APSWREIS Admissions: ఏపీ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్
APSWREIS Admissions: ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సోషల్ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాల సంస్థకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి, జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది.

APSWREIS Admissions: ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలు, ఐఐటీ-మెడికల్ అకాడమీల్లో 5వ తరగతి, జూనియర్ ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ వెలువడింది. ఈ విద్యా సంస్థల్లో ప్రవేశాలను ఏపీ బీఆర్ఏజీ సెట్ 2025 ద్వారా చేపడతారు.
రాష్ట్రంలోని వివిధ క్యాంపస్లలో బాలికలకు 9,750 సీట్లు, బాలురకు 5,270 సీట్లు అందుబాటులో ఉన్నాయి. డా.బి.ఆర్. అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 2026-2026 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉంటుంది. పూర్తి సమాచారం కోసం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల సంస్థ వెబ్సైట్ https://apbragcet.apcfss.in/ లో చూడవచ్చు.
విద్యార్దులు తమ సొంత జిల్లాల్లోని గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్ధులు ఎంచుకున్న గ్రూప్ అక్కడ లేకపోతే జిల్లా జోన్ పరిధిలో ఉన్న మరో గురుకుల కాలేజీలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న తర్వాత మార్పులు చేయడానికి అనుమతించరు. గురుకుల విద్యా సంస్థల్లో ఎంపికైన విద్యార్ధులకు విద్య, వసతి ఉచితంగా కల్పిస్తారు. క్రీడల్లో ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇస్తారు.
జూనియర్ ఇంటర్ రాష్ట్ర వ్యాప్తంగా 164 గురుకుల విద్యాలయాల్లో ఇంటర్లో 5400 ఎంపీసీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. బైపీసీ సీట్లు మరో 5400 ఉన్నాయి. ఎంఈసీలో 800, సీఈసీలో 1600, హెచ్ఈసీలో 360 సీట్లు ఉన్నాయి.
వీటితో పాటు ఐఐటీ IITమెడికల్ Medicalఅకాడమీల్లో మొత్తం 600సీట్లు ఉన్నాయి. వీటిలో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో చెరో 300సీట్లు ఉంటాయి. కృష్ణాజిల్లా ఈడ్పుగల్లులో ఉన్న బాలికల అకాడమీలో ఎంపీసీ, బైపీసీ గ్రూప్లలో ఒక్కో దానిలో 160సీట్లు ఉన్నాయి. కర్నూలు జిల్లా చిన్న టేకూర్లోని బాలుర అకాడమీలో ఒక్కో గ్రూపులో 60సీట్లు, గుంటూరు-అడవి తక్కెళ్లపాడు బాలుర అకాడమీలో ఒక్కో గ్రూపులో 80సీట్లు అందుబాటులో ఉన్నాయి.
పదో తరగతి విద్యార్హత...
ప్రస్తుతం పదోతరగతి పరీక్షలకు సిద్దం అవుతున్న విద్యార్ధులు జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు మీడియంలో చదువుకున్న విద్యార్దులు కూడా గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2025ఆగష్టు 31 నాటికి అభ్యర్ధుల వయసు 17ఏళ్లు దాటకూడదు.
ఎంట్రన్స్ పరీక్షను ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు. మొత్తం 100మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ఏపీ పదో తరగతి సిలబస్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. గణితంలో 25, ఫిజికల్ సైన్స్, బయాలజీ, సోషల్ , ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో ఒక్కో దాన్నుంచి 15 ప్రశ్నలు ఉంటాయి. ఓఎంఆర్ షీట్పై సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు.
ఏపీ అంబేడ్కర్ గురుకుల విద్యా సంస్థల్లో 5వ తరగతి, జూనియర్ ఇంటర్ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోడానికి ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకొవచ్చు. మరిన్ని వివరాలకు https://apbragcet.apcfss.in లో చూడవచ్చు.