విశాఖ డబుల్ మర్డర్‌ కేసులో ఊహించని ట్విస్ట్.. యోగేంద్రబాబు మృతదేహంపై 10కి పైగా కత్తిపోట్లు!-an unexpected twist in the double murder case in visakhapatnam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  విశాఖ డబుల్ మర్డర్‌ కేసులో ఊహించని ట్విస్ట్.. యోగేంద్రబాబు మృతదేహంపై 10కి పైగా కత్తిపోట్లు!

విశాఖ డబుల్ మర్డర్‌ కేసులో ఊహించని ట్విస్ట్.. యోగేంద్రబాబు మృతదేహంపై 10కి పైగా కత్తిపోట్లు!

విశాఖలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. రాజీవ్ నగర్‌లో జరిగిన హత్యను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో చోరీకి వచ్చిన దుండగులు చంపేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావించారు. కానీ.. ఇంట్లో నగలు చోరీ కాలేదని పోలీసులు స్పష్టం చేశారు.

విశాఖ డబుల్ మర్డర్ కేసు (pixabay)

విశాఖపట్నంలోని దువ్వాడ డబుల్ మర్డర్‌ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మృతుడు యోగేంద్రబాబు మృతదేహంపై 10కి పైగా కత్తిపోట్లు ఉన్నట్టు తెలుస్తోంది. అటు యోగేంద్రబాబు భార్యపైనా విచక్షణారహితంగా దాడి జరిగిందని పోలీసులు గుర్తించారు. ఇంట్లో నగలు చోరీ కాలేదని సీపీ శంకబ్రత బాగ్చి స్పష్టం చేశారు. తెలిసినవారే హత్యచేసి ఉంటారని భావిస్తున్నట్టు వెల్లడించారు.

ఏం జరిగింది..

విశాఖ నగరం గాజువాక సమీపంలోని రాజీవ్‌నగర్‌లో భార్యాభర్తలు దారుణహత్యకు గురయ్యారు. డాక్‌యార్డులో పనిచేసి రిటైరైన గంపాల యోగేంద్రబాబు (66), లక్ష్మి (58) దంపతులను గుర్తుతెలియని దుండగులు హత్యచేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యోగేంద్రబాబు, లక్ష్మి 35 ఏళ్లుగా రాజీవ్‌నగర్‌లో ఉంటున్నారు. రెండు రోజుల కిందట హైదరాబాద్‌ వెళ్లిన వారు గురువారం ఉదయం ఇంటికి వచ్చారు.

రెండు వైపులా తాళం..

శుక్రవారం రాత్రి వరకు వారి ఇంటి తలుపులు తెరవలేదు. ఫోన్‌ చేసినా స్పందించలేదు. దీంతో స్థానికంగా ఉన్న బంధువుల అమ్మాయి ఇంటికి వచ్చి చూసింది. ఇంటికి రెండువైపులా తాళం వేసి ఉండటాన్ని గమనించింది. ఆమెకు అనుమానం రావడంతో.. స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.

హాల్లో.. కిచెన్‌లో..

విశాఖ సౌత్‌ ఏసీపీ టి.త్రినాథ్, దువ్వాడ సీఐ మల్లేశ్వరరావు అక్కడికి చేరుకుని ఇంటి తాళాలు పగలగొట్టి తలుపులు తెరిచారు. లోపలికి వెళ్లి చూసేసరికి హాల్లో యోగేంద్రబాబు, బెడ్‌రూమ్‌లో లక్ష్మి రక్తపుమడుగులో పడి ఉన్నారు. ఈ ఇద్దరు అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. యోగేంద్రబాబుది కృష్ణా జిల్లా మచిలీపట్నం. లక్ష్మిది శ్రీహరిపురం. 40 ఏళ్ల కిందట వీరు కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారికి పెళ్లిళ్లు అయ్యాయి. అమెరికాలో స్థిరపడ్డారు.

దొంగల పని కాదు..!

అయితే.. మొదట చోరీ కోసం వచ్చిన దుండగులు హత్యచేసి ఉంటారని పోలీసులు భావించారు. కానీ.. తాజాగా కత్తిపోట్లు కనిపించడం, లక్ష్మిపై దాడి జరిగినట్టు గుర్తించారు. దీంతో ఇది దొంగల పని కాదు.. తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితులను పట్టుకోవడానికి క్లూస్‌ టీమ్‌ను రంగంలోకి దిగి వివరాలు సేకరించారు.

సంబంధిత కథనం