CM Chandrababu : వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం, సీడీఐ విచారణకు ఆదేశిస్తామన్న సీఎం చంద్రబాబు
CM Chandrababu : వైసీపీ ప్రభుత్వం మద్యం పాలసీపై సీఐడీతో విచారణ చేయిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. నగదు లావాదేవీలపై ఈడీకి ఫిర్యాదు చేస్తామన్నారు.

CM Chandrababu : మద్య నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్... మద్యంతో వ్యాపారం చేసి కోట్లు వెనకేసుకున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. అసెంబ్లీ మద్యంపై శ్వేత పత్రం విడుదల చేశారు. గత ప్రభుత్వ మద్యం విధానంపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2019-24లో వైసీపీ మద్యం పాలసీపై సీఐడీతో విచారణ చేయిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ఎక్సైజ్ శాఖలో అవినీతి జరిగిందని, వాటిపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజ్ఞప్తి మేరకు సీఎం చంద్రబాబు.. ఈ నిర్ణయం ప్రకటించారు. అంతా నగదు లావాదేవీలు చేశారని, సీఐడీ విచారణలో వాస్తవాలు బయటపడతాయన్నారు. నగదు లావాదేవీలపై ఈడీకి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
మద్యం విధానంలో అక్రమాలు- పవన్ కల్యాణ్
లంచం తీసుకునే అధికారులను కఠినంగా శిక్షించే ప్రభుత్వం...రూ. వేల కోట్లు లూటీ చేసిన వారిని శిక్షించదా అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ మద్యం విధానంలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. తప్పు చేసిన వాళ్లను స్వేచ్ఛగా వదిలేయకూడదని వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. మద్యం విధానం పేరుతో కోట్లు దోపిడీ చేసిన వారికి కఠిన శిక్షలు పడాలని, వాళ్లు తప్పించుకోకూడదని పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబును కోరారు.
పవన్ విజ్ఞప్తిపై స్పందిస్తూ
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజ్ఞిప్తిపై స్పందించి సీఎం చంద్రబాబు..మద్యం విధానంపై సీఐడీ విచారణ జరిపిస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వం ధరలు పెంచుకుంటూ పోతే తాగే వాళ్లు తగ్గుతూ వస్తారని వింత లాజిక్ చెప్పారని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. తీరా ఐదేళ్ల తర్వాత చూస్తే తాగే వాళ్లు 75 శాతం పెరిగారన్నారు. పిచ్చితనం కాకపొతే.. మెదడు ఉన్న వాళ్లు ఎవరూ ఇలాంటి పనులు చేయరన్నారు. గత ఐదేళ్లలో సగటున మద్యం అమ్మకం భారీగా పెరిగిందన్నారు. రేట్లు పెంచితే తాగే వాళ్లు తగ్గుతారని చెప్పి, ఇంకా ఎక్కువ తాగించారన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే బెదిరించి, భయబ్రాంతులు చేసి బ్రాండెడ్ కంపెనీల మద్యం మొత్తం లేకుండా చేశారన్నారు. నాణ్యమైన బ్రాండ్లు పారిపోయేలా చేశారన్నారు. ప్రముఖ కంపెనీల బ్రాండ్స్ నుంచి సప్లై భారీగా తగ్గించి, మొత్తం ఆర్డర్లు అన్నీ వైసీపీ బినామీ కంపెనీలకే ఇచ్చుకున్నారని విమర్శించారు.
బూమ్ బూమ్ బ్రాండ్లు
"గతంలో పేదవాళ్లు తాగే 180 ఎంఎల్ లిక్కర్, 31 మద్యం బ్రాండ్లు, రాష్ట్రంలో లేకుండా చేసి, కేవలం జగనన్న బ్రాండ్స్ మాత్రమే అందుబాటులో ఉండేలా చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే, 20 పాత డిస్టిలరీస్ని లాగేసుకున్నారు. కొత్తగా 20 డిస్టిలరీస్ పేరిట వైసీపీ బినామీలు రంగంలోకి దిగారు. కుదిరితే లీజు, లేదంటే లాక్కోవటం. ఇలా రాష్ట్రంలో ఉన్న లిక్కర్ డిస్టిలరీస్ మొత్తం జగన్ రెడ్డి చేతిలోకి వెళ్లిపోయాయి. మంచి బ్రాండ్ లు అన్నీ పోయాయి.. వింత వింత పేర్లు చెప్పి, బూమ్ బూమ్ లాంటి బ్రాండ్ లు దించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడారు. మద్యం షాపుల్లో ఎక్కడా బిల్లు లేకుండా మొత్తం క్యాష్ తోనే నడిపించారు. డిజిటల్ పేమంట్స్ అమలు చేయలేదు. దీనిపై ఈడీకి ఫిర్యాదు చేస్తాం"- సీఎం చంద్రబాబు
ఎక్సైజ్ శాఖ ప్రక్షాళన
ఇతర ప్రభుత్వ శాఖల్లో డబ్బును ఎక్సైజ్ శాఖలో పెట్టుబడి పెట్టించారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. దీంతో ఆయా శాఖలకు దాదాపు రూ.250 కోట్ల నష్టం వచ్చిందన్నారు. ఎక్సైజ్ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు. పేదలకు అందుబాటు ధరలో మద్యం లభించేలా పాలసీలు తీసుకొస్తామన్నారు. అలాగే డీఅడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. తప్పుచేసిన వాళ్లను కఠినంగా శిక్షిస్తేనే మళ్లీ ఆ తప్పు జరగదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
సంబంధిత కథనం