Amaravati Issue: అమరావతి కేసుల విచారణ డిసెంబర్కు వాయిదా..రాజధాని తరలింపుపై ప్రభావం!
Amaravati Issue: సుప్రీం కోర్టులో రాజధాని అమరావతి కేసుల విచారణ డిసెంబర్కు వాయిదా పడింది. డిసెంబర్లో కేసుల్ని లిస్ట్ చేయాల్సిందిగా ధర్మాసనం ఆదేశించింది. కోర్టు కేసుల్ని పరిష్కరించి విశాఖ తరలి వెళ్లాలన్న ప్రభుత్వ ఆశలపై సుప్రీం నిర్ణయం నీళ్లు చల్లినట్టైంది.
Amaravati Issue: రాజధాని అమరావతిపై సుప్రీం కోర్టులో దాఖలైన కేసుల విచారణ డిసెంబర్కు వాయిదా పడింది. కేసులను ఎప్పటి నుంచి విచారిస్తామనేది డిసెంబర్లో తేదీని నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. ఏపీ ప్రభుత్వంతోపాటు రైతులు, అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు సమాఖ్య తరపున దాఖలు చేసిన పిటిషన్లు సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉన్నాయి.
ట్రెండింగ్ వార్తలు
కోర్టు వివాదాలను పరిష్కరించుకుని విశాఖపట్నం తరలి వెళ్లాలని సిఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి కేసులు కొలిక్కి వస్తాయని భావించారు.తొలుత జులై చివరి నాటికి విశాఖ వెళ్లాలని జగన్ భావించినా, అన్ని సమస్యలు పరిష్కరించుకుని సెప్టెంబర్లో విశాఖలో అడుగు పెట్టాలని భావించారు.
ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై అత్యవసరంగా విచారణ జరపాలంటూ ఏపీ సర్కార్ తరపున కోరిన మాజీ అటార్నీ జనరల్ వేణుగోపాల్ ధర్మాసనానికి విజ్ఞప్తిచేశారు. ఇందుకు సమ్మతించని ధర్మాసనం డిసెంబర్లో కేసు లిస్ట్ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ పరిణామం రాష్ట్ర ప్రభుత్వానికి మింగుడుపడనిదే.
విశాఖపట్నం తరలి వెళ్లిన తర్వాత అక్కడి నుంచి ఎన్నికల సమరశంఖం పూరించాలని భావించిన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. డిసెంబర్కు కేసు వాయిదా పడినా , అదే నెలలో కోర్టుకు సెలవులు కూడా ఉన్నాయి. డిసెంబర్ 15 నుంచి జనవరి 2వరకు కోర్టు వెకేషన్ ఉంటుంది. ఈ నేపథ్యంలో మళ్లీ కోర్టులో పూర్తి స్థాయి విచారణ జరుగుతుందనే నమ్మకం లేదు.
మరోవైపు డిసెంబర్ నాటికి దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైపోతుంది. కోర్టు కేసులతో సమయాన్ని గడిపే అవకాశం పార్టీలకు ఎంతవరకు ఉంటుందనేది కూడా సందేహమే. ఈ నేపథ్యంలో మూడు రాజధానులపై ప్రజాభిప్రాయాన్ని కోరుతూ ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేయాలనే నినాదంతో వైసీపీ, అమరావతి కోసం టీడీపీలు ప్రజల్లోకి వెళ్లి తేల్చుకోవాల్సి రావొచ్చు. 2024 ఎన్నికలకు ప్రధానాంశంగా అమరావతి వ్యవహారంతోనే ప్రధాన పార్టీలు ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.