AP Inter Exams 2025: ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌.. ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్ష తేదీల ఖరారు.. ముగిసిన ఫీజు చెల్లింపు గడువు-alert for ap inter students inter public exam dates finalized fee payment deadline has passed ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Inter Exams 2025: ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌.. ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్ష తేదీల ఖరారు.. ముగిసిన ఫీజు చెల్లింపు గడువు

AP Inter Exams 2025: ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌.. ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్ష తేదీల ఖరారు.. ముగిసిన ఫీజు చెల్లింపు గడువు

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 06, 2024 08:29 AM IST

AP Inter Exams 2025: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ విద్యార్ధుల వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. 2025 పబ్లిక్ పరీక్షల్ని మార్చి 1 నుంచి నిర్వహించాలని భావిస్తోంది. ఈ మేరకు పరీక్షల నిర్వహణ తేదీలను రాష్ట్ర ప్రభుత్వ అమోదానికి పంపారు. ప్రభుత్వ అమోదం లభించిన వెంటనే తేదీలను అధికారికంగా ప్రకటిస్తారు.

ఏపీ ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్
ఏపీ ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్

AP Inter Exams :ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ 2025 పబ్లిక్ పరీక్ష తేదీలను ప్రాథమికంగా ఖరారు చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కోసం ప్రతిపాదిత షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వ అమోదం కోసం ఇంటర్ బోర్డు పంపింది. ప్రభుత్వ అమోదం లభిస్తే 2025 మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఎన్విరాన్‌మెంట్‌ సైన్స్‌, మోరల్ వాల్యూస్‌ పరీక్షల్ని ఫిబ్రవరి 1, 3వ తేదీల్లో నిర్వహిస్తారు. ఫిబ్రవరి 10 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు.

yearly horoscope entry point

ముగిసిన పరీక్ష ఫీజు గడువు…

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫీజుల చెల్లింపు గడువు ముగిసింది. ఫీజుల చెల్లింపు షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు గత నెలలో విడుదల చేసింది. నవంబర్‌ 21తో ఫీజుల చెల్లింపు గడువు ముగిసింది. ఇంటర్‌ మొదటి, ద్వితియ సంవత్సరం జనరల్, ఒకేషనల్ విద్యార్థులతో పాటు సప్లమెంటరీ విద్యార్థులు ఫీజులు చెల్లింపు తేదీలను ఖరారు చేశారు. హాజరు మినహాయింపు పొందిన అభ్యర్థులు కూడా వార్షిక పరీక్ష ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. వెయ్యి రుపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 5వ తేదీ వరకు పరీక్ష ఫీజులు చెల్లించడానికి అనుమతించారు. .

ఇంటర్ మొదటి, ద్వితియ సంవత్సరం వార్షిక ఫీజులతో పాటు గతంలో పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులు, ప్రైవేట్‌గా పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు వార్షిక పరీక్ష ఫీజులు చెల్లించాలని ఇంటర్ బోర్డు సూచించింది.

ఇంటర్మీడియట్ 2025 పరీక్ష ఫీజుల షెడ్యూల్ ఇలా...

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ 2025 మార్చి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు ఎలాంటి జరిమానా లేకుండా అక్టోబర్‌ 21 నుంచి నవంబర్ 11 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. రూ.1000 జరిమానాతో నవంబర్ 12 నుంచి 20వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. ఇంటర్ వార్షిక పరీక్ష ఫీజుల చెల్లింపుకు ఎలాంటి గడువు పొడిగింపు ఉండదని జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.

పరీక్ష ఫీజు ఇలా...

ఇంటర్‌ మొదటి, ద్వితియ సంవత్సరం జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు గ్రూపుతో సంబంధం లేకుండా విద్యార్థులు రూ.600 ఫీజు చెల్లించాలి.

ఇంటర్ జనరల్, ఒకేషనల్‌ కోర్సులు చదువుతున్న మొదటి, ద్వితియ సంవత్సరం విద్యార్థులు రూ.275 ప్రాక్టికల్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

ఇంటర్‌ జనరల్‌, ఒకేషనల్‌ కోర్సుల్లో బ్రిడ్జి కోర్సు సబ్జెక్టులు చదువుతున్న అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.165 చెల్లించాలి. బైపీసీ కోర్సులు చదివే విద్యార్థులు మ్యాథ్స్‌ బ్రిడ్సి కోర్సు కోసం కూడా ఫీజు చెల్లించాలి.

రెండో సంవత్సరం ఒకేషనల్‌ బ్రిడ్జి కోర్సు ఫీజుగా రూ.165 చెల్లించాల్సి ఉంటుంది.

ఇంటర్‌ మొదటి, ద్వితియ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న జనరల్, ఒకేషనల్ విద్యార్థులు సబ్జెక్టులతో సంబంధం లేకుండా జనరల్, ఒకేషనల్‌ కోర్సులకు రూ.1200 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

సబ్జెక్టుల సంఖ్యతో సంబంధం లేకుండా మొదటి, ద్వితియ సంవత్సరం జనరల్, ఒకేషనల్‌ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రూ.550 ఫీజు చెల్లించాలి.

రెండు సంవత్సరాల జనరల్, ఒకేషనల్‌ బ్రిడ్జి కోర్సు సబ్జెక్టు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రూ.330 చెల్లించాలి.

ఇంటర్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, మార్కుల్లో పురోగతి కోసం మొదటి, ద్వితియ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న విద్యార‌్థులు ఆర్ట్స్‌ గ్రూపులైతే రూ.1350, సైన్స్‌ గ్రూపులైతే రూ.1600 ఫీజు చెల్లించాలి.

జూనియర్‌ కాలేజీలు పరీక్ష ఫీజులను ఐడిబిఐ బ్యాంకు రింగ్‌ రోడ్డు బ్రాంచి విజయవాడ, ఎస్‌బిఐ మాచవరం బ్రాంచిలో చెల్లుబాటు అయ్యేలా తమ కాలేజీ ఖాతాల నుంచి చెల్లించాల్సి ఉంటుంది. ఫీజులను నామినల్ రోల్స్‌ వారీగా చెల్లించాల్సి ఉంటుంది. సంబంధి బ్యాంకుల్లో ఖాతాలు లేని వారు ఫీజులను చెల్లించేందుకు ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా చలాన్ అందుబాటులో ఉంచారు. ఫీజులను https://biev2.apcfss.in/ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.

ప్రైవేట్ విద్యార్థులకు ఫీజు గడువు..

ఇంటర్మీడియట్ పరీక్షలకు ప్రైవేట్‌గా హాజరయ్యే విద్యార్థులు రూ.1500 అటెండెన్స్‌మినహాయింపు కోసం చెల్లించాల్సి ఉంటుంది. నవంబర్ 15లోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నవంబర్ 30లోగా రూ.500 ఆలస్య రుసుముతో చెల్లించవచ్చు.

పదో తరగతి తర్వాత ఏడాది ఖాళీగా ఉన్న విద్యార్థులు ప్రైవేట్‌గా మొదటి సంవత్సరం పరీక్షలకు, రెండేళ్లు అంతకు మించి గ్యాప్‌ ఉన్న వారు ఒకేసారి రెండేళ్ల ఇంటర్ పరీక్షలకు హాజరు కావొచ్చు. ఇంటర్‌ బైపీసీలో పాసైన విద్యార్థులు కూడా మ్యాథమెటిక్స్‌ అదనపు సబ్జెక్టుగా పరీక్షలకు హాజరు కావొచ్చు.

ఇంటర్ పరీక్షలకు గతంలో హాజరై ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులు ఆప్షనల్ సబ్జెక్టులను మార్చుకోవడానికి, కాలేజీలను మార్చుకోడానికి అనుమతిస్తారు.

ఇంటర్ అటెండెన్స్ ఫీజు రాయితీని https://biev2.apcfss.in/ ద్వారా ఆన్లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. హాజరు మినహాయింపు కోరే విద్యార్ధులు పదో తరగతి మార్కుల జాబితా, టీసీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్‌లో మాత్రమే ఫీజులు చెల్లించాలి. పోస్టులో పంపే దరఖాస్తులు స్వీకరించరు. పరీక్ష ఫీజుల చెల్లింపు గడువు ముగియడంతో రూ.1000 ఆలస్య రుసుముతో డిసెంబర్ 5వరకు మాత్రమే ఫీజులు చెల్లిండచానికి అనుమతిస్తారు.

Whats_app_banner