AP MLC Vacancies ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ఐదు స్థానాల గడువు మార్చి 29తో పూర్తి కానుంది. ప్రకాశం - నెల్లూరు - చిత్తూరు జిల్లాలకు చెందిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న యండపల్లి శ్రీనివాసరెడ్డి, కడప-అనంతపురం-కర్నూలు జిల్లాలకు చెందిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల రెడ్డి, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నంకు చెందిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పి.వి.ఎన్.మాధవ్, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, కడప- అనంతపురం - కర్నూలు జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నర్సింహా రెడ్డిల పదవీ కాలం పూర్తి కానుంది.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఖాళీ అవుతున్న స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి నవంబర్ 1తేదీ నాటికి ఓటర్ల జాబితా సిద్దం చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందుకోసం గత అక్టోబర్ 1 నోటిఫికేషన్ జారీ చేసి నవంబర్ 7వ తేదీ వరకు ఓటరు జాబితాలో పేర్లను చేర్చడం కోసం దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. గత నవంబర్ 23న డ్రాఫ్ట్ జాబితాను ప్రకటించారు. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి డిసెంబర్ 30న తుది జాబితా ప్రచురించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాను www.ceoandhra.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ప్రకటించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 22,23 ప్రకారం ఓటర్ల జాబితాను నామినేషన్ల దాఖలు చేసే చివరి తేదీ వరకు అప్డేట్ చేయనున్నారు. ఎన్నికలు జరిగే జిల్లాల్లో నామినేషన్ల దాఖలు చేసే పది రోజుల ముందు వరకు ఓటరు జాబితాలో పేర్లను నమోదు చేసుకోవచ్చని ప్రకటించారు. గ్రాడ్యుయేట్ ఓటర్ల జాబితాలో నమోదు కోసం ఫాం 18, టీచర్ల జాబితాల నమోదు కోసం ఫాం 19 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటర్ల జాబితాలోని పేర్లలో సవరణల కోసం ఫాం 7,8లను సమర్పించవచ్చు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజక వర్గంలో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో 2,43,903మంది ఓటర్లు ఉండగా తుది జాబితాలో మొత్తం 2,83,749మంది ఓటర్లు ఉన్నారు. 50,730 ఓటర్లను కొత్తగా చేరిస్తే, 10,884మందిని తొలగించారు. మూడు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 297 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ప్రకాశం - నెల్లూరు -చిత్తూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజక వర్గంలో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో 3,64,288 మంది ఓటర్లు ఉండగా తుది జాబితాలో మొత్తం 3,83,396 మంది ఓటర్లు ఉన్నారు. 30,866 ఓటర్లను కొత్తగా చేరిస్తే, 11,758 మందిని తొలగించారు. మూడు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 320 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
కడప-అనంతపురం-కర్నూలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజక వర్గంలో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో 2,91,089మంది ఓటర్లు ఉండగా తుది జాబితాలో మొత్తం 3,29,248 మంది ఓటర్లు ఉన్నారు. 46,070 ఓటర్లను కొత్తగా చేరిస్తే, 7911 మందిని తొలగించారు. మూడు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 358 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ప్రకాశం - నెల్లూరు - చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజక వర్గంలో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో 20,914 మంది ఓటర్లు ఉండగా తుది జాబితాలో మొత్తం26,907 మంది ఓటర్లు ఉన్నారు. 6781 ఓటర్లను కొత్తగా చేరిస్తే, 788 మందిని తొలగించారు. మూడు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 175 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
కడప -అనంతపురం - కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజక వర్గంలో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో 22256 మంది ఓటర్లు ఉండగా తుది జాబితాలో మొత్తం 27774 మంది ఓటర్లు ఉన్నారు. 6126 మంది ఓటర్లను కొత్తగా చేరిస్తే, 698 మందిని తొలగించారు. మూడు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 175 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
టాపిక్