ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. రూ.65 వేల కోట్లతో చేపట్టనున్న అమరావతి రాజధాని ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు.అమరావతి నిర్మాణానికి తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు.
కశ్మీర్ లోని పహల్గామ్ లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ దాడిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఎస్ మధుసూదన్ రావు, రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి జేఎస్ చంద్రమౌళి మృతి చెందారు. ప్రధానితో భేటీ సందర్భంగా ఉగ్రవాదంపై పోరులో కేంద్రానికి తమ రాష్ట్రం నుంచి మద్దతు ఉంటుందని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
“పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కలచివేసింది. ఇలాంటి పిరికిపంద హింసకు ఎంత ఖండన చేసినా సరిపోదు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అండగా నిలుస్తున్నారు. భారత భద్రతను పరిరక్షించడంలో ప్రధాని మోదీ నిర్ణయాత్మక నాయకత్వానికి మా పూర్తి మద్దతు ఉంటుందని ప్రతిజ్ఞ చేస్తున్నాం” అని సీఎం చంద్రబాబు తన పోస్టులో పేర్కొన్నారు.
2024లో జరిగిన ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి… ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నగర ప్రాజెక్టును పునరుద్ధరించింది. 2019 నుంచి 2024 వరకు ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది. తిరిగి ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే… రాజధాని పనులపై సమీక్షించి… కీలక నిర్ణయాలను తీసుకుంది. వెనువెంటనే చెట్లను తొలగించి…. నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది.
2024 నాటికి అమరావతి అభివృద్ధి పనులకు అంచనా బడ్జెట్ సుమారు రూ.64,910 కోట్లు కాగా…. వచ్చే మూడేళ్లలో ఫేజ్-1 పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ పనుల కోసం రూ.15,000 కోట్ల ఆర్థిక సాయం అందింది.
ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా ఏపీకి సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.