ఏపీ దారుణం హత్య జరిగింది. ఆలూరు కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ లక్ష్మీ నారాయణను దుండగులు లారీతో ఢీకొట్టి, వేటకొడవళ్లతో నరికి చంపారు. అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే వంతెన సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో లక్ష్మీ నారాయణ కుమారుడు వినోద్కు తీవ్ర గాయాలయ్యాయి.
కాంగ్రెస్ పార్టీ ఆలూరు నియోజకవర్గం ఇన్ ఛార్జ్ లక్ష్మీనారాయణ దారుణ హత్యకు గురయ్యారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ శివారులోని ఆలూరు రోడ్డు చిప్పగిరి రైల్వే బ్రిడ్జి వద్ద దుండగులు ఆయనపై దాడి చేశారు. గుంతకల్లు నుండి చిప్పగిరికి ఇన్నోవా వాహనంలో వెళ్తున్న లక్ష్మీనారాయణను టిప్పర్తో ఢీకొట్టారు. దీంతో కారులో చిక్కుకున్న లక్ష్మీనారాయణపై కొడవళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
ఈ దాడిలో తీవ్రగాయాలపాలైన లక్ష్మీనారాయణ ఆసుపత్రికి తరలించే క్రమంలోనే ప్రాణాలు విడిచారు. లక్ష్మీనారాయణపై అత్యంత దారుణంగా దాడి చేసి హత్య చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన మరువక ముందే మరో రాజకీయ నేత హత్యకు గురికావడం కలకలం రేపుతోంది.
"కాంగ్రెస్ పార్టీ నేత ఆలూరు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ చిప్పగిరి లక్ష్మీ నారాయణ దారుణమైన హత్య ఘటనను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కులను తొక్కే ఈ ఘటన రాష్ట్రంలోని శాంతి భద్రతలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
దుండగుల అరాచకాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. చిప్పగిరి నారాయణ కుటుంబానికి మద్దతుగా నిలుస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతుంది." -కాంగ్రెస్ పార్టీ
"ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. లారితో ఢీ కొట్టి, వేట కొడవళ్ళతో నరికి చంపడం అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం అవుతుంది.
ఈ ఘటనపై పోలీసు శాఖ అత్యున్నత విచారణ జరిపించాలి. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలి. లక్ష్మీ నారాయణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్న. కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుంది"-ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
సంబంధిత కథనం