మరోసారి మోదీ చేతుల మీదుగా అమరావతి.. ఈ సారైనా ఆంధ్రప్రదేశ్‌ కోరుకుంటోన్న భరోసా దక్కేనా? ఏపీ ప్రజలు కోరుకుంటోంది ఇదే..-amaravati once again through modis hands will andhra pradesh get the assurance it seeks this time ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  మరోసారి మోదీ చేతుల మీదుగా అమరావతి.. ఈ సారైనా ఆంధ్రప్రదేశ్‌ కోరుకుంటోన్న భరోసా దక్కేనా? ఏపీ ప్రజలు కోరుకుంటోంది ఇదే..

మరోసారి మోదీ చేతుల మీదుగా అమరావతి.. ఈ సారైనా ఆంధ్రప్రదేశ్‌ కోరుకుంటోన్న భరోసా దక్కేనా? ఏపీ ప్రజలు కోరుకుంటోంది ఇదే..

Sarath Chandra.B HT Telugu

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావొస్తుంది. మే 2వ తేదీన అమరావతి నిర్మాణ పనుల పున: ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారు. రాష్ట్ర విభజనకు పదకొండేళ్లు, అమరావతి శంకుస్థాపనకు పదేళ్లు పూర్తవుతున్నాయి. ఈ క్రమంలో మోదీ రాకపై ఏపీ ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు.

మోదీ రాకతో అమరావతికి భరోసా దక్కుతుందా?

ప్రధాని నరేంద్ర మోదీ మే 2వ తేదీన అమరావతి వస్తున్నారు. పదేళ్ల క్రితం అమరావతి నిర్మాణానికి ఎన్డీఏ సారధిగా శంకుస్థాపన చేసిన మోదీ, రాజధాని నిర్మాణ పనుల పున: ప్రారంభాన్ని కూడా ప్రారంభించనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి రాజధాని గడువు కూడాఏడాది క్రితమే ముగిసిపోయింది.

రాజధాని లేని రాష్ట్రంగా…

  • 2019లో అమరావతి నిర్మాణం నిలిపి వేయడం, ఇసుక తవ్వకాలపై నిషేధం, ఆంక్షలతో ఏపీలో రియల్‌ ఎస్టేట్ కుదేలైంది. ఆ ప్రభావం ఆరేళ్ల తర్వాత కూడా కొనసాగుతోంది. రాజధానిపై స్ప‎ష్టత లేకపోవడం, రాష్ట్ర విభజన తర్వాత పదకొండేళ్లు గడుస్తున్నా ఏపీ రాజధాని నగరాన్ని నిర్మించుకోలేని దుస్థితి.. మిగిలిన రంగాలపై చూపిస్తోంది.
  • 2014 డిసెంబర్‌లో అమరావతి ప్రకటన వెలువడింది. మూడు నాలుగు నెలల కనిష్ట వ్యవధిలోనే వేల ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛంధంగా రాజధాని నిర్మాణానికి ఇచ్చారు. రైతులు ఇచ్చిన ప్రతి ఎకరా భూమికి వారి వాటా భూమిని ఇస్తామనే హామీతో అమరావతి నిర్మాణం మొదలైంది. ఎన్నో అనుమానాలు, సందేహాలతో మొదలైన రాజధాని నిర్మాణానికి 29 గ్రామాల రైతులు ఆర్నెల్ల కాలంలో 33వేల ఎకరాలను అప్పగించారు.
  • 2015 విజయదశమి సందర్భంగా ప్రధాని మోదీ అమరావతి శంకుస్థాపన చేశారు. పుణ్య నదుల తీరాల నుంచి సేకరించిన మట్టి, పుణ్య జలాలతో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2015 నుంచి 19 మధ్య కాలంలో దాదాపు రూ.10వేల కోట్లతో అమరావతి పనులు చేపట్టారు.
  • 2016 ద్వితీయార్థానికి వెలగపూడిలో సచివాలయం అందుబాటులోకి వచ్చింది. 2018 నాటికి హైకోర్టు నిర్మాణం మొదలైంది. 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవడంతో అమరావతి నిర్మాణ పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి.
  • రాజధానిలో భాగంగా నవ నగరాలకు ప్రణాళికలు ఖరారు చేసి టెండర్లు పిలిచారు. సచివాలయం, హైకోర్టు భవనాల నిర్మాణ పనులు మొదలయ్యాయి. 2019 మే నాటికి అమరావతిలో ఆలిండియా సర్వీస్ అధికారులకు క్వార్టర్లు, ప్రజా ప్రతినిధుల క్వార్టర్లు, హైకోర్టు న్యాయమూర్తుల నివాసాలు, గ్రూప్‌ 1, 2, 3 ఉద్యోగులకు నివాస సముదాయాల నిర్మాణం చేపట్టారు. నిర్మాణాలు కొలిక్కి వచ్చే దశలో రాజధాని పనులు నిలిచిపోయాయి.
  • సరిగ్గా పదేళ్ల తర్వాత ప్రధాని మోదీ అమరావతిలో రెండోసారి నిర్మాణ పనులను పున: ప్రారంభిస్తున్నారు. మోదీ రాక కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 5లక్షల మందితో బహిరంగ సభ నిర్వహణకు ఏపీ సర్కారు ఏర్పాట్లు చేస్తోంది.
  • అమరావతిలో రాజధాని పనులు నిలిచిపోవడంతో దాని ప్రభావం గుంటూరు, విజయవాడలపై తీవ్రంగా పడింది. విజయవాడ నగరానికి సమీపంలో నదికి అవతలి వైపు రాజధాని నిర్మాణంతో విజయవాడ పరిసరాల్లో రియల్ ఎస్టేట్‌ మార్కెట్‌ జోరు మీద ఉండేది.ఓ దశలో విజయవాడలోని పలు ప్రాంతాల్లో గజం భూమి రూ.లక్ష పైచిలుకు ధర పలికేది.
  • మోదీ రాకతోనైనా స్తబ్ధత వీడేనా
  • రాజధానిని విశాఖపట్నం తరలిస్తున్నారనే ప్రకటనతో విజయవాడ, గుంటూరు మధ్య భూముల ధరలు పడిపోయాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అందులో మార్పు రాలేదు. ఓ వైపు హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్, పెట్టుబడులు పరుగులు తీస్తోంటే ఏపీ మాత్రం వెనుకబడి పోతోంది.
  • ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ-టీడీపీ-జనసేనలతో కూడిన కూటమి ప్రభుత్వం ఏర్పాటైనా రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో స్తబ్ధత వీడలేదు. దీనికి ప్రధాన కారణం రాజకీయ భయాందోళనలు పెట్టుబడిదారుల్ని భయపెడుతున్నాయి.
  • రాజధాని విషయంలో టీడీపీ-వైసీపీల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో భవిష్యత్తులో ఎన్నికల్లో గెలుపొటములతో సంబంధం లేకుండా భరోసాను పెట్టుబడిదారులు కోరుకుంటున్నారు.
  • అమరావతి కలను శాశ్వతం చేస్తారా?
  • అమరావతి శాశ్వతమని అన్ని పార్టీలు చెబుతున్నా... ఓ సాధికారిక ప్రకటన, భరోసాలను ప్రధాని మోదీ నుంచి ఏపీ ప్రజానీకం కోరుకుంటోంది. అధికారంలో ఏ పార్టీ ఉన్నా అమరావతి నిర్మాణాన్ని కొనసాగించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందనే స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వాలు మారినపుడల్లా రాజధాని మార్చుకుంటామనే ధోరణికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.
  • అమరావతి నిర్మాణం, రాజధాని భవిష్యత్తుపై ప్రధాని ఇచ్చే స్పష్టతపైనే ఏపీ రియల్‌ ఎస్టేట్ మార్కెట్‌ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఓ భరోసా లభిస్తుంది.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం