Pawan Kalyan : తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి పవన్ డుమ్మా? కారణమదేనా?-amaravati ap deputy cm pawan kalyan not attended telugu states cms meeting ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawan Kalyan : తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి పవన్ డుమ్మా? కారణమదేనా?

Pawan Kalyan : తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి పవన్ డుమ్మా? కారణమదేనా?

HT Telugu Desk HT Telugu

Pawan Kalyan : తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై శనివారం హైదరాబాద్ లో సీఎంల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకాకపోవడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది.

తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి పవన్ డుమ్మా? అదే కారణమా?

Pawan Kalyan : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స‌మావేశానికి ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎందుకు హాజ‌రుకాలేద‌నే చ‌ర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, జ‌న‌సేన కార్యక‌ర్తల్లోనూ సాగుతోంది. అస‌లు ఈ స‌మావేశానికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఆహ్వానించారా? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అయితే ఈ స‌మావేశానికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఆహ్వానించిన‌ప్పటికీ ఆయ‌న వెళ్లలేద‌నేది స్పష్టం. అయితే ఎందుకు వెళ్లలేద‌నే చ‌ర్చ స‌ర్వత్రా సాగుతోంది.

రెండు రాష్ట్రాల మ‌ధ్య పెండింగ్‌లో ఉన్న విభజ‌న స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించే దిశ‌గా ఇద్దరం కూర్చోని ఆలోచ‌న‌లు చేద్దామ‌ని సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. అందులో తేదీని కూడా చంద్రబాబు పేర్కొన్నారు. జులై 6న రెండు రాష్ట్రాల స‌మ‌స్యల‌పై చ‌ర్చిద్దామ‌ని పేర్కొన్నారు. దీనికి స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంగీకారం తెలిపారు. అంతేకాకుండా జులై 6న హైద‌రాబాద్‌లోని ప్రజా వేదిక‌లో స‌మావేశం అయ్యి విభ‌జ‌న స‌మ‌స్యల‌పై చ‌ర్చిద్దామ‌ని చంద్రబాబుకు లేఖ పంపించారు. అందులో భాగంగానే శ‌నివారం రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలోని ప‌రిష్కారం కాని స‌మస్యల‌పై చ‌ర్చించేందుకు హైద‌రాబాద్‌లో తెలుగు రాష్ట్రాల‌ ముఖ్యమంత్రులు స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల‌తో పాటు ఉప ముఖ్యమంత్రులు పాల్గొనాల్సి ఉంది. ఆ ర‌కంగానే ఏపీ తెలంగాణ నుంచి హాజ‌ర‌య్యే నేత‌లు, అధికారుల జాబితాను రూపొందించారు. అయితే ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులతో పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఏపీ, తెలంగాణ నుంచి మంత్రులు, అధికారులు హాజ‌ర‌య్యారు. కానీ ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం హాజ‌రుకాలేదు. ఆయ‌న ఎందుకు హాజ‌రుకాలేద‌ని చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో సాగుతోంది.

శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన స‌మావేశంలో తెలంగాణ త‌ర‌పున‌ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్క, మంత్రులు శ్రీ‌ధ‌ర్ బాబు, పొన్నం ప్రభాక‌ర్‌, ప్రభుత్వ స‌ల‌హాదారులు వేం న‌రేంద్రరెడ్డి, హెచ్‌.గోపాల్‌, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి శాంతి కుమారి, ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి (ఫైనాన్స్‌) రామ‌కృష్ణారావు, ముఖ్యమంత్రి కార్యద‌ర్శి వి.శేషాద్రి పాల్గొంటార‌ని, ఆంధ్రప్రదేశ్ త‌ర‌పున ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రులు అనగాని స‌త్యప్రసాద్‌, బీసీ జ‌నార్థన్ రెడ్డి, కందుల దుర్గేష్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, ఆర్థిక కార్యద‌ర్శి ఎం. జాన‌కి, ముఖ్యమంత్రి అద‌న‌పు కార్యద‌ర్శి కార్తికేయ మిశ్రా పాల్గొంటార‌ని జాబితా విడుద‌ల చేశారు. అయితే వీరిలో డిప్యూటీ సీఎం పవ‌న్ క‌ల్యాణ్ త‌ప్ప అంద‌రూ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. అయితే ఈ స‌మావేశానికి పవన్ కల్యాణ్ హాజ‌రుకాక‌పోవ‌డంపై స‌ర్వత్రా చ‌ర్చ జ‌రుగుతుంది. ఆహ్వానించ‌లేదు అనుకోవ‌డానికి లేదు. ఎందుకంటే సమావేశానికి ముందే స‌మావేశంలో పాల్గొనే వారి జాబితా విడుద‌ల చేశారు. అందులో ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరు కూడా ఉంది. అయితే మ‌రెందుకు ప‌వ‌న్ క‌ల్యాణ్ హాజ‌రు కాలేదు? అందుకు రెండు కారణాలు ఉన్నాయంటున్నారు.

ప్రధాన కారణం ప‌వ‌న్ క‌ల్యాణ్ అమ్మవారి వారాహి దీక్ష శ‌నివారం ముగిసింది. 2024 ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌న‌సేన పార్టీ ఘ‌న విజ‌యం సాధిస్తే అమ్మవారి వారాహి దీక్ష చేప‌డ‌తాన‌ని మొక్కుకున్నారు. అందులో భాగంగా జూన్ 25న 11 రోజుల అమ్మవారి వారాహి దీక్ష చేప‌ట్టారు. ఆ దీక్ష స‌మ‌యంలో ద్రవ ఆహార‌మైన పాలు, పండ్లు, మంచినీరు మాత్రమే తీసుకునేవారు. అయితే ఈ దీక్ష శ‌నివారంతో ముగిసింది. అదే రోజు ముఖ్యమంత్రులు స‌మావేశం జ‌రిగింది. అందువ‌ల్లనే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ స‌మావేశానికి హాజ‌రుకాలేద‌ని అంటున్నారు. అయితే ప‌వ‌న్ ముఖ్యమంత్రుల స‌మావేశానికి హాజ‌రుకాక‌పోవ‌డానికి ఇంకో కార‌ణం కూడా ఉంద‌ని చ‌ర్చించుకుంటున్నారు. అది రాజ‌కీయ కార‌ణ‌మ‌ని అంటున్నారు. ఆయ‌న 2014 మార్చి 14న హైద‌రాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతంలోని హైటెక్ సిటీ స‌మీపంలో నోవాటెల్ హోట‌ల్‌లో జ‌న‌సేన పార్టీ పెట్టిన‌ప్పుడు నిర్వహించిన స‌భ‌లో కాంగ్రెస్‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుప‌డ్డారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఈ పార్టీని స్థాపించిన‌ట్లు ప్రక‌టించారు. రెండు గంట‌ల‌కుపైగా చేసిన ప్రసంగంలో కాంగ్రెస్‌పై విమ‌ర్శలకే అధిక భాగాన్ని ఉప‌యోగించారు.

"కాంగ్రెస్ హ‌ఠావో దేశ్ బ‌చావో" అంటూ నిన‌దించారు. అప్పటి నుంచి కాంగ్రెస్ త‌న వ్యతిరేక‌త‌ను అలానే కొన‌సాగిస్తూ వ‌చ్చారు. అయితే రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత జ‌రిగిన‌ 2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఏపీలో చిత్తుగా ఓడిపోయింది. తెలంగాణ‌లో కొన్ని సీట్లు సంపాదించింది. అయితే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు కాంగ్రెస్ ప‌ట్ల వ్యతిరేకత మాత్రం పోలేదు. ఇటీవ‌లి 2023 డిసెంబ‌ర్‌లో జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీతో క‌లిసి జ‌న‌సేన పోటీ చేసింది. అయితే జ‌న‌సేన పోటీ చేసిన ఎనిమిది స్థానాల్లోనూ ఆ పార్టీకి డిపాజిట్లు రాలేదు. అయితే కేవ‌లం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే ఆయ‌న పోటీ చేయించారు.

అయితే ఇప్పుడు తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తాను పార్టీ పెట్టినప్పటి నుంచి తీవ్రంగా వ్యతిరేకించే పార్టీ అక్కడ ఉండ‌టంతో ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు స‌మావేశానికి వెళ్లడానికి ఇష్టం లేద‌ని, అందువ‌ల్లనే ఆయ‌న స‌మావేశానికి హాజ‌రు కాలేద‌ని చ‌ర్చలు జ‌రుగుతున్నాయి. అయితే ఏది ఏమైనా, పార్టీలు ఏవైనా, ప్రభుత్వాల మ‌ధ్య చ‌ర్చలు జ‌రిగిన‌ప్పుడు కీల‌క‌మైన బాధ్యత‌ల్లో ఉండే వ్యక్తులు ఆ చ‌ర్చల్లో పాల్గొంటే బాగుంటుంది. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటే, అక్కడ జ‌రిగిన చ‌ర్చ‌ల్లో భాగ‌స్వామ్యం అయి ఉంటే బాగుండేద‌ని చాలా మంది అభిప్రాయ ప‌డుతున్నారు.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

సంబంధిత కథనం