Minor Girl: బాలికపై అత్యాచారం, నమ్మించి మోసగించిన ఘటనలో ఒక యువకుడికి 20 ఏళ్లు జైలు శిక్షను కాకినాడ ప్రత్యేక పోక్సో కోర్టు విధించింది. అలాగే రూ.5,000 జరిమానా కూడా వేసింది. ఐదేళ్ల క్రితం నాటి కేసులో కోర్టు ఈ శిక్ష విధించింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా వై.రామవరం మండలం, ఎర్రంరెడ్డి పాలెంకు చెందిన మద్దికొండ సుధాకర్ (27) 2019 అక్టోబర్ లో అదే గ్రామానికి చెందిన ఒక బాలికను లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఆ బాలికను నమ్మించి మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి బలవంతంగా వైజాగ్ తీసుకెళ్లాడు. దీంతో ఆ బాలిక కుటుంబ సభ్యులు రంపచోడవరంలో ఏఎస్పీకి 2019 అక్టోబర్ 4కి ఫిర్యాదు చేశారు. రేప్, కిడ్నాప్ కేసు నమోదు చేసి విచారించారు. అనంతరం పోక్సో కేసు నమోదు చేశారు.
బాలికను నమ్మించి మోసగించడమే కాకుండా, ప్రలోభాలకు మద్దికొండ సుధాకర్ గురిచేశాడు. ఆ బాలికను ప్రేమించినట్టు మోసం చేశాడు. అలాగే పెళ్లి చేసుకుంటానని కూడా ప్రలోభాలకి దిగాడు. ఏకంగా విశాఖపట్నం తీసుకెళ్లిపోయాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి ఏఎస్పీ వకూల్ జిందాల్ నిందితుడు మద్దికొండ సుధాకర్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.
దర్యాప్తు ముగించి ప్రత్యేక పోక్సో కోర్టుకు నివేదించారు. దర్యాప్తు అనంతరం సాక్ష్యాధారాలను పరిశీలించిన కాకినాడ ప్రత్యేక కోర్టు మేజిస్ట్రేట్ కొండపల్లి శ్రీదేవి నిందితుడికి శిక్షను ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చారు. కిడ్నాప్ కేసుకు సంబంధించి ఆరు నెలల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించారు. అలాగే పోక్సో కేసుకు సంబంధించి 20 ఏళ్ల జైలు శిక్ష, అలాగే రూ. 5,000 జరిమానా విధించారు.
కోర్టులో నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైందని సిఐ వాసా వెంకటేశ్వరావు వెల్లడించారు. నిందితుడిని శిక్ష పడేందుకు సాక్షులను ప్రవేశపెట్టేందుకు తీవ్రంగా శ్రమించిన హెచ్ సీ కోటి, కోర్టు మానిటరింగ్ సెల్ ఇన్ స్పెక్టర్ కృష్ణ కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పితాని శ్రీనివాసరావును ఎస్పీ తుహిన్ సిన్హా అభినందించారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)