CM Chandrababu : మంత్రుల సమర్థత మేరకు శాఖలు, రేపటిలోగా కేటాయింపు- చంద్రబాబు-amaravati cm chandrababu visits tirumala latest assume charge first sign on mega dsc ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Chandrababu : మంత్రుల సమర్థత మేరకు శాఖలు, రేపటిలోగా కేటాయింపు- చంద్రబాబు

CM Chandrababu : మంత్రుల సమర్థత మేరకు శాఖలు, రేపటిలోగా కేటాయింపు- చంద్రబాబు

CM Chandrababu : సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం తిరుమలకు వెళ్లనున్నారు. రేపు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం అమరావతి చేరుకుని బాధ్యతలు చేపట్టనున్నారు. రేపటిలోగా మంత్రులకు శాఖలు కేటాయించనున్నారు.

మెగా డీఎస్సీపైనే సీఎం చంద్రబాబు తొలి సంతకం

CM Chandrababu : సీఎం చంద్రబాబు ఈ రోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లనున్నారు. రేపు ఉదయం శ్రీవారి దర్శనం అనంతరం అమరావతికి తిరిగి రానున్నారు. రేపు సాయంత్రం సచివాలయానికి వెళ్లనున్నారు. గురువారం సాయంత్రం 4.41 గంటలకు ఛాంబర్ లో సీఎం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. ముఖ్యమంత్రిగా సచివాయంలో మొదటి బ్లాక్ లోని ఛాంబర్ లో చంద్రబాబు బాధ్యతలు చేపట్టనున్నారు. బాధ్యతల స్వీకారం అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన పలు కీలక హామీల అమలుపై చంద్రబాబు సంతకాలు చేయనున్నారు.

తొలి సంతకం మెగా డీఎస్సీపై

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేయనున్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం పెట్టనున్నారు. సామాజిక పింఛన్ ను రూ. 4000 వేలకు పెంచుతూ మూడో సంతకం చేయనున్నారు. స్కిల్ సెన్సన్స్ ప్రక్రియ చేపట్టడం, అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై చంద్రబాబు సంతకాలు చేయనున్నారు.

రేపటిలోగా మంత్రులకు శాఖలు

కేబినెట్ మంత్రులతో సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ నాశనం చేసిన వ్యవస్థలను బాగుచేయాలన్నారు. మంత్రుల అభీష్టాలు, సమర్థత మేరకు శాఖలు కేటాయిస్తామన్నారు. రేపటిలోగా మంత్రులకు శాఖలు కేటాయిస్తామన్నారు. కేటాయించిన శాఖకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాల్సిన బాధ్యత మంత్రులపై ఉందన్నారు. అలాగే శాఖల వారీగా శ్వేత పత్రాలు సిద్ధం చేసి ప్రజలకు అన్ని విషయాలు తెలియజేయాలన్నారు.

వాటి పట్ల అప్రమత్తంగా ఉండండి

ఓఎస్డీలు, పీఏలు, పీఎస్‌ల విషయంలో మంత్రులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన వారిని చేర్చుకోవద్దన్నారు. శాఖల వారీగా శ్వేతపత్రాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. గతంలో తాను సీఎంగా ఉన్నప్పటి పరిస్థితి, ప్రస్తుత పరిస్థితిపై చంద్రబాబు విశ్లేషించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మేలు చేయాలని చంద్రబాబు మంత్రులకు సూచించారు.

తిరుమల శ్రీవారి దర్శనానికి చంద్రబాబు

సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ సాయంత్రం తిరుమలకు వెళ్లనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకోనున్నారు. బుధవారం రాత్రి 9.00 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుని, అనంతరం రేణిగుంట నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్తారు. తిరుమలలోని శ్రీ గాయత్రి గెస్ట్‌హౌస్‌లో సీఎం చంద్రబాబు బస చేయనున్నారు. గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలోని శ్రీ భూ వరాహ స్వామి ఆలయాన్ని సైతం సందర్శించుకోనున్నారు.

ఇవాళ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులకు రేపటిలోగా శాఖలు కేటాయించనున్నారు.

సంబంధిత కథనం