TGPSC Group1: 13ఏళ్ల తర్వాత తెలంగాణలో గ్రూప్1 పరీక్షలు, నిర్వహణపై కొనసాగుతు ఉత్కంఠ, ఆందోళనలు… కోర్టు పిటిషన్లు
TGPSC Group1: తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది.దాదాపు 13ఏళ్ల తర్వాత, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది.హైకోర్టు డివిజన్ బెంచ్లో పిటిషన్లు దాఖలు కాగా,పరీక్షలు వాయిదాకు విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
TGPSC Group1: తెలంగాణలో 13 ఏళ్ల తర్వాత జరుగుతున్న గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అక్టోబర్ నెల 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి వెల్లడించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరి సారి 2011లో గ్రూప్1 పరీక్షల తర్వాత తెలంగాణలో ఇప్పటి వరకు గ్రూప్ 1 పరీక్షలను నిర్వహించలేదు. గత ఎన్నికల సమయంలో గ్రూప్ 1 పరీక్షల సమయంలో పేపర్ లీక్ అంశం వెలుగు చూడటంతో పరీక్షలు రద్దు చేయాల్సి వచ్చింది. సుదీర్ఘ కాలంగా అభ్యర్థులు గ్రూప్ 1 పరీక్షల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో గ్రూప్-1 నిర్వహణలో ఎలాంటి అపోహలు, వదంతులకు తావులేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కమిషన్ ఛైర్మన్ అధికారులను ఆదేశించారు.
పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన శాంతికుమారి, కమిషన్ కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్, డీజీపీ జితేందర్, ఎస్పీడీసీఎల్ ఎండీ ముషా రప్ అలీ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కర్ణన్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు అనుదీప్, శశాంక్, గౌతమీలతో కలిసి సమీక్ష నిర్వహించారు.
సాంకేతికత పరిజ్ఞానం, సోషల్ మీడియా విస్తృతమైన తరుణంలో పరీక్షల నిర్వహణ కమిషన్కు సవాలుగా మారిందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ మహేందర్ రెడ్డి వివరించారు. గ్రూప్-1 ప్రధాన పరీక్షల నిర్వహణకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 16 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో 91883 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు.
రాష్ట్రంలో జిల్లా కలెక్టర్లు నేరుగా పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారని, సంబంధిత జిల్లాల పోలీసు కమి షనర్లు పరీక్షా కేంద్రాల్లో బందోబస్తు ఏర్పాట్లు చూస్తారని వివరించారు. సీనియర్ అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు, ఆయా కేంద్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు సిఎస్ వివరించారు.
గ్రూప్ 1 పరీక్షల కోసం హైదరాబాద్లో 8, రంగారెడ్డిలో 11, మేడ్చల్ జిల్లాలో 27 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కమిషన్ కార్యదర్శి నికోలస్ తెలిపారు. ప్రతి పరీక్ష హాల్, చీప్ సూపరింటెండెంట్ గది, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, టీజీపీఎస్సీ కార్యాలయ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు.
అభ్యర్ధుల బయోమెట్రిక్ హాజరుకు ప్రత్యేక సిబ్బందిని నియమించామని, మధ్యాహ్నం 1.30 గంటల తరువాత పరీక్షా కేంద్రంలోకి ఎవరిని అనుమతించమని స్పష్టం చేశారు. వికలాంగులు పరీక్షలు రాయడానికి సహాయకుల్ని కేటాయించిన వారికి వారి హాల్ టికెట్లపై 'స్క్రైబ్ విషయాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నామని వివరించారు.
వికలాంగులైన వారి కోసం 4 ప్రత్యేక పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. స్క్రైబ్ సాయంతో పరీక్ష రాసేవారికి అదనంగా గంట సమయాన్ని కేటాయిస్తున్నట్లు వివరించారు. గురువారం సాయంత్రానికి పరీక్షలు హాజరయ్యే వారిలో 90 శాతం మంది హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. 20వ తేదీ వరకు హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
గ్రూప్ 1 నిర్వహణపై హైకోర్టులో పిటిషన్
తెలంగాణ గ్రూప్ 1పరీక్షల నిర్వహణపై హైకోర్టు డివిజన్ బెంచ్లో పిటిషన్ దాఖలైంది. గ్రూప్1 ప్రిలిమ్స్ తుది కీలో తప్పులు ఉన్నాయని దాని ఆధారంగా పరీక్షలు నిర్వహిస్తే అర్హులకు అన్యాయం జరుగుతుందని,పరీక్షలు రద్దు చేయాలని కోరినా సింగల్ బెంచ్ అంగీకరించలేదని పిటిషనర్ జి.దామోదర్ రెడ్డి తదితరులు పేర్కొన్నారు. ఈ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది.