉన్నాయన్నారు. ప్రపంచ ఫార్మా రంగంలో టాప్ 3దేశాలలో బారత్ ఒకటని, అమెరికాలో వాడే ప్రతి మూడు టాబ్లెట్లో ఒకటని, బ్రిటన్లో వాడే నాలుగు టాబ్లెట్లలో ఒకటి భారత్లోనే తయారవుతోందన్నారు.
సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం….
ఆహారాన్ని పండించే రైతు ఖాళీ కడుపుతో ఉండటం, భవన నిర్మాణ కార్మికులు తరతరాలు గుడిసెల్లో ఉండాల్సి రావడం, ప్రభుత్వ పాఠశాలలు విద్యార్ధులు తెలుగు మీడియంలోనే చదువుకోవాల్సి రావడం, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలపై పెత్తందారుల అకృత్యాలు, వైద్యానికి అన్ని వర్గాల ప్రజలు భారీగా ఖర్చు చేయాల్సిరావడం,36శాతం ఎస్సీలు, 57శాతం ఎస్టీలు నిరక్షరాస్యులుగా ఉండిపోవడాన్ని, జనాభాలో సగం ఉన్న మహిళలకు సగం అవకాశాలు రాకపోవడం, అన్ని కులాలకు సమాన అవకాశాలు లభించక పోవడం, సంపద ఒకే చోట పోగుబడకుండా ఉండేలా తమ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
అధికారం వికేంద్రీకరణలో భాగంగా పరిపాలన వ్యవస్థను ప్రజలకు చేరువ చేశామన్నారు. రాష్ట్రంలో మీడియా స్వార్థ ప్రయోజనాల కోసం వ్యతిరేక ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు. ఇంటి వద్దకే పాలన చేరువ చేయడం కోసమే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెుప్పారు.
గత మూడేళ్ల పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగామని ముఖ్యమంత్రి చెప్పారు. గ్రామానికి అందే పౌర సేవల్లో మార్పులు తెచ్చామని, ఒకటో తేదీ సూర్యోదయానికి ముందే వారికి అవ్వతాతలకు 2.70లక్షల మంది వాలంటీర్లు పెన్షన్లు అందిస్తున్నారని చెప్పారు.
ప్రతి 2వేల మందికి సేవలందించేలా గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశామని, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, డిజిటల్ గ్రంథాలయాలు, ప్రీ ప్రైమరీ స్కూళ్లు, ఫౌండేషన్ స్కూళ్లు అందుబాటులో తీసుకువచ్చామన్నారు. ప్రజల జీవితాల్లో సమగ్ర మార్పులు తీసుకు వచ్చేలా విధానాలు రూపకల్పన చేశామన్నారు.
పరిపాలనలో సమూల మార్పులు తీసుకొచ్చామని, ప్రజల వద్దకే పరిపాలన తీసుకువచ్చినట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. రైతు భరోసా కేంద్రాలను గ్రామ స్థాయిలోనే తీసుకొచ్చి ఉచిత పంటల భీమా ద్వారా ఏ సీజన్లో జరిగే నష్టాన్ని అదే సీజన్లో రైతులకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. రైతు సంక్షేమం కోసం 82వేల కోట్లు చేశామని గుర్తు చేశారు. 75ఏళ్ళ తర్వాత సొంతింటి కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తే ఏకంగా 31లక్షల దరఖాస్తులు వచ్చాయని, కోటి ఇరవై లక్షల మంది సొంత ఇల్లు లేకుండా ఉన్నారని చెప్పారు. 31లక్షల మంది అక్కచెల్లెళ్లకు రూ.2-3లక్షల కోట్ల రుపాయల సంపదను పంచిపెడుతున్నామన్నారు.
పిల్లల చదువులతోనే తలరాతలు మార్చాలనే నిశ్చయంతో కృషిచేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. పెత్తందారీల నడ్డివిరిచేలా ప్రభుత్వ బడులన్నింటిలో ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తున్నామని, అమ్మఒడి ద్వారా దేశంలో ఎక్కడా లేని పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పరు. విద్యా రంగ పథకాల మీద మూడేళ్లలో 53వేల కోట్ల రుపాయలు ఖర్చు చేసినట్లు సిఎం జగన్ చెప్పారు.
టాపిక్