September05 Telugu News Updates : కోర్టు తీర్పుపై అప్పీల్కు టీటీడీ
తమిళనాడులోని సేలం వినియోగదారుల కోర్టు తీర్పుపై తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేయాలని నిర్ణయింది. భక్తుడికి అనుకూలంగా సేలం కన్జ్యూమర్ కోర్ట్ తీర్పునివ్వడంతో దానిని సవాలు చేయాలని టీటీడీ నిర్ణయించింది.
Mon, 05 Sep 202205:00 PM IST
ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవాలు
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఏడాది పాటు తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించినట్టుగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి చెప్పారు. పరేడ్ మైదానంలో జరిగే ప్రారంభ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
Mon, 05 Sep 202202:45 PM IST
కోనసీమ కాల్పుల ఘటనపై దర్యాప్తు వేగవంతం
కోనసీమలో జరిగిన కాల్పుల ఘటనలో దుండగులు వదిలిపెట్టిన నాటు బాంబులు, తుపాకీలు, జామర్, మొదలగువాటిని పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. నాటు బాంబులను నీటిలో నానబెట్టి భూమిలో పాతిపెట్టినట్టుగా తెలుస్తోంది. మిగిలిన సామగ్రిపై ఉన్న వేలిముద్రలను తీసుకుని సీజ్ చేశారు పోలీసులు. ఈ ఘటనపైదర్యాప్తు చేస్తున్నారు.
Mon, 05 Sep 202202:09 PM IST
సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన
మంగళవారం ఔటర్ రింగ్ రోడ్డు వెంట సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. ORR వెంట తొలి విడతగా 23 కిలో మీటర్ల మేర 4.5 మీటర్ల వెడల్పుతో సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ నిర్మించనున్నారు.
Mon, 05 Sep 202212:44 PM IST
అగ్నిప్రమాదం.. నలుగురు మృతి
ఉత్తర్ప్రదేశ్లో జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు చనిపోయారు. మరో 10 మంది గాయపడ్డారు. లఖ్నవూలోని హజ్రత్గంజ్ ప్రాంతంలోని లెవానా హోటల్లో తెల్లవారుజామున మంటలు చెలరేగాయని అధికారులు వెల్లడించారు.
Mon, 05 Sep 202211:56 AM IST
రాబోయే మూడు రోజులు వర్షాలు
తెలంగాణలో వచ్చే మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ నెల 7వ తేదీన మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. ఈ కారణంగా రాబోయే 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపింది.
Mon, 05 Sep 202210:47 AM IST
విశ్వాస పరీక్షల్లో నెగ్గిన హేమంత్ సోరెన్
విశ్వాస పరీక్షల్లో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నెగ్గారు. విశ్వాస పరీక్షలో 81 మంది సభ్యులు పాల్గొన్నారు. సోరెన్కు 48 మంది సభ్యులు మద్దతుగా నిలిచారు. విశ్వాస పరీక్ష సమయంలో సభ నుంచి బీజేపీ వాకౌట్ చేసింది.
Mon, 05 Sep 202209:52 AM IST
నిజామాబాద్ కు కేసీఆర్
మరికాసేపట్లో నిజామాబాద్ కు కేసీఆర్ చేరుకోనున్నారు. నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించనున్నారు.
Mon, 05 Sep 202209:33 AM IST
ఆ శక్తి ఉపాధ్యాయులకే ఉంది
సమాజాన్ని గొప్పగా నిర్మించే శక్తి ఉపాధ్యాయులకు ఉందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కరోనా సమయంలో విద్యార్థుల చదువు కోసం ఉపాధ్యాయులు శ్రమించారన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో గురుపూజోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఉత్తమ గురువులను సత్కరించారు.
Mon, 05 Sep 202209:02 AM IST
ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్న బండి సంజయ్
కులాలు, వర్గాలు, ప్రాంతాల పేరుతో విడిపోయిన హిందూ సమాజాన్ని ఏకం చేయటానికే వినాయకుడి నవరాత్రులు నిర్వహించటం జరుగుతుందని బండి సంజయ్ అన్నారు. బీజేపీ జమ్ము కాశ్మీర్ ఇంఛార్జ్ తరుణ్చుగ్తో కలిసి బండి సంజయ్ ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్నారు.
Mon, 05 Sep 202208:56 AM IST
చెన్నుపాటి గాంధీకి, చంద్రబాబు పరామర్శ
వైకాపా అధికారంలోకి వచ్చాక రౌడీమూకలు రెచ్చిపోతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైకాపా నేతల దాడిలో గాయపడిన తెదేపా ఏపీ కార్యదర్శి చెన్నుపాటి గాంధీని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో ఆయన పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘చెన్నుపాటి గాంధీ కన్ను పూర్తిగా దెబ్బతింది. ఎమోషన్లో జరిగిందని పోలీసులు చెబుతారా అని నిలదీశారు. నేరస్థులకు అండగా ఉండటమా పోలీసుల బాధ్యత అన్నారు. గాంధీపైనే కేసులు పెట్టడానికి ప్రయత్నించారని, దోషులెవరినీ వదిలిపెట్టేది లేదన్నారు. దాడులకు భయపడే ప్రసక్తే లేదు. రౌడీయిజాన్ని నమ్ముకున్నవారు ఎవరూ బాగుపడలేదన్నారు. హత్యా రాజకీయాలకు పాల్పడితే ఊరుకునేది లేదు’’ అని చంద్రబాబు హెచ్చరించారు
Mon, 05 Sep 202208:04 AM IST
భీమవరంలో కారు బీభత్సం
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కారు బీభత్సం సృష్టించడంతో ఒకరు మృతిచెందగా, నలుగురికి గాయాలయ్యాయి. కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా, నలుగురికి గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు.
Mon, 05 Sep 202207:59 AM IST
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
జాతీయ దర్యాప్తు సంస్థ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. చైతన్య మహిళా సంఘం హైదరాబాద్ కార్యాలయంతో పాటు హన్మకొండ, కృష్ణాజిల్లాల్లో తనిఖీలు నిర్వహించారు. మావోయిస్టు పార్టీలో చేరికలకు ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలతో సిఎంఎస్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
Mon, 05 Sep 202207:39 AM IST
కాసేపట్లో నిజామాబాద్కు కేసీఆర్
తెలంగాణ సిఎం కేసీఆర్ కాసేపట్లో నిజామాబాద్లో పర్యటించనున్నారు. 2గంటలకు టిఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభిస్తారు. ఆతర్వాత కొత్తగా నిర్మించిన సమీకృత కాలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు టిఆర్ఎస్ క్యాడర్ పెద్ద ఎత్తున తరలి వచ్చింది. నిజామాబాద్ అంతా గులాబీమయం అయ్యింది. కేసీఆర్ పర్యటన సందర్భంగా 2500మంది పోలీసుల్ని మొహరించారు. ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు. విద్యార్ధి సంఘాల నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన తర్వాత కేసీఆర్ పర్యటన, బహిరంగ సభపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Mon, 05 Sep 202206:57 AM IST
గురువులను వేధించడం తగదు
ఉపాధ్యాయ దినోత్సవం శుభవేళ విజ్ఞాన ప్రదాతలైన గురువులకు వినమ్రంగా ప్రణామాలు అర్పిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆనందోత్సాహాలతో జరుపుకోవాల్సిన ఉపాధ్యాయ దినోత్సవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళావిహీనంగా కనిపించే పరిస్థితులు నెలకొనడం బాధ కలిగిస్తోంది. వై.ఎస్.ఆర్.సి.పి. ప్రభుత్వం పెడుతున్న మానసిక క్షోభ, హింసకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఈ వేడుకలు బహిష్కరించాలని తీసుకున్న నిర్ణయం వారు ఎంతగా నలిగిపోతున్నారో తెలుపుతోందన్నారు. జ్ఞానాన్ని పంచే గురువులను వేధించిన వారందరు చరిత్రహీనులుగా మిగిలిపోయారని గత అనుభవాలు తేటతెల్లం చేస్తున్నాయని, వేధింపులతో పాలిస్తున్న ఈ కబోది ప్రభుత్వానికి ఉపాధ్యాయులు కళ్ళు తెరిపించవలసిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నట్లు చెప్పారు.
Mon, 05 Sep 202206:27 AM IST
మూడేళ్లలలో విద్యారంగంపై 53వేల కోట్ల ఖర్చు
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ విద్యా వ్యవస్థను కాపాడుకోడానికి ఉపాధ్యాయులంతా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. విద్యా రంగ అభివృద్ధి, సంక్షేమం గురించి ఏ మాత్రం పట్టించుకోని పార్టీలు ఉపాధ్యాయుల్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. విజయవాడలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో సిఎం పాల్గొన్నారు. విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలు విజయవంతం అవ్వాలంటే అంతా పెద్దమనసు చేసుకుని సహకరించాలని సిఎం కోరారు. విద్యా రంగంలో సంస్కరణల కోసం రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, విద్యా విధానంలో నూతన సంస్కరణలు, శిక్షణలు ఇస్తున్నామని చెప్పారు. మూడేళ్లలో విద్యారంగ కార్యక్రమాల కోసం రూ.53వేల కోట్ల రుపాయలను ఖర్చు చేసినట్లు చెప్పారు.
Mon, 05 Sep 202205:39 AM IST
సత్తెనపల్లిలో ఎవరి దారి వారిదే…
పల్నాడు జిల్లా సత్తెనపల్లి టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. అందరూ కలిసికట్టుగా ముందుకు సాగలన్న అధిష్టానం సూచనను నేతలు పట్టించుకోవట్లేదు. హైకమాండ్ ఆదేశాలను పట్టించుకోకుండా నేతలు వర్గాల వారీగా అన్నక్యాంటీన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆదివారం తెలుగు యువత నాయకుడు మల్లి ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో అన్నక్యాంటీన్ ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Mon, 05 Sep 202205:33 AM IST
అనంతపురంలో ఉద్రిక్తత
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామంలో ఘర్షణ జరిగింది. గణేశ్ నిమజ్జనం సందర్భంగా నిన్న ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. నేటి ఉదయం మళ్లీ ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగడంతో పలువురికి గాయాలు అయ్యాయి.
Mon, 05 Sep 202205:25 AM IST
ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి చంద్రబాబు
మధ్యాహ్నం 12 గంటలకు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి చంద్రబాబు వెళ్లనున్నారు. ఏపీ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీని పరామర్శించనున్నారు. వైసీపీ నేతల దాడిలో గాయపడిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీని చంద్రబాబు పరామర్శిస్తారు. కంటి గాయంతో ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో చెన్నుపాటి గాంధీ చికిత్స పొందుతున్నారు.
Mon, 05 Sep 202204:20 AM IST
కాల్పుల కలకలం....
కోనసీమ జిల్లా రావులపాలెంలో ఆదివారం అర్ధరాత్రి కాల్పుల కలకం చోటు చేసుకుంది. ఫైనాన్స్ వ్యాపారి సత్యనారాయణ రెడ్డిపై ఇద్దరు దుండగులు దాడి చేశారు. దాడిని ఆయన కుమారుడు ఆదిత్యరెడ్డి అడ్డుకున్నారు. పెనుగులాటలో తుపాకీ జారి కింద పడిపోయింది. బాధితుల కేకలతో స్థానికులు రావడంతో దుండగులు పరారయ్యారు. దుండగుల చేతి సంచి అక్కడే పడిపోయింది. అందులో నాటుబాంబులు, జామర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Mon, 05 Sep 202204:10 AM IST
టీడీపీ నిరుద్యోగ రణయాత్ర
నేటి నుంచి టీడీపీ ఆధ్వర్యంలో "నిరుద్యోగ రణం" యాత్ర చేపడుతున్నారు. నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ యాత్ర నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు తెలుగు యువత ఆధ్వర్యంలో యాత్ర నిర్వహిస్తారు. నేటి నుంచి ఈనెల 29 వరకు 'నిరుద్యోగ రణం' యాత్ర జరుగనుంది.
Mon, 05 Sep 202204:10 AM IST
ఉపాధ్యాయులకు అందని వేతనాలు
ఏపీలో ఉపాధ్యాయులకు గురుపూజోత్సవం రోజు కూడా ఉపాధ్యాయులకు జీతాలు అందలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 40 శాతం మంది ఉపాధ్యాయులకు జీతాలు అందలేదని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. వెయ్యి కోట్ల మేర జీతాల బకాయిలు ఉన్నట్లు చెబుతున్నారు. రిజర్వ్ బ్యాంకు దగ్గర వెయ్యి కోట్లకు సెక్యూరిటీ బాండ్ల వేలానికి ఇండెక్స్ పెట్టిన ఏపీ ప్రభుత్వం, ఆ సొమ్ములు అందితే ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలని భావిస్తోంది.
Mon, 05 Sep 202204:10 AM IST
ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు
జీతాలు తెల్లించకపోవడే, గురువులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గౌరవమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. సమస్యలను ప్రస్తావిస్తే వేధింపులకు గురిచేస్తారని, సీపీఎస్ రద్దు అడగకూడదని, పోస్టుల భర్తీ అడగకూడదని, విలీనం పేరిట విద్యను పిల్లలకు దూరం చేస్తుంటే మాట్లాడకూడదని, బోధనేతర పనులతో ఒత్తిడి తెచ్చినా నోరెత్తకూడదని ప్రశ్నించారు. విద్యను అందించే గురువులపై గౌరవంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు.
Mon, 05 Sep 202204:10 AM IST
విజయవాడలో టీచర్స్ డే
విజయవాడలో గురుపూజోత్సవం నిర్వహిస్తున్నారు. ఉత్తమ ఉపాధ్యాయులను ముఖ్యమంత్రి సత్కరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గురుపూజోత్సవం నిర్వహిస్ణతారు. సీఎం చేతుల మీదుగా 176 మంది ఉపాధ్యాయులకు సన్మానం చేస్తారు. ఉదయం 10 గంటలకు విజయవాడ ఎ-కన్వెషన్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పాఠశాల విద్యాశాఖ నుంచి 58 మంది ఉపాధ్యాయులకు పురస్కారాలు అందిస్తారు. ఇంటర్ విద్య నుంచి 19 మంది అధ్యాపకులకు పురస్కారాలు , ఉన్నత విద్య నుంచి 60 మంది అధ్యాపకులకు పురస్కారాలు అందిస్తారు. భాషా, సాంస్కృతిక శాఖ నుంచి ఐదుగురికి, కేజీబీవీల నుంచి ముగ్గురు ఉపాధ్యాయులకు, 26 పాఠశాలలకు స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలు ప్రదానం చేస్తారు. జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఐదుగురిని ఎంపిక చేశారు.