Pawan Kalyan : ఏపీ ప్రభుత్వం గతంలో జగన్ పేరుతో ఉన్న పథకాల పేర్లను మార్పు చేసింది. ఈ పథకాలకు శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, సమాజసేవకుల పేర్లు పెట్టింది. ఈ నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. భావి తరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయం అన్నారు. రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ కు అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలకు ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకొన్నారని గుర్తుచేశారు. ఆ దుస్సంప్రదాయానికి మంగళంపాడి విద్యార్థులలో స్ఫూర్తిని కలిగించే వారి పేర్లతో పథకాలు అమలు చేయడం మంచి పరిణామం అన్నారు.
"పాఠశాల విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక ద్వారా యూనిఫాం, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్స్ లాంటివి ఇస్తున్నారు. ఈ పథకాన్ని డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో అమలు చేయడం సముచితం. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సులర్ గా, భారత తొలి ఉపరాష్ట్రపతిగా, 2వ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం రేపటి పౌరులకు మార్గ నిర్దేశనం చేస్తుంది. మధ్యాహ్న భోజన పథకానికి గత ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకున్నారు. ఇందుకు భిన్నంగా- ‘అపర అన్నపూర్ణ’ డొక్కా సీతమ్మ పేరును ఈ పథకానికి పెట్టడాన్ని ప్రతి ఒక్కరం స్వాగతించాలి. ఏ వేళలో అయినా కడుపు నిండా అన్నంపెట్టి ఆకలి తీర్చిన దానశీలి డొక్కా సీతమ్మ. వారి దయాగుణం, సేవాభావం విద్యార్థులకు తెలియచేయడం ద్వారా ఆ సద్గుణాలు అలవడుతాయి" - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
మిస్సైల్ మ్యాన్ డా.అబ్దుల్ కలాం పేరుతో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం ద్వారా యువతలో నూతనోత్తేజాన్ని కలిగిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. పేద కుటుంబంలో పుట్టిన కలాం ఎన్నో ఆటుపోట్ల నడుమ విద్యాభ్యాసం సాగించి శాస్త్రవేత్తగా ఎన్నో విజయాలు అందుకొన్నారన్నారు. రాష్ట్రపతిగా ఆదర్శవంతంగా బాధ్యతలు నిర్వర్తించారని గుర్తుచేశారు. కలాం జీవన ప్రస్థానం నవతరంలో స్ఫూర్తిని కలిగిస్తుందన్నారు. మహనీయుల పేర్లతో పథకాలు అమలు చేయడం ద్వారా వారి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకొంటారన్నారు. ఆ మహనీయుల దివ్యాశ్సీసులు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఎల్లవేళలా ఉంటాయని ఆకాంక్షించారు.
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ పరిధిలోని పలు పథకాల పేర్లను మార్చింది. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ పేరుతో ఉన్న పథకాలకు జాతీయ నాయకుల పేర్లపై మార్చింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. అయిదేళ్లపాటు గత ప్రభుత్వం విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించిందని లోకేశ్ ఆరోపించారు. విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
సంబంధిత కథనం