Sajjala on YS Sharmila : వైఎస్ఆర్ ఆశయాలు, ఆలోచనలపై వైసీపీదే పేటెంట్- షర్మిలను చూస్తే జాలేస్తుందని సజ్జల కౌంటర్-amaravati news in telugu ysrcp leaders sajjala counter comments on ys sharmila congress ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sajjala On Ys Sharmila : వైఎస్ఆర్ ఆశయాలు, ఆలోచనలపై వైసీపీదే పేటెంట్- షర్మిలను చూస్తే జాలేస్తుందని సజ్జల కౌంటర్

Sajjala on YS Sharmila : వైఎస్ఆర్ ఆశయాలు, ఆలోచనలపై వైసీపీదే పేటెంట్- షర్మిలను చూస్తే జాలేస్తుందని సజ్జల కౌంటర్

Sajjala on YS Sharmila : వైఎస్ షర్మిల మాట్లాడిన భాష, చేసిన హడావుడి చూస్తుంటే జాలి కలుగుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్ ఆశయాలు, ఆలోచనలపై వైసీపీదే పేటెంట్ అన్నారు.

షర్మిలకు సజ్జల కౌంటర్

Sajjala on YS Sharmila : వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో షర్మిల ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రేమించే వాళ్లు రాజశేఖర్ రెడ్డి బిడ్డ అయినే షర్మిలతో చేతులు కలపాలని పిలుపునిచ్చారు. షర్మిల విమర్శలకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి కౌంటర్ ఇచ్చారు. షర్మిల మాట్లాడిన భాష, చేసిన హడావుడి చూశాక జాలి కలుగుతోందన్నారు. తెలంగాణలో షర్మిల ఏం చేశారు, ఇప్పుడు ఏపీకి ఎందుకువచ్చారని ప్రశ్నించారు.

షర్మిలను చూస్తే జాలి కలుగుతుంది

వైఎస్ఆర్ ఆశయాలు, ఆలోచనలపై వైసీపీ పూర్తిగా పేటెంట్ కలిగి ఉందన్నారు. సీఎం జగన్ వైఎస్ఆర్ తనయుడిగా మాత్రమే కాకుండా, వైఎస్ఆర్ రాజకీయ వారసుడిగా నిరంతరం ప్రజలతో మమేకం కావడం, ఆశయాలకు కట్టుబడడం, నిబద్ధతతో పనిచేస్తున్నారన్నారు. పేదలు, దళితులు, మైనార్టీలు, అన్ని వర్గాలు సీఎం జగన్ ను అక్కునచేర్చుకున్నారన్నారు. షర్మిల వ్యాఖ్యలు చూస్తుంటే ఒకరకంగా జాలికలుగుతుందన్నారు. హఠాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడినట్లు తెలంగాణ నుంచి ఇక్కడకు రావడం, హడావుడి చేయడం తప్ప ఇంకేంలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకు పూర్తి తెలియదని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంతగా వేధించిందో అందరికీ తెలిసిందన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేయడంతో పాటు వైఎస్ఆర్ కుటుంబానికి ద్రోహం చేసిందన్నారు. కేంద్రంలో రెండు సార్లు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి వైఎస్ఆర్ కృషి ఎంతో ఉందన్నారు. ఈ విషయాన్ని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా చెప్పారన్నారు. కానీ వైఎస్ఆర్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ ఏ చేసిందో అందరికీ తెలుసన్నారు.

నోటా కంటే కాంగ్రెస్ తక్కువ ఓట్లు

ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగైందని సజ్జల ఎద్దేవా చేశారు. టీడీపీ వెంటిలేటర్‌పై ఉందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నోటా కంటే కాంగ్రెస్ కు తక్కువ ఓట్లు వచ్చాయన్నారు. అప్పట్లో చంద్రబాబుతో కుమ్మకై కాంగ్రెస్‌ ఏపీకి అన్యాయం చేసిందని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై వైసీపీ పోరాటం చేస్తుందన్నారు. ప్రత్యేక హోదాపై ఆనాడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు చర్చించలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం జగన్ ఎప్పుడూ రాజీపడరన్నారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటూ సీఎం జగన్‌ రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్ బిడ్డగా, సీఎం జగన్‌ చెల్లెలుగా షర్మిలను అభిమానిస్తామంటూ సజ్జల అన్నారు.

షర్మిల విమర్శలు

ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన రోజే షర్మిల వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సీఎం జగన్ పై విమర్శలు చేశారు. బీజేపీకి తొత్తులుగా మారారంటూ ఎద్దేవా చేశారు. స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రత్యేక హోదా కోసం ఒక్క ఉద్యమమైనా చేశారా అంటూ నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు, జగనే కారణం అని వైఎస్ షర్మిల విమర్శించారు. చంద్రబాబు అమరావతి రాజధాని అని 3డీ గ్రాఫిక్స్ చూపించరు, జగన్ మూడు రాజధానులు అన్నారు. ఒకటి కూడా అవ్వలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ 2004లో వైఎస్ఆర్ ప్రారంభించారని, వైఎస్ హయాంలో పోలవరం కుడి, ఎడమ కాల్వల నిర్మాణం పూర్తి చేశారని గుర్తుచేశారు. ఆయన చనిపోయాక ఈ ప్రాజెక్టు ఒక్క అడుగు ముందుకు వెళ్లలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు, జగన్ బీజేపీతో దోస్తీ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారన్నారు. పదేళ్లలో ఏపీలో లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. బీజేపీ రైతులకు ఆదాయం డబుల్ చేస్తామన్నారు, కానీ ఖర్చులు రెట్టింపు అయ్యాయని దుయ్యబట్టారు.

సంబంధిత కథనం